
చొరబాటుదారులను గుర్తిస్తాం
● కోస్టుగార్డు, మైరెన్ అధికారుల వెల్లడి
ముత్తుకూరు: సముద్రంలో 250 నాటికల్ మైళ్ల దూరం వరకు చొరబాటుదారులు ఎవరైనా ప్రవేశిస్తే వెంటనే గుర్తించగలిగే సామర్థ్యం ఉందని కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డు డిప్యూటీ కమాండెంట్ సీహెచ్ లోకేశ్, మైరెన్ సీఐ వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. కృష్ణప ట్నం పంచాయతీ ఆర్కాట్పాళెంలో శుక్రవారం మత్స్యకారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమాండెంట్ మాట్లాడుతూ సముద్రంలో వేట చేసే సమయంలో కొత్త వ్యక్తులు, బోట్లు కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. బోటు కండిషన్లో ఉంటేనే వేటకు వెళ్లాలన్నారు. బయోమెట్రిక్ కార్డులు దగ్గర ఉంచుకోవాలని, బోటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మైరెన్ సీఐ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తారని, తమిళనాడులోని కడలూరు బోట్లు ఇటు వైపు రాకుండా చర్యలు తీసుకొంటామని చెప్పారు. పలువురు మత్స్యకారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంఘమిత్ర చరిత పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
పొదలకూరు : మండలంలోని వావింటపర్తి గ్రామానికి చెందిన గౌతమ్ అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్టు కండలేరు డ్యామ్ పోలీస్స్టేషన్లో శుక్రవారం బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన గౌతమ్ తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకారంగా ఉంటున్నాడు. గురువారం ఉదయం నిమ్మతోటలో పనులు చేసేందుకు వెళ్లిన విద్యార్థి కనిపించకుండా పోయాడు. తోటలోనే ఉన్న తల్లిదండ్రులు చాలా సేపటి వరకు కొడుకు రాకపోవడంతో ఆందోళన చెంది చుట్టు పక్కల ఆరా తీశారు. సెల్ఫోన్ సైతం గౌతమ్ నిమ్మ చెట్టు కింద పడేసి ఉండడంతో ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది.
పిడుగుపడి
గడ్డివామి దగ్ధం
సోమశిల: పిడుగు పడి గడ్డివామి దగ్ధమైన ఘటన మండలంలోని లింగంగుంటలో శుక్రవారం జరిగింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురు గాలులతోపాటు రైతులు మాదిరెడ్డి యశోదకృష్ణ, బాలకృష్ణకు చెందిన గడ్డివామిపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేస్తూనే అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమా రు 700 గడ్డి మోపులు కాలి బుడిదయ్యాయి.
డీఎస్సీ అభ్యర్థులకు
ఉచిత ఆన్లైన్ శిక్షణ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): డీఎస్సీకి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణి పి.వెంకటలక్ష్మమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతోపాటు టెట్ అర్హత మార్కుల పత్రం, నివాస, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలను నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు ఉన్న ఈ–సేవ పాత భవనంలోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలన్నారు. జిల్లా వాసులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. వివరాలకు 93815 54779, 93902 39588 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

చొరబాటుదారులను గుర్తిస్తాం

చొరబాటుదారులను గుర్తిస్తాం