●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అడిగితే రెచ్చిపోయిన టీడీపీ ప్రజాప్రతినిధులు | - | Sakshi

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అడిగితే రెచ్చిపోయిన టీడీపీ ప్రజాప్రతినిధులు

Published Fri, Jan 31 2025 12:46 AM | Last Updated on Fri, Jan 31 2025 12:46 AM

●రసాభ

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ

●జెడ్పీటీసీలకు అడుగడుగునా అడ్డు ●ఆద్యంతం గందరగోళం ●ప్రజా సమస్యలపై చర్చించకుండానే ముగింపు

అనంతపురం సిటీ: టీడీపీ ప్రజాప్రతినిధుల పుణ్యమా అని అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. హామీలపై ప్రశ్నించిందే తప్పన్నట్లుగా ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. అడుగ డుగునా అడ్డంకులు సృష్టించారు. దీంతో ప్రజల సమస్యలు చర్చకు రాకుండానే సమావేశం ముగించాల్సి వచ్చింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం గురువారం జెడ్పీ సమావేశ ప్రధాన భవన్‌లో నిర్వహించారు. మంత్రి సవిత, విప్‌ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ మంగమ్మ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారఽథి, అనంత పురం అర్బన్‌, మడకశిర ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ హాజరయ్యారు. సీఈఓ రాజోలి వీరారెడ్డి చర్చను ప్రారంభించగా.. సభను జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ కొనసాగించారు.

ఆద్యంతం అడ్డు..

సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసేలా సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు బోగాతి విజయప్రతాప్‌రెడ్డి కోరగా.. నేరుగా సమాధానమివ్వని మంత్రి సవిత, విప్‌ కాలవ, ఎంపీ బీకే, ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్‌,రాజులు గత ప్రభుత్వంలో ఏం చేశారంటూ రెచ్చిపోయారు. అంతలోనే ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు... తమ ప్రభుత్వం వాట్సాప్‌ ద్వారా 161 సేవలను అందుబాటులోకి తెస్తోందని, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని కోరడంపై జెడ్పీ సభ్యులు మండి పడ్డారు. గత ప్రభుత్వం గురించి అనవసరమని, మీరేం చేస్తారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. తాను టీడీపీ నుంచి గెలవడంతో నిధుల కేటాయింపులో పక్షపాతం చూపారని అగళి జెడ్పీటీసీ ఉమేష్‌ ఆరోపించగా.. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజు సైగ చేయగా, జెడ్పీటీసీ ఉమేశ్‌ గట్టిగా అరుస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు సైతం మూకుమ్మడిగా పోడియం వైపు రావడంతో రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ తమకు 63 మండలాలూ సమానమేనని, అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయిస్తూ వచ్చామన్నారు. అగళి జెడ్పీటీసీ ఏ రోజూ తమకు పనులు కావాలని అడిగింది లేదని, 10 రోజుల క్రితం రూ.90 లక్షలకు ప్రతిపానదలు తీసుకువచ్చి వెంటనే మంజూరు చేయాలంటూ పట్టుబట్టారన్నారు. రూ.30 లక్షలు ఇస్తున్నట్లు చెప్పినా పేపర్లు విసిరి వెళ్లిపోయాడన్నారు. సీఈఓ రామచంద్రారెడ్డి కల్పించుకుంటూ నిధులు ఇచ్చినా లేదంటూ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. దీనిపై టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రతిస్పందిస్తూ సభలో అల్లరి చేశారు.

తమ్ముళ్లకు పర్సంటేజీలు ఇవ్వాలట..

జెడ్పీ నిధులతో చేపట్టే పనుల్లో పర్సంటేజీలు ఇవ్వడం లేదంటూ తెలుగు ‘తమ్ముళ్లు’ పనులు అడ్డుకుంటున్నారని కదిరి జెడ్పీటీసీ సభ్యురాలు భుక్యా రాధాబాయి ఆరోపించారు. దీనిపై మంత్రి సవిత, విప్‌ కాలవ, ఎంపీ బీకే, ఎమ్మెల్యేలు దగ్గుబాటి, ఎంఎస్‌ రాజు అభ్యంతరం తెలపడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు దీటుగా సమాధానమిచ్చారు. బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్‌ మాట్లాడుతూ.. ఇటీవల తమ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారని, అయితే డబ్బు కడితేనే వైద్యం చేస్తామని చెప్పడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఎంహెచ్‌ఓ భ్రమరాంబదేవి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎంపీ బీకే ఆగ్రహం వ్యక్తం చేశారు. మడకశిర ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ.. అనంతపురం కిమ్స్‌ సవేరా ఆస్పత్రిలో సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి బిల్లులు ఇవ్వడం లేదని, రోగులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. తమ నియోజకవర్గంలో 108లు మూలనపడ్డాయని, ఒకే ఒక 108 పని చేస్తోందని తెలిపారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో దంత సమస్యలకు వైద్యం చేయడం లేదని, చిన్న కేసునూ బయటి ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారని నార్పల జెడ్పీటీసీ సభ్యురాలు వేదాంతం నాగరత్నమ్మ తెలిపారు. 108 అంబులెన్స్‌లో సౌకర్యాలు లేకపోవడంతో రోగులను ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత పడుతున్నారని అనంత పురం జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌ పేర్కొన్నారు. హిందూపురంలో జిల్లా స్థాయి ఆస్పత్రి ఉన్నా.. చిన్న కేసునూ అనంతపురానికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు లేపాక్షి జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. దీనిపై శ్రీసత్యసాయి జిల్లా డీసీహెచ్‌ఎస్‌ నాయక్‌.. డాక్టర్ల కొరతతో ఇలా చేయాల్సి వస్తోందని తెలిపడంపై ఎంపీ బీకే అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్ల కొరత నెపం చూపి తప్పించుకోవాలని చూడొ ద్దన్నారు. తమ మండలంలోనూ వైద్య సేవలు సరిగా అందడం లేదని బెళుగుప్ప ఎంపీపీ పెద్దన్న, వజ్రకరూరు ఎంపీపీ రమావత్‌ దేవి ఆరోపించారు.

కంది కొనుగోలులో ఆంక్షలా..?

కంది కొనుగోలు విషయంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు చూసి రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. కేవలం మూడు క్వింటాళ్లు కొనాలని షరతు విధించడం సరికాదన్నారు. విప్‌ కాలవ స్పందిస్తూ.. బయటి మార్కెట్‌కు, ప్రభుత్వ ధరకు మధ్య క్వింటాలుకు రూ.1,000 వ్యత్యాసం ఉందని, 5 క్వింటాళ్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. బ్రహ్మసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. తమ మండలంలో అన్ని శాఖలకు ఇన్‌చార్జ్‌ అధికారులే దిక్కు కావడంతో పనులు జరగడం లేదని చిలమత్తూరు జెడ్పీటీసీ అనూష అధికారుల దృష్టికి తెచ్చారు. వివిధ పనుల నిమిత్తం అనంతపురానికి వస్తే.. కనీసం అతిథి గృహ సదుపాయం కూడా లేదని, శిథిలావస్థకు చేరిన జెడ్పీ అతిథి గృహాలకు మరమ్మతులు చేయాలని కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు కోరారు. తమ ప్రాంతానికి వచ్చే పల్లె వెలుగు బస్సుకు కండక్టర్‌ లేకుండా వన్‌మ్యాన్‌ సర్వీసును నడపడం వల్ల ఒక విద్యార్థి మృత్యువాతపడ్డాడని విడపనకల్లు జెడ్పీటీసీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు.

నువ్వాగమ్మా.. నీకేం తెలీదు

జెడ్పీ సమావేశంలో ఎంపీ బీకే పార్థసారథి చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మను ఏకవచనంతో సంబోధించడం, నువ్వాగమ్మా.. నీకేం తెలీదు అంటూ తక్కువ చేసి మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్‌పర్సన్‌ను ఏకవచనంతో మాట్లాడటం ఇదేం సంస్కారమంటూ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా చర్చించుకోవడం కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ1
1/3

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ2
2/3

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ3
3/3

●రసాభాసగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ●‘సూపర్‌ సిక్స్‌’పై అ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement