రిమ్స్ సమస్యలపై కలెక్టర్ ఆరా
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల సమస్యలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ‘రిమ్స్ విద్యార్థుల ఆకలి కేకలు, రిమ్స్ హాస్టల్లో కాలకృత్యాలుకూ కష్టమే’ శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. తొలుత విద్యార్థి నాయకులను పిలిపించి మాట్లాడారు. హాస్టల్లో మెస్ విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తోందని, వారు సరైన ఆహారం సరఫరా చేయని పక్షంలో వారిని మార్చే వెసులుబాటు ఉందన్నారు. విద్యార్థులంతా సమావేశమై ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రిన్సిపాల్, వార్డెన్లతో మాట్లాడి సరైన ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఏపీఎంహెచ్ఐడీసీ అధికారులను పిలిపించి మరుగుదొడ్ల సమస్య లేకుండా చూడాలన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, తాగునీరు సమస్య పరిష్కరించాలని సూచించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
టెక్కలి: కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారిలో పెద్దబమ్మిడి సమీపంలో ఈ నెల 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావుపేట గ్రామానికి చెందిన బాన్న ప్రత్యుష(29) గురువారం మృతి చెందింది. తన భర్త నడుపుతున్న ఆటోలో ప్రయాణిస్తూ కారును ఢీకొనడంతో ప్రత్యుష తీవ్రంగా గాయపడింది. భార్యభర్తలు ఇరువురు డాన్సు మాస్టర్లుగా పని చేసేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఎస్ఐ వి.సత్యన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ మృతదేహం నగర వాసిదే
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని హయాతినగరం సమీప నాగావ ళి నదీ తీరంలో బుధవారం కలకలం రేపిన మృతదేహం వివరాలను పోలీసులు గుర్తించారు. మీడియాలో కథనాలు చూసి కుటుంబ సభ్యులే గుర్తుపట్టి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని తోటపాలెం జంక్షన్ సమీప నీలమ్మకాలనీకి చెందిన దండు త్రినాథరావు (45) మద్యానికి బానిసయ్యాడు. ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకెళ్లి కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదని భార్య వెంకటలక్ష్మి వాపోయారు. త్రినాథరా వు పీఎస్ఎన్ఎం స్కూల్ సమీప దుకాణంలో కమ్మరి పనిచేస్తుండేవాడు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
రిమ్స్ సమస్యలపై కలెక్టర్ ఆరా
Comments
Please login to add a commentAdd a comment