
రాష్ట్ర కార్యక్రమంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం, శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో నూతనంగా నిర్మించిన బీసీ భవన్ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
పురుషోత్తపురంలో
తగ్గుతున్న డయేరియా
ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురంలో డయేరియా గురువారానికి తగ్గుముఖం పట్టింది. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి జూహితా, ఇతర సిబ్బంది ఇంటింటా సర్వే చేసి వైద్య సేవలు అందజేశారు. పురుషోత్తపురంలో బావి నీరు ఉపయోగిస్తున్నారని, ఆ బావిలో చెత్త వేయకుండా చూసు కోవాలని వైద్యాధికారి జూహితా తెలిపారు. అయితే గ్రామంలో బహిరంగ మలవిసర్జన సమస్యగా ఉందని, దాన్ని అరికట్టాలని కొందరు కోరారు. కాలువల్లోనూ మురికి పేరుకుపోయి ఉందని తెలిపారు.
టెక్కలి డీఎస్పీగా భార్గవి
శ్రీకాకుళం క్రైమ్, టెక్కలి: టెక్కలి డీఎస్పీగా ఎన్.భార్గవి మర్రివాడ రానున్నారు. ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న ఈమె టెక్కలిలో తొలిపోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ మేరకు మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వచ్చాయి. టెక్కలిలో ఇదివరకు పనిచేసిన డీవీవీఎస్ఎన్ మూర్తి ఇటీవల ఉద్యోగవిరమణ పొందిన విషయం విదితమే.
ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన
సాక్షి టాస్క్ఫోర్స్: జలుమూరు మండలం పెద్దదూగాం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ధర్మాన రామారావు తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వీడి యో విడుదల చేశారు. బుద్ధల భాస్కరరావు అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆయన ఆరోపించారు. విడతల వారీగా రూ.68 లక్షల వరకు కాజేశాడని, పిల్లల చదువులకు ఇప్పు డు తాను ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో పేర్కొన్నారు. తన లాగానే పరిసర గ్రామాల ప్రజల వద్ద కూడా డబ్బులు వసూ లు చేశాడని, కూతురి పెళ్లి కోసం ఉంచుకున్న డబ్బును సైతం అతడికే ఇచ్చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాగా భాస్కరరావు మాయలో ఎవరూ పడవద్దని కోరారు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, తనకు పోలీసులు న్యాయం చేయాలని, ఇది కేవలం తన వ్యక్తిగత సమస్య అని రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
పోలాకి: మండలంలోని చీడివలన గ్రామంలో పొట్నూరు అప్పన్న ఇంటివద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 2.6 క్వింటాళ్ల రేషన్ బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్ఓ సూర్యప్రకాశ రావు, సీఎస్డీటీ రామకృష్ణ కచ్చితమైన సమాచారం మేరకు అక్కడకు చేరుకుని బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ తెలిపారు.

రాష్ట్ర కార్యక్రమంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి