
ఫీజులు
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక అవస్థలు
● కళాశాలల ఒత్తిడితో అప్పులు చేస్తున్న వైనం
● ఆర్థిక భారంతో ప్రైవేటు కళాశాలలు
● మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజులదీ అదే దారి
● రూ.106.75 కోట్లకు పైగా బకాయిలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ప్రైవేటు కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కట్టకపోతే పిల్లలను ఏ రోజు కాలేజీ నుంచి ఇంటికి పంపుతారో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. చదువు పూర్తయినా సర్టిఫికెట్ల విషయంలో సతాయిస్తుండటంతో నిత్యం భయపడుతూ గడుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో.. కాలేజీల నిర్వహణ కోసం విద్యార్థులే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చాక తిరిగి తీసుకోవాలని చెబుతున్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెప్పే పరిస్థితి వచ్చేసింది. దీంతో వారి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా సర్కారు మాత్రం రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయడం లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తే చేసిన అప్పులతో పాటు తమ ఖర్చులకు ఇబ్బందులు ఉండవని విద్యార్థులు నెలలు తరబడి వేచి చూస్తున్నారు. జిల్లాలో 45,657మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.106కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడి ఉంది.
మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు సున్నా..
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు(ఎంటీఎఫ్) కూడా చెల్లించలేదు. 2024–25 విద్యా సంవత్సరంలో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. వాస్తవానికి డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ చదువుతున్న వారికి ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు, ఐటీఐ, డిప్లమో చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 45,657 మంది విద్యార్థులు ఎంటీఎఫ్కు నోచుకోలేదు. దీంతో వసతి కష్టాలు తప్పడం లేదు.
●
గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన బోర హరి విశాఖపట్నం ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి తవిటినాయుడు గారలో ఓరైస్ మిల్లులో కలాసీగా పనిచేస్తున్నాడు. తనలాగా కాకుండా కుమారుడిని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడ్ని చేయాలన్నది ఆయన కల. అయితే ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో యాజమాన్యం డబ్బులు చెల్లించాలని చెబుతోంది. ముందుగా మీరు డబ్బులు చెల్లించాలని, ప్రభుత్వం వేసినప్పుడు మీరే ఉంచుకోవాలని చెబుతున్నారు. రోజు వారీ కూలీపై ఆధారపడే కుటుంబం కావడంతో విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు.
అప్పు కోసం ప్రయత్నాలు..
కొడుకు చదువుతున్న కాలేజీ నుంచి డబ్బులు కట్టమని చెబుతున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశాం. ఏడాది పూర్తవుతోందని ఫీజు మీరే కట్టాలని అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. అప్పు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలి.
– బోర తవిటినాయుడు, విద్యార్థి తండ్రి, రైసు మిల్లు కలాసీ, గార మండలం
ఆమదాలవలస పట్టణంలోని మెట్టక్కివలస ప్రాంతంలో సీతారాంనగర్ లో నివాసముంటున్న పైడి నవ్యశ్రీ టెక్కలిలోని ఐతమ్ ఇంజినీరింగ్ కాలేజిలో గత ఏడాది జాయినయ్యింది. గత ప్రభుత్వం మాదిరిగా ఈ సర్కారు కూడా సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందని భావించింది. అయినా ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థి ని ఆందోళన చెందుతోంది. వేలాది రూపాయల ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి వస్తుండటంతో ఎలా చెల్లిస్తారో తెలియక భయాందోళనకు గురవుతోంది. ఇంజినీరింగ్ పూరి చేసి ఉన్నత శిఖరాలకు వెళ్లాలనే ఆశయం నీరుకారేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కాలేజ్ నుంచి ఒత్తిడి..
ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే నమ్మకంతో నా కుమార్తెను టెక్కలిలోని ఐతం కళాశాలలో ఇంజనీరింగ్లో చేర్పించాను. మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాకు రోజువారి పనిలో సంపాదించింది కుటుంబ పోషణకు మాత్రమే సరిపోతుంది. ఏడాదికి సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. అంత మొత్తంలో ఖర్చులు పెట్టలేను. ఇటీవల కళాశాల నుంచి ఫోన్చేసి మొత్తం డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఏం చెయ్యాలో తోచడంలేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నా కుమార్తెకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చూడాలి. – పైడి లోకేశ్వరరావు, విద్యార్థిని నవ్యశ్రీ తండ్రి, ఆమదాలవలస
డిగ్రీ, పీజీ, మెడికల్,
ఇంజనీరింగ్ వారికి ఏడాదికి ఇవ్వాల్సిన ఫీజు
రూ.20 వేలు
(ఒక్కో విద్యార్థికి)
మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజుకు అర్హులైన
విద్యార్థుల సంఖ్య 45,657
జిల్లాలో ఫీజు
రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల
సంఖ్య : 45,657
ఇప్పటి వరకు
విడుదలైన
నిధులు రూ.35.58
కోట్లు
2024–25లో రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.142.34
కోట్లు
ఇంతవరకు విడుదల చేసిన నిధులు
0
రావల్సిన
బకాయిలు రూ.106.75
కోట్లు

ఫీజులు

ఫీజులు

ఫీజులు

ఫీజులు