సూర్యాపేట: నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇప్పటికే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సందట్లో సడేమియాలాగా ఏదీ కొనుగోలు చేసినా వినియోగదారులను కొందరు వ్యాపారులు తూకాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. తూనికలు, కొలతల్లో బురిడీతో వినియోగదారులు రోజూ అడుగడుగునా మోసపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్ బంక్, కిరాణా దుకాణం, రేషన్్ షాపు దగ్గర నుంచి పండ్లు, మాంసం, కూరగాయలు, వస్త్రాలు, చివరకు బంగారం వస్తువులు కూడా కొలతల ప్రకారం అమ్మాల్సిందే. అయితే వీటి అమ్మకాల్లో నమ్మకం కొరవడుతోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు వచ్చినా మోసాలు చేసే వ్యాపారుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో మోసాలపై జిల్లా కేంద్రంలో పలు దుకాణాలను ‘సాక్షి’ విజిట్ చేసి వాస్తవాలను పరిశీలించింది.
పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు
● జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్లో తూకంలో తేడాలు కనబడలేదు. కాలం చెల్లిన సరుకులు కూడా కనబడలేదు.
● కూరగాయలు, చేపల మార్కెట్లలో మాత్రం ఆమోదిత తూనిక రాళ్లకు బదులు సాధారణ రాళ్లను వినియోగిస్తున్నారు.
● జిల్లా కేంద్రంలో పలు దుకాణాల్లో ప్యాకింగ్ వస్తువులు కాకుండా లూజ్గా వస్తువులను విక్రయిస్తున్నారు.
ముద్రలు లేవు.. నామమాత్రంగా కేసులు
జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 1.10 లక్షల వరకు ఉన్నాయి. రెండేళ్లకోసారి కాంటాలు, తూకం రాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాంటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల ఈ పరిస్థితే కనిపించడం లేదు. జిల్లాలో తూనికలు, కొలతల పరికరాలు అమ్మడానికి కేటగిరీ–1 కింద సూర్యాపేటలో మూడు దుకాణాలకు అనుమతి ఉండగా, కేటగిరీ–2 సూర్యాపేటలో ఒక దుకాణం, కోదాడలో ఒక దుకాణం అనుమతులు పొందాయి. ఇక తూనికలు పరికరాలకు స్టాంపింగ్ వేసేందుకు సూర్యాపేటలో నలుగురు, కోదాడలో ఇద్దరు అనుమతి పొంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి కేవలం 96 కేసులే నమోదయ్యాయి. అసలు ఈ శాఖలో సిబ్బంది ఎవరూ లేకపోవడం, జిల్లా అధికారి పోస్టు కూడా గతంలో మూడు నెలల పాటు ఖాళీగా ఉండడం గమనార్హం.
ఫ కొలతల్లోనూ అదేతీరు
ఫ దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో నిత్యం మోసమే..
ఫ నిలువు దోపిడీకి గురవుతున్న
వినియోగదారులు
ఫ ‘సాక్షి’ విజిట్లో
వాస్తవాలు బట్టబయలు
నేడు జాతీయ వినియోగదారుల
హక్కుల దినోత్సవం
సూర్యాపేట పట్టణంలోని కూరగాయల దుకాణంలో ఓ వ్యక్తి అరకిలో వంకాయలు కొనుగోలు చేశాడు. అయితే అవి వెయింగ్ మెషిన్లో కాకుండా చేతి కాంటాలో తూకం రాయి కాకుండా మాములు రాయితో జోకాడు. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి మరో దుకాణంలో వెయింగ్ మిషన్పై జోకడంతో 400 గ్రాములే వచ్చింది. దీంతో ఆ వ్యక్తి సదరు కూరగాయాల వ్యాపారి వద్దకువెళ్లి గొడవ చేయగా తొందరలో జోకాను అని చెప్పి మళ్లీ కొలత రాయితో జోకి అరకిలో నిండుగా ఇచ్చాడు. ఇలాంటి మోసాలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు
తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నా.. మోసం జరిగినట్లు గుర్తించినా వినియోగదారులు మా శాఖకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వినియోగదారులకు మోసాలు జరిగితే సహించేది లేదు.
– చిట్టిబాబు, జిల్లా తూనికలు
కొలతల శాఖ అధికారి, సూర్యాపేట
తూకాల్లో గోల్మాల్!