
ఇది.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
చివ్వెంల(సూర్యాపేట) : కాలం తెచ్చిన కరువు కాదు.. మూమ్మాటికీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని మొగ్గయ్యగూడెంలో ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల ఉసురు తీస్తూ, రాక్షసానందం పొందుతున్నారన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మూడే కాంగ్రెస్ సిద్ధాంతాలని వ్యాఖ్యానించారు. పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని, మళ్లీ కన్నీరు పాలు చేసిన పాపం కాంగ్రెస్ దే అని ఆరోపించారు. పొట్టకొచ్చిన పంటలను నీళ్లులేక పశువులకు అమ్ముకునే పరిస్థితితీసుకొచ్చారని మండిపడ్డారు. ఎడాదిన్నర కాకముందే అన్ని రంగాల్లో ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత ఒక్క ఎకరం కూడా ఎండి పోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోయాయన్నారు. కాళేశ్వరం నీరు కాకుండా ఎస్సారెస్పీ నీళ్లు అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ కాళేశ్వరం తమకు అప్పగిస్తే ఒక్క ఎకరం ఎండిపోకుండా చూస్తామన్నారు. ఎండి పోయిన పంట పొలాలు, రైతన్నల గురించి ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. దావత్లకు పోవడానికి హెలికాప్టర్లు దోరుకుతున్నాయి గానీ, ఎండిన పొలాలను పరిశీలించడానికి సమయం దొరకట్లేదని పేర్కొన్నారు. ఎండి పొలాలను, రైతన్నల కష్టాలను ఎక్కిరించడానికి సీఎం జిల్లా కు వస్తున్నట్లు ఉందని అన్నారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ చేసిన మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని ఆరోపించారు. వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. మంత్రులకు శాఖల గురించి అర్థంకాక పోతే అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ ముందుచూపుతో అద్భుత ప్రణాళికతో రాష్ట్రాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తిర్చి దిద్దాడని అన్నారు. కనీసం ఒక్క తడైనా నీరు అందిస్తే కొంతమంది రైతులన్నా అప్పుల బారిన పడకుండా ఉంటారన్నారు. స్థానిక మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించి ఇంకొక్క తడి నీరు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు ఉన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి