
ఇక..‘పోలీస్ ప్రజా భరోసా’
సూర్యాపేట టౌన్: గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ ప్రజా భరోసా పేరుతో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక అంశాలు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ప్రతి బుధవారం ఒక గ్రామాన్ని ఎంచుకొని..
జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది సర్కిళ్లు ఉండగా అందులో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు అందుబాటులో ఉండేలా చూస్తూ ప్రతి బుధవారం పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామ పోలీస్ అధికారి పనిచేస్తారు. అలాగే ఎస్పీ కూడా ప్రతివారం ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
అవగాహన కల్పించే అంశాలు ఇవే..
● ప్రతిఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకునేలా చట్టాల గురించి తెలపడం.
● పోలీసులు మీ భద్రత కోసం ఉన్నారని, ఇతరుల ఆస్తులపై దాడులు చేయవద్దని వివరించుట.
● సమాజంలో అవగాహన లోపం వల్ల నేరాలకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకోవద్దు అనే విషయాలను తెలుపుట.
● గ్రామాల్లో అలజడి వాతావరణం, సమస్యలు సృష్టించే వారిలో మార్పు తీసుకురావడం.
● సామాజిక సమస్యలను గుర్తించి వాటిని నిర్మూలించడం కోసం, తద్వారా గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించుట.
● సమస్యాత్మక గ్రామంగా పోలీస్ రికార్డ్లో ఒకసారి పేరు నమోదైతే ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందని అవగాహన పర్చుట.
● ఒక వ్యక్తిపై రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్గా పోలీస్ రికార్డ్లో నమోదైతే జీవితకాలం ముద్ర అలాగే ఉంటుందని వివరించుట.
● మహిళలను గౌరవించాలి, మహిళలు, పిల్లలను వే దిస్తే కేసులు నమోదు చేసి జీవితకాలం శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుందని వివరించుట.
● అపరిచితులు ఫోన్, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ ల ద్వారా తెలిపితే నమ్మి అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పడం.
● బెట్టింగ్లు పెట్టవద్దని పేర్కొనడం.
● రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపొద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించడం.
● గంజాయి లాంటి మాదకద్రవ్యాలు గ్రామాల్లోకి రానివ్వద్దని, ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఫ ప్రతిఒక్కరినీ సన్మార్గంలో
నడిపించడమే లక్ష్యం
ఫ గొడవలు సృష్టించే వారిపై పక్కా నిఘా
ఫ ప్రత్యేక కార్యక్రమానికి ఎస్పీ నరసింహ శ్రీకారం
ఫ గ్రామాల్లో ప్రతి బుధవారం కార్యక్రమం
యువతలో మార్పు కోసమే : ఎస్పీ నరసింహ
గ్రామాల్లోని యువత చెడుమార్గంలో వెళ్లకుండా వారు సన్మార్గంలో వెళ్లేలా మార్పుతేవడం కోసమే పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ప్రారంభించామని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేరాల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే, విదేశాలకు వెళ్లే, పైచదువుల విషయంలో సమస్యలు వస్తాయన్నారు. ఏ వ్యక్తిపై అయినా ఒకసారి రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ లాంటిది నమోదైతే జీవితాంతం ఆ మచ్చ అలాగే ఉంటుందని తెలిపారు. సైబర్ మోసాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్న, మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోవడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.