
నల్లగొండ రీజియన్కు 152 ఎలక్ట్రిక్ బస్సులు
భానుపురి (సూర్యాపేట): నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో బస్సుల కొరత తీరనుంది. డొక్కబస్సుల స్థానంలో త్వరలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. నల్లగొండ రీజియన్కు 152 బస్సులను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 41 ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట డిపోకు చేరుకున్నాయి. మిలిగిన బస్సులు త్వరలోనే ఆయా డిపోలకు రానున్నాయి. ఈ బస్సులన్నీ చార్జింగ్తోనే నడవనున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట, నల్లగొండలో ఈ చార్జింగ్ పాయింట్ల పనులు వేగంగా సాగుతున్నాయి.
రెండుచోట్ల చార్జింగ్ పాయింట్లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఈ బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో ప్రధాన బస్టాండ్ అయిన సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చార్జింగ్ పాయింట్లో రోజుకు ఐదారు బస్సులకు మాత్రమే చార్జింగ్ పెడుతున్నారు. సూర్యాపేట డిపోకు దాదాపు 77 బస్సులు రావడంతో కొత్తబస్టాండ్ డిపో ఆవరణలోనూ చార్జింగ్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నల్లగొండలో కూడా చార్జింగ్ పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా బస్టాండ్ల నుంచి హైదరాబాద్కు ఎక్కువ మొత్తంలో బస్సులను నడపనున్నారు. నల్లగొండ – సూర్యాపేట, సూర్యాపేట – వరంగల్, సూర్యాపేట – ఖమ్మం, నల్లగొండ– మిర్యాలగూడ రూట్లలో ఇలా డిపోల పరిధిలో బస్సులను నడపనున్నారు.
డ్రైవర్లకు శిక్షణ
అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు హైదరాబాద్లో డ్రైవర్లకు సుమారు 20 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిసిన వెంటనే బస్సుల రూట్లను పూర్తిస్థాయిలో కేటాయిస్తారు.
ఫ సూర్యాపేటకు 75, నల్లగొండకు
77 బస్సుల కేటాయింపు
ఫ ఇప్పటికే సూర్యాపేట
డిపోకు 41 బస్సులు రాక
ఫ త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు
ప్రయాణికులకు మెరుగైన రవాణా
ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడానికి అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతోంది. త్వరలోనే రీజియన్కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి. ఆయా రూట్లలో బస్సుల కొరత తీరడంతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందనుంది.
– జాన్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం