
సాక్షి, హైదరాబాద్: ఫార్మూలా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ(ACB Notices) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ బీఎల్ఎన్రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కేసు ఒప్పందంపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.
ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు. ఈ-రేస్ కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.
ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.
కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకావడంతో.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్..
Comments
Please login to add a commentAdd a comment