![Book Launch Of Maha Sankalpam Part Of Dharma Bhiksham Centenary Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/7/06CHK11-160024.jpg.webp?itok=QxzlRU0N)
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మహా సంకల్పం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గౌరీశంకర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ధర్మభిక్షం మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించడంలో ఆదర్శప్రాయులని కొనియాడారు. ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. నిర్వహణ కమిటీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ‘మహాసంకల్పం’పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థ ఏర్పడని సమయంలోనే ధర్మభిక్షం విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఉంటూ ఎందరో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఎమ్మె ల్యేగా, ఎంపీగా ఐదుసార్లు చట్టసభలకు వెళ్లిన ధర్మభిక్షం, సాధారణ జీవితాన్ని గడిపారన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ధర్మభిక్షం స్వస్థలం సూర్యాపేటలో మహా సంకల్పం పుస్తక చర్చను నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ధర్మభిక్షం శతజయంతి సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రొఫె సర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ, ధర్మభిక్షం అచ్చమైన ప్రజల మనిషి అని కొనియాడారు.
ధర్మభిక్షం అంటేనే పోరాటం..
శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ, మహాసంకల్పం పుస్తకం చదివితే ధర్మభిక్షం గురించి నేటి తరానికి తెలుస్తుందన్నారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ, ధర్మభిక్షం, బండ్రు నరసింహులు గురించి మాట్లాడడం అంటేనే ప్రజా పోరాటాల గురించి మాట్లాడడమన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ, ధర్మభిక్షం మానవతా ఉద్యమతార అని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంలాగా ‘మహా సంకల్పం’పుస్తకం ఒక రూపాన్ని నిర్మించిందన్నారు.
కార్యక్రమంలో పుస్తక సంకలనకర్త, అరసం రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్, అరసం కార్యనిర్వహక కార్యదర్శి పల్లేరు వీరస్వామి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, సినీ దర్శకుడు బాబ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘మహాసంకల్పం’పుస్తక ముద్రణకు సహకరించిన బూర మల్సూర్ గౌడ్ను జ్ఞాపికతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment