
సాక్షి, జనగాం: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అంతేకాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్ మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు వేదికల ముఖ్య ఉద్దేశాలను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హాజరయ్యే రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీల సభ్యులతో పాటు రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి సీఎం వివరించనున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
కొడకండ్లకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం పరిశీలించారు. స్వయంగా సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసి కొడకండ్లకు వస్తున్న సమాచారాన్ని తెలియజేశారు. అప్పటికే వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి దయాకర్రావు వెంటనే కొడకండ్లకు చేరుకున్నారు. రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ సంపత్రెడ్డితో కలిసి సీఎం పర్యటన కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం ప్రారంభించనున్న రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యవసాయ మార్కెట్లోని సభాస్థలి, హెలీప్యాడ్ నిర్మాణాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సూచించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రిని కోరడంతో, అధికారులతో నివేదిక తెప్పించుకుని జనగామ జిల్లా కొడకండ్లకు రావాల ని నిర్ణయించుకోవడం అదష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు పేర్కొన్నారు. సీఎం ఫోన్ ద్వారా కొడకండ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారని దయాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ జ్యోతి ర వీందర్ నాయక్, జెడ్పీటీసీ సత్తమ్మ, ట్రైకార్ మాజీ చైర్మన్ గాంధీనాయక్, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీలు విజయలక్ష్మి, యాకయ్య పాల్గొన్నారు.