
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది మందిని బలి తీసుకున్న శ్రీశైలం పవర్ ప్లాంట్ దుర్ఘటన విచారణలో మరో ముందడుగు పడింది. ఈ కేసును సీఎం ఆదేశాలతో సీఐడీ చీఫ్ ఏడీజీ గోవింద్ సింగ్ స్వయంగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సీఐడీ ప్రత్యేక బృందాలు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం దుర్ఘటనకు అసలు కారణాలేమై ఉంటాయన్న విషయంలో సీఐడీ నిర్ధారణకు రానుంది. ఈ కేసులో మొదటి నుంచి కుట్ర కోణంపై ఎలాంటి ఆధారాలు లేవు. ఇది మానవ తప్పిదమా..? సాంకేతిక లోపమా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో పర్యటించిన సమయంలో ఫోరెన్సిక్ విభాగ నిపుణులు పలు కీలక ఆధారాలు సేకరించారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన అనంతరం నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. సీఐడీ తాను దర్యాప్తులో సేకరించిన అంశాలు, ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైన సాంకేతిక అంశాలను ఆధారంగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనుంది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ కూడా తన పనిని వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment