కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి | Sakshi
Sakshi News home page

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

Published Sat, Aug 8 2020 12:40 PM

Former MP Nandi Yellaiah Deceased With Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు. జులై 29న కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్‌లో  చేరిన నంది ఎల్లయ్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. (ఎల్‌బీనగర్‌‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌)

కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దతతో క్రమశిక్షణతో పనిచేశారు. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శం. ఓటమి ఎరగని నేత, దళిత బాంధవుడు నంది ఎల్లయ్య. గాంధీ ఆశయాలను తుచ తప్పకుండా పాటించిన ఆదర్శ నాయకులు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. నంది ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం' అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement