
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్సీయూ భూముల్లో చేపడుతున్న పనులన్నింటిని నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈమేరకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీంతో హెచ్సీయూలో పండుగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో (kancha gachibowli land issue) 400 ఎకరాల వేలంపై వారం రోజులగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేమేని భీష్మించుకున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు తమ పోరాటానికి మద్దతుగా సుప్రీం కోర్టు ఉత్తర్వులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది విద్యార్థుల విజయం
మరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది’ అని అన్నారు.
స్ట్రేచర్ ఉందని విర్రవీగితే..
సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్సీయూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. స్ట్రేచర్ ఉందని విర్రవీగితే.. చట్టం చూస్తూ ఊరుకోదు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినపుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండడం శుభ పరిణామం. ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం, సామాజిక వేత్తల విజయం.హెచ్సీయూ భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి అభినందనలు’ అని తెలిపారు.
పర్యావరణ విధ్వంసంపై సుప్రీం ఆవేదన
హెచ్సీయూ భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ నుంచి నివేదిక తెప్పించుకుని విచారించింది. విచారణ సందర్భంగా.. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో యదేశ్చగా చెట్లను నరకడంతో పాటు పర్యావరణాన్ని దెబ్బ తీయడం, జేసీబీలతో చెట్లను కొట్టేయడం,మూగజీవాల్ని హింసిస్తున్నారనే తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
ఎవరిచ్చారు మీకు ఆ హక్కు
‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?అవసరమైతే సీఎస్పై తీవ్ర చర్యలు తీసుకుంటాం. ఏ అధికారంతో చెట్లను ఎలా తొలగిస్తారాని పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. సీఎస్,జీహెచ్ఎంసీ కమీషనర్ ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. హెచ్సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమీషనర్తో పాటు పలువురి అధికారులను తొలగించింది. ఈనెల 16 కల్లా సీఈసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.