116 కి.మీ. 80స్టేషన్లు.. | Hyderabad: Second phase of Metro to cost over Rs 32,000 crore | Sakshi
Sakshi News home page

116 కి.మీ. 80స్టేషన్లు..

Sep 30 2024 6:29 AM | Updated on Oct 1 2024 1:44 PM

Hyderabad: Second phase of Metro to cost over Rs 32,000 crore

రెండో దశలో 6 మార్గాల్లో మెట్రో రైలు సేవల విస్తరణ 

ఐదు రూట్లకు సంబంధించిన డీపీఆర్‌లు త్వరలో కేంద్రానికి 

40 కి.మీ. ఎయిర్‌పోర్ట్‌–ఫోర్త్‌ సిటీ డీపీఆర్‌పైనా ముమ్మర కసరత్తు 

ఎయిర్‌పోర్టు సమీపంలో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో లైన్‌ నిర్మాణం.. భూగర్భంలోనే ఎయిర్‌పోర్ట్‌ మెట్రో స్టేషన్‌  

కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా వెళ్లేలా

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పు 

మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.32,237 కోట్లు 

రెండోదశ మెట్రోపై వివరాలు వెల్లడించిన ఎన్వీఎస్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎండీ ఎనీ్వఎస్‌ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్‌పోర్ట్‌ టూ ఫోర్త్‌ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమరి్పంచనున్నట్లు తెలిపారు.

ఎయిర్‌పోర్ట్‌ టూ ఫోర్త్‌ సిటీ డీపీఆర్‌ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్‌ మెట్రో భవన్‌లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. 

ట్రాఫిక్‌ అధ్యయనం 
‘రెండోదశకు సంబంధించి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ పరిధిలోప్రస్తుతం ట్రాఫిక్‌ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్‌ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్‌ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్‌ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్‌పోర్ట్‌ రూట్‌కు సంబంధించి అలైన్‌మెంట్‌లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్‌ నుంచి 44వ నంబర్‌ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..’అని ఎనీ్వఎస్‌ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 

భూగర్భంలో మెట్రో రైల్‌  
నాగోల్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్‌ ఎల్‌బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్‌ జంక్షన్‌ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్‌ వరకు, మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రూట్‌లో 35 కిలోమీటర్లు ఎలివేట్‌ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్‌ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్‌లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.  
 

ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి కోకాపేట్‌ నియోపొలిస్‌ వరకు కొత్తగా లైన్‌ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్‌ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కోకాపేట్‌ నియోపోలిస్‌ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్‌ కారిడార్‌. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.

 ఆరో కారిడార్‌లో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్‌ నుంచి ఓల్డ్‌ సిటీలోని మండి రోడ్‌ మీదుగా దారుల్‌íÙఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చారి్మనార్‌లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు. 

రోడ్ల విస్తరణ 
 ప్రస్తుతం దారుల్‌íÙఫా జంక్షన్‌ నుంచి శాలిబండ జంక్షన్‌ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్‌ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్‌ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్‌లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి.  

 ఏడవ కారిడార్‌లో మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్‌ నిర్మించనున్నారు. మియాపూర్‌ నుంచి ఆలి్వన్‌ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్‌ఈఎల్, ఇక్రిసాట్‌ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్‌లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్‌ కారిడార్‌. 

  ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు నిర్మించనున్న 8వ కారిడార్‌ 7.1 కిలోమీటర్‌ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్‌ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్‌ కారిడార్‌. 9వ కారిడార్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్‌ యూనివర్సిటీ వరకు ఉంటుంది.  

   రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.

రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)
కారిడార్‌ – 4    నాగోల్‌ – ఎయిర్‌పోర్ట్‌     36.6
కారిడార్‌ – 5    రాయదుర్గం–కోకాపేట్‌ నియోపొలిస్‌     11.6
కారిడార్‌ – 6     ఎంజీబీఎస్‌ –చాంద్రాయణగుట్ట (ఓల్డ్‌ సిటీ కారిడార్‌)    7.5
కారిడార్‌ – 7    మియాపూర్‌ – పటాన్‌చెరు    13.4
కారిడార్‌ – 8    ఎల్‌బీనగర్‌–హయత్‌ నగర్‌    7.1
కారిడార్‌ – 9    ఎయిర్‌పోర్ట్‌– ఫోర్త్‌ సిటీ (స్కిల్స్‌ యూనివర్సిటీ)    40 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement