![Karimnagar Man Died Suicide Over Wife Death His Mother Also Died - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/05/16/photo.jpg.webp?itok=ZdVI2wo9)
సాక్షి, కరీంనగర్: భార్య మృతిని తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడితే.. అది తట్టుకోలేక అతని తల్లి గుండె బద్ధలైంది. తిమ్మపూర్ మండలం నెదునూరు గ్రామంలో చోటు చేసుకున్న విషాదానికి మరో మరణం తోడయ్యింది.
భార్య మృతితో ఒంటరి జీవనం గడుపుతున్న శ్యామ్ సుందర్.. భార్య ఎక్కడైతే ఆత్మహత్యకు పాల్పడిందో అదే ప్రదేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తెలిసే ఉంటుంది. అయితే.. కొడుకు మృతిని తట్టుకోలేక 24 గంటలు గడవకముందే అతని తల్లి సైతం ప్రాణం విడిచింది. కొడుకు అంత్యక్రియల తర్వాత ఇంటికి చేరుకున్న కనకలక్ష్మి గుండెలు అవిసేలా ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధువులు. కానీ, మార్గం మధ్యలోనే కన్నుమూసింది. కొడుకు చనిపోయిన కొద్దిగంటలకే కనకవ్వ సైతం కన్నుమూయడంతో ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్(35) ఆర్కెస్ట్రా గాయకుడు. ఏడాది కిందట.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన శారదతో వివాహం జరిగింది. దాదాపు ఏడు నెలల కిందట.. శారద హుస్నాబాద్ లోని ఓ బహిరంగ ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. మనస్పర్థల కారణంగా ఆమె చనిపోయినట్లు తేలింది.
అయితే.. భార్య ఎడబాటును తట్టుకోలేని భర్త శ్యాంసుందర్ తన పెళ్లి రోజునే అతని భార్య ఉరివేసుకొని చనిపోయిన చెట్టు దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఆ బాధను తట్టుకోలేని తల్లి కూడా కొడుకు దగ్గరికే చేరుకుందేమో!.
Comments
Please login to add a commentAdd a comment