Sakshi News home page

తెలంగాణలో కోవిడ్‌ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి

Published Tue, Dec 26 2023 4:33 PM

Minister damodar Raja Narasimha On Covid death In telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. తగ్గుముఖం పట్టిందనున్న మహమ్మారి మరోసారి  విస్తరిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా మరణం సంభవించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో జనాలు భయాందోళన చెందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా ఎవరూ మరణించలేదని తెలిపారు. కోవిడ్‌ మరణం నమోదు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని  వెల్లడించారు. ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తులకు ఇతర  ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ మరణాలను కో మార్బిడ్‌ అంటారని చెప్పారు.

కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని..  రాష్ట​ంరలో కోవిడ్‌ టెస్టులను రోజుకి 4 వేలకు పెంచామని తెలిపారు. మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ను అలెర్ట్‌ చేశామని తెలిపారు. కోవిడ్ మరణం అనే అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీసిన మంత్రి.. మహమ్మారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సాయంత్రం సమీక్ష చేయనున్నారు. పూర్తిస్థాయి కరోనా వివరాలతో రావాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలా ఉండగా ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచినట్లు వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించిన్లు సమాచారం.
చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌

Advertisement
Advertisement