
జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి...
మేడ్చల్ : ఇది అమానవీయం.. సిగ్గుచేటు.. హృదయ విదారకరం.. సర్కారు దవాఖాన అంటేనే ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాటను గుర్తుకు తెచ్చే ఘటన. ఒక నిండు గర్భిణి నెలలు నిండి సర్కారు దవాఖానకు వెళితే ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించిన వైద్యులు. చేసేది లేక రోడ్డుపైనే ప్రసవం. పుట్టిన గంటలోనే శిశువు మృతి. ఆ నవజాత శిశువు చేసిన నేరం ఏమిటి?, ఆ మహిళ చేసిన పాపం ఏమిటి?, మానవత్వం కనీసం కూడా కనిపించని ఈ తరహా ఘటనలకు ముగింపు ఎక్కడ?
వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఆసుపత్రి వెద్యులు పట్టించుకోకపోవటంతో ఓ గర్భిణి రోడ్డు పక్క ప్రసవించిన ఘటన జిల్లాలోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మేడ్చల్కు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జవహార్ నగర్లోని బాలాజీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అయితే వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవటంతో రోడ్డు పక్కనే ప్రసవించింది. పుట్టిన కొన్ని నిమిషాలకే శిశువు మరణించింది. తల్లిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.