
సాక్షి, అమ్రాబాద్ (మహబూబ్నగర్): మండలంలోని రాయలగండిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం వెనక భాగంలో ప్రహరీ లోపల పురాతన రాతి శిల్పానికి డ్రిల్లింగ్ మిషిన్తో తవ్వినట్లు గుర్తించారు. ఆదివారం ఆలయ పూజారి మోహన్ గమనించి ఆలయ కమిటీ సభ్యులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. రెండు రోజుల క్రితమే గుర్తుతెలియని వ్యక్తులు ఈ తవ్వకాలు జరిపినట్లు తేల్చారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. అయితే గతేడాది కూడా ఈ ఆలయం వద్ద తవ్వకాల కోసం వచ్చి ప్రజలను చూసి కారులో పారిపోతున్న కొంతమందిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు ఉంటాయనే ఆలోచనతో తవ్వకాలకు పాల్పడుతున్నారని, ఆలయానికి రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.