
సాక్షి, హైదరాబాద్: భానుడి భగభగలతో రాష్ట్రం హీటెక్కింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావాలతో గత పక్షం రోజులుగా నడి వేసవిలోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండ్రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం మరింత పెరిగి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో 44.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చని వివరించింది.