
రాష్ట్రవ్యాప్తంగా అన్నిసబ్రిజిస్ట్రా్టర్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం
రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఏఐ చాట్బాట్ ‘మేధ’సేవలు కూడా..
క్రయవిక్రయదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు
82476 23578కు వాట్సాప్ చేస్తే కార్యాలయ లొకేషన్, స్లాట్ బుకింగ్ వేళల సమాచారం పొందే వీలు
అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. స్లాట్బుకింగ్తోపాటు కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో చాట్బాట్ ‘మేధ’సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ఇప్పటికే రెండు దశల్లో పైలట్ ప్రాజెక్టు పద్ధతిన అమలు చేశారు.
తొలిదశలో ఏప్రిల్ 10 నుంచి 22 మధ్య, రెండో దశలో మే 12 నుంచి 25 దాకా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 45,191 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయని.. మాన్యువల్ విధానంతో పోలిస్తే సుమారు 3 వేల వరకు ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయని సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సులభతరమైన సేవలను పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అయితే స్లాట్ బుకింగ్తోపాటు ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదు మాన్యువల్ రిజిస్ట్రేషన్లు చేసే విధానం కూడా కొనసాగనుంది.
వాట్సాప్లోనే సమాధానాలు
ఆస్తుల క్రయవిక్రయదారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా నేరుగా సందేహాలు నివృతి చేసుకొనేందుకు 82476 23578 అనే నంబర్కు వాట్సాప్లో సందేహాలు పంపితే వెంటనే సమాధానాలు వచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే సంబంధిత సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, అందుబాటులో ఉండే సమయం, డీడ్లవారీగా రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ విలువలను కూడా నేరుగా క్రయవిక్రయదారుల సెల్ఫోన్లకు పంపేలా అధికారులు సాఫ్ట్వేర్ రూపొందించారు.
ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు కూడా..: మంత్రి పొంగులేటి
సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ క్రయవిక్రయదారుల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారికి అవినీతిరహిత పారదర్శక సేవలందించడమే లక్ష్యంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. పైలట్ పద్ధతిలో ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిలో 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినందున రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ బుకింగ్ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానం అమలు దృష్ట్యా పనిభారం అధికంగా ఉన్న 9 కార్యాలయాల్లో సబ్రిజిస్ట్రార్ సహా అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు.
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (మధ్యాహ్న భోజన సమయంలో మినహా) ప్రజలు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని.. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అత్యవసర సందర్భాల్లో నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య 5 వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తామన్నారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నందున ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పొంగులేటి పేర్కొన్నారు.
త్వరలోనే ఈ–ఆధార్..
రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేలా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ–ఆధార్ను కూడా తీసుకొస్తామని.. అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలోనే డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. లేఅవుట్లవారీగా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు ఎరుపు రంగులో కనిపించేలా మాడ్యూల్ను రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.