
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రమాద స్థలంలో భారీగా పేరుకుపోయిన బురద నుంచి మూడు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మధ్యాహ్నాంలోపు మొత్తం 8 మృతదేహాలను వెలికి తీయాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు..
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఎనిమిది ఆంబులెన్స్లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. అక్కడి గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
మరోవైపు టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాల వెలికితీత క్రమంలో.. కార్మికుల కుటుంబాల రోదనలతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే.
ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు.

ఐదు రోజులెందుకు పట్టింది?: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
టన్నెల్ కట్టింగ్ చేయలనీ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు సమయం ఎందుకు పట్టిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు SLBC ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ఘటన బాధాకరం. సంఘటన స్థలానికి సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరం. మంత్రులేమో పిక్నిక్ గా వెళ్లి వచ్చారు. కనీస ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారు. నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టు ఇది. గత కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు SLBC నీ నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేటాయించిన నిధుల్లో సగం SLBC కి కేటాయిస్తే ప్రాజెక్టు ఈపాటికి పూర్తి అయ్యేది. ఎనిమిది మంది ప్రాణాలను ప్రభుత్వం తీసింది.. ప్రభుత్వ హత్యలే ఇవి అని మండిపడ్డారాయన.
Comments
Please login to add a commentAdd a comment