
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్లకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, మల్లురవి సహా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలను సోమవారం ఉదయం నుంచే హౌస్ అరెస్ట్లు చేపట్టారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాకు అనుమతులు లేవని, ఎవరైనా బయటకువచ్చి నిరసనలు చేస్తే అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
పంచాయతీలకు నిధుల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని, సర్పంచులందరినీ ఏకం చేయాలని నేతలకు సూచించింది. అయితే, ఈ ధర్నాలకు పోలీసులు అనుమతులు లేవని తెలపడం, గృహనిర్బంధం చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధర్నాను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’
Comments
Please login to add a commentAdd a comment