
మల్లమ్మ, యాకమ్మ (ఫైల్)
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు.
మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు.
చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment