
సీపీఎస్ రద్దుకు చైతన్య యాత్ర
తిరుపతి సిటీ : రాష్ట్రంలో సీపీఎస్ రద్దు కోసం చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు ఏపీ సీపీఎస్ఈఏ అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు యాత్ర నిర్వహిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. తొలి రోజు తిరుపతిలో కలెక్టర్కు అర్జీ అందించనున్నట్లు వివరించారు. చైతన్య యాత్రలో భాగంగా అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులను కలుస్తూ సీపీఎస్తో వాటిల్లే నష్టాలను తెలియజేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీలోపు సీపీఎస్పై తగు నిర్ణయం తీసుకుని పాత పెన్షన్ విధానం అమలు చేయాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం చైతన్య యాత్ర పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో నేతలు వంకీపురం పవన్, గుంటూరు రేఖ, మురళి, ధరణి కుమార్, ఈశ్వర్ నాయక్, చలపతి, గోపాల్ పాల్గొన్నారు.
కార్మికుల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
చిత్తూరు కార్పొరేషన్ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) విస్తరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చిత్తూరు, తిరుపతి జిల్లాల ఉప కార్మిక కమిషనర్ ఓంకార్రావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే గుర్తింపు కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. పోర్టల్ నందు ఫ్లాట్, గిగ్ కార్మికులు పేర్లు నమోదుకు ఈనెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ప్రత్యేక నమోదు శిబిరాలను తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలను పొందాలంటే నమోదు తప్పనిసరన్నారు. తదితర వివరాలకు కార్మిక శాఖ కార్యాలయంలో లేదా మెప్మా, డీఆర్డీఎ అధికారులు, తిరుపతి జిల్లా 9492555230, చిత్తూరు జిల్లా 9492555223, 9492555216 నంబర్లను సంప్రదించాలని వివరించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,496 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.60 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.