
పాత బస్సులకు..
● ఆర్టీసీ సర్వీసుల బాడీ కన్వర్షన్ ● తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీకారం ● ఇప్పటికే 9 బస్సుల రీ మోడల్ ● అదేబాటలో పలు సర్వీసులు
‘మేమొస్తే ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపిస్తాం. కొత్త బస్సులు తీసుకువస్తాం. ముఖ్యంగా తిరుపతి సెంట్రల్ బస్టాండ్కు 50 నుంచి 100 కొత్త సర్వీసులు మంజూరు చేస్తాం.. ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం అదనంగా సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని ఎన్నికల ముందు కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా..తిరుపతి బస్టాండ్కు ఒక్క కొత్త బస్సు కూడా అందించలేదు. చివరకు చేసేది లేక ఆర్టీసీ అధికారులు పాత బస్సులనే రీమోడల్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. ముందుగా తిరుపతి డిపో నుంచే కాలం చెల్లిన వాహనాలకు సరికొత్త రూపం తీసువచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రీమోడల్ చేస్తున్న దృశ్యం
తిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలోని సెంట్రల్ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీహరి, శ్రీనివాస, ఏడుకొండలు, పల్లెవెలుగు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, మంగళం డిపోలతోపాటు ఇతర డిపోలకు చెందిన సర్వీసులు నడుస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని 11 బస్టాండ్ల నుంచి ప్రతి రోజూ 2.70 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా తిరుపతి బస్టాండ్ నుంచే 1.60 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యకు తగినట్టు బస్సులు లేవు. ఈ క్రమంలో కాలం చెల్లిన బస్సులను రీ మోడల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుపతి ఆర్టీసీ డిపోలో పనులు మొదలు పెట్టారు. 15 ఏళ్లు దాటిన ప్రతి సర్వీసునూ రీమోడల్ చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒక్కొక్కటిగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
తిరుపతిలో బాడీ కన్వర్షన్
బస్సుల కొరత కారణంగా తిరుపతి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులకు తగినన్ని సర్వీసులను నడపలేకపోతున్నారు. ఈ క్రమంలో డీపీటీవో నరసింహులు, డీఎం బాలాజీ ఉన్నతాధికారుల అనుమతుల మేరకు గ్యారేజీ సిబ్బందితో చర్చించి తిరుపతిలో బస్సు బాడీ కన్వర్షన్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొమ్మిది సర్వీసులకు మార్పులు చేశారు. పనికొచ్చే పరికరాలు మినహా పాడైన వాటిని తొలగించి స్క్రాప్కు వేశారు. రేకులు, చక్కటి సీట్లు, పిల్లర్స్, టైర్లు, లైటింగ్, బ్రేకులు, గేర్ బాక్సు, ఎయిర్ ఫిల్టర్లు, ఇతర సాంకేతిక పరమైన వాటిని కొత్తగా ఆమర్చుతున్నారు. వీటికి సుమారు రూ.2 లక్షల మేరకు ఖర్చు పెట్టి 52 సీట్ల సామర్థ్యంతో పల్లె వెలుగు బస్సుగా మార్చుతున్నారు. రూట్పై వెళ్లిన తర్వాత సమస్యలు వస్తున్నాయా అనే అంశాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గత ఏడాది ఒక డీజిల్ బస్సును విద్యుత్ బస్సుగా మార్పు చేసిన విషయం తెలిసిందే.
మెరుగైన సౌకర్యాలు
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చిపోతున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. బస్సుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాత బస్సులకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి కొత్త రూపాన్ని ఇస్తున్నాం. మెకానిక్స్ ఆర్టీసీ వాళ్లు కావడంతో ఖర్చులు తగ్గుతున్నాయి. రీ మోడల్ తర్వాత నిత్యం వాటిపై నిఘా పెడుతున్నాం. – బాలాజీ, తిరుపతి ఆర్టీసీ డిపో మేనేజర్

పాత బస్సులకు..

పాత బస్సులకు..

పాత బస్సులకు..