
ఆంజనేయస్వామి ఆలయంలో చందన గణేశుడు
తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచ గేటు వద్ద ఉన్న పల్లెగూడ ఆంజనేయస్వామి ఆలయంలో వినాయకుడి విగ్రహం మంగళవారం ప్రత్యక్షమైంది. స్థానికుల కథనం ప్రకారం... ఆంజనేయస్వామి ఆలయంలో 40 ఏళ్ల నుంచి స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం చందనం పూసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ క్రమంలో మిగిలిన చందనాన్ని గర్భగుడిలో ఓ మూలన ఉన్న రాయికి పూసేవారు. రెండు రోజుల క్రితం రాతికి చందనం పూస్తుండగా పెచ్చులూడాయి. అందులోనుంచి వినాయకుడి ఆకృతి బయటకు వచ్చింది. దీంతో భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 24న మల్లికార్జున ముత్యాస్వామితో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో లింగప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు. ఇంతలోనే వినాయకుడి విగ్రహం బయటకు రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment