వందకోట్లతో అండర్‌పాస్‌ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

వందకోట్లతో అండర్‌పాస్‌ల నిర్మాణం

Published Wed, Feb 19 2025 10:11 AM | Last Updated on Wed, Feb 19 2025 10:11 AM

వందకోట్లతో అండర్‌పాస్‌ల నిర్మాణం

వందకోట్లతో అండర్‌పాస్‌ల నిర్మాణం

షాద్‌నగర్‌: ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లతో షాద్‌నగర్‌పరిధిలోని బైపాస్‌ జాతీయ రహదారిలో మూడుచోట్ల అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోనిక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్‌నగర్‌ పరిధిలో కొత్తూరు, పెంజర్ల, జేపీ దర్గా, మేకగూడ, చటాన్‌పల్లి, బూర్గుల గ్రామాల వద్ద జాతీయరహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు అండర్‌పాస్‌లు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి నేషనల్‌ హైవే అథారిటీ పీడీని కోరినట్లు తెలిపారు. దీనికి స్పందించిన ప్రభుత్వాలు జేపీ దర్గా, చటాన్‌పల్లి వద్ద, బూర్గుల గేటు వద్ద అండర్‌పాస్‌ల నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో అండర్‌పాస్‌ నిర్మాణం సుమారు కిలోమీటర్‌ మేర నిర్మించనున్నట్లు, ఇందుకు సంబందించిన టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. ఈ నిర్మాణ పనులు మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అండర్‌ పాస్‌ల నిర్మాణం పూర్తయితే ప్రయాణం సులభంగా మారుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశమే ఉండదన్నారు. అదేవిధంగా రెండో విడతలో కొత్తూరు నుంచి కర్నూల్‌ వరకు ఉన్న బెంగుళూరు జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. చటాన్‌పల్లి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని వై ఆకారంలో నిర్మిస్తామని, బ్రిడ్జి నిర్మాణానికి అదనంగా నిధులు మంజూరు చేయాలని సీఎం కోరినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు కానున్నాయని, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు కొంకళ్ల చెన్నయ్య, శివశంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement