అభివృద్ధి పనులకు అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు అడ్డంకులు

Apr 17 2025 1:13 AM | Updated on Apr 17 2025 1:13 AM

అభివృ

అభివృద్ధి పనులకు అడ్డంకులు

మహారాణిపేట: గ్రామ, మండలాల్లో పలు అభివృద్ధి పనులకు అధికారులు, ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. యలమంచిలి నియోజకవర్గంలో ఈ ధోరణి ఎక్కువగా ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోడియం ముందు వారు నిరసన వ్యక్తం చేయగా, ఇతర జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ లు వారికి మద్దతు తెలిపారు. ఉపాధి హామీ పను లు, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇతర జిల్లా పరిషత్‌ నిధుల వినియోగంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలకు పూర్తి అధికారాలు ఉన్నప్పటికీ.. తమ సూచనల మేరకు పనులు జరగడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే చెప్పిన పనులనే అధికారులు చేస్తున్నారని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయకపోతే బిల్లులు ఆగిపోతాయని బెదిరిస్తున్నారని సభ్యులు వాపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని, సీనియర్‌ ఎమ్మెల్యేలు హుందాగా ప్రవర్తిస్తున్నారని, యలమంచిలిలో మాత్రం విచిత్రమైన ధోరణి ఉందన్నారు. దీనిపై జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.

సమావేశం సాగిందిలా..

● కె.కోటపాడులో పాఠశాల గోడ నిర్మాణంపై వివాదం నెలకొంది. పాఠశాల విద్యార్థుల కోసం ప్రహరీ నిర్మాణం పెంచాలని కోరినా అధికారులు పట్టించుకోకుండా కిచెన్‌ గార్డెన్‌ నిర్మాణం చేస్తున్నారని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రహరీ నిర్మించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

● మెడికల్‌ షాపుల్లో గడువు ముగిసిన మందులు విక్రయిస్తున్నారని, దీనిపై జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదని బుచ్చయ్యపేట సభ్యుడు దొండ రాంబాబు అన్నారు. మరికొందరు జెడ్పీటీసీ సభ్యులు కూడా ఇదే సమస్యను ప్రస్తావించారు. వచ్చే సమావేశానికి ఉమ్మడి జిల్లాల్లో ఎన్ని మందుల షాపులు ఉన్నాయి? ఎన్ని షాపుల్లో తనిఖీలు నిర్వహించారు? ఎన్ని షాపులపై చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ అధికారులను ఆదేశించారు.

● ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయ చర్యలు చేపట్టడం కంటే.. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని సూచించారు.

● అంతకుముందు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కై లాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది కార్మికులకు సంతాపం తెలుపుతూ.. మౌనం పాటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఫార్మా కంపెనీ, ఇతర ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఒకే రకమైన ఎక్స్‌ గ్రేషియా అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. దీనిపై తీర్మానం చేస్తామని చైర్‌పర్సన్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి, అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ కె. మయూర్‌ అశోక్‌, ఏఎస్‌ఆర్‌ జేసీ అభిషేక్‌ గౌడ, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌ బాబు, రేగం మత్స్యలింగం, కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.వి.జి.కుమార్‌, సీఈవో నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పవన్‌ వ్యాఖ్యలు అవాస్తవం

వైఎస్సార్‌సీపీ హయాంలోనే మన్యం అభివృద్ధి

98 కి.మీ.కాదు.. 498 కి.మీ రోడ్లు వేశాం: అరకు ఎంపీ

ఎమ్మెల్యేల తీరుపై జెడ్పీటీసీ, ఎంపీపీల ఆగ్రహం

యలమంచిలిలో ఈ ధోరణి ఎక్కువ

జెడ్పీ సమావేశంలో నిరసన

కలెక్టర్‌ జోక్యం కోరిన చైర్‌పర్సన్‌

బాణసంచా ప్రమాద బాధితులకు

సంతాపం

ఏజెన్సీలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 98 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అరకు ఎంపీ డాక్టర్‌ తనూజరాణి అన్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ అరకులో పర్యటించిన సమయంలో గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పడం మంచిదన్నారు. కానీ రోడ్లకు సంబంధించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ పనిచేయలేదని చెప్పడం సంబంధిత మంత్రిగా ఆయనకు తగదన్నారు. విశాఖ మన్యంలో గత ఐదేళ్లలో 498 కిలో మీటర్ల మేర రోడ్లు వేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మన్యం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. మన్యంలో అన్ని పీహెచ్‌సీలు, పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించినట్లు తెలిపారు. నాడు–నేడు పనులతో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. వీటిని చెప్పకుండా రోడ్లు బాగులేవని ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

అభివృద్ధి పనులకు అడ్డంకులు 1
1/2

అభివృద్ధి పనులకు అడ్డంకులు

అభివృద్ధి పనులకు అడ్డంకులు 2
2/2

అభివృద్ధి పనులకు అడ్డంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement