మిషన్‌ మధుమేహ | - | Sakshi
Sakshi News home page

మిషన్‌ మధుమేహ

Published Mon, Feb 17 2025 12:28 AM | Last Updated on Mon, Feb 17 2025 12:28 AM

మిషన్

మిషన్‌ మధుమేహ

అమరచింత: జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గతేడాది నవంబర్‌ నుంచి జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. మొత్తం 3,04,205 మంది ఉన్నారని.. ఇప్పటి వరకు 1,09,764 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రోగ్రాం అధికారి డా. రామచందర్‌రావు తెలిపారు. మార్చి చివరి నాటికి అందరికీ పరీక్షలు నిర్వహించి నివేదికను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 20,655 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండగా.. ఈ వ్యాధి బారినపడి ఒక్కరుకూడా మరణించకుడదన్న ఉద్దేశంతో మిషన్‌ మధుమేహ 2.0 కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

2024, నవంబర్‌లో ప్రారంభం..

2024, నవంబర్‌లో జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించి పైలెట్‌ ప్రాజెక్టుగా అప్పరాల, కడుకుంట్ల, కమాలోద్దీన్‌పూర్‌, మదనాపురం, శ్రీరంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 58,127 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. అందులో 3,300 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో చికిత్స ప్రారంభించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆదేశించడంతో మిషన్‌ మధుమేహ 2.0 పేరుతో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3న ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 2,32,089 మందికి డయాబెటిస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

వ్యాధి లక్షణాలు..

అధిక మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, అధిక ఆకలి, అలసట, శరీర బరువు తగ్గడం లేదా పెరగడం, గాయం మానడంలో ఆలస్యం, చర్మ సమస్యలు, కాళ్లల్లో నొప్పులు.

నియంత్రణకు..

తక్కువ గ్‌లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం 30 నుంచి 45 నిమిషా లు వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవడంతో రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణ సులభమవుతుంది. ధాన్యంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో కొనసాగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు

30 ఏళ్లు పైబడిన వారు 3,09,655.. ఇప్పటి వరకు

పూర్తి చేసింది 1,09,764

మార్చి చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు..

మార్చి నాటికి పూర్తి..

జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మధుమేహ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతేడాది నవంబర్‌లో కా ర్యక్రమం ప్రారంభించాం. వైద్యసిబ్బంది ఇల్లిల్లూ తిరిగి షుగర్‌, బీపీ పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్నాం. మార్చి చివరి నాటికి అనుకున్న లక్ష్యం పూర్తిచేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.

– డా. రామచందర్‌రావు,

జిల్లా కార్యక్రమ అధికారి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు..

జిల్లాలో డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొదట పైలెట్‌ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించాం. అనుకున్న లక్ష్యం సాధించడంతో మిగిలిన అన్ని గ్రామాల్లో వ్యాధిగ్రస్తులను గుర్తించి అవగాహన కల్పిస్తున్నాం.

– డా. శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ

డయాబెటిస్‌ అంటే..

డయాబెటిస్‌ అనేది దీర్ఘకాలిక వ్యాధి.. రక్తంలో చక్కెరస్థాయి పెరిగితే మధుమేహం బారిన పడినట్లు. శరీరంలో ఇన్సులిన్‌ అనే హర్మోన్‌ సరిపడా ఉత్పత్తి కాకపోవడం.. సరిగా పనిచేయకపోవడంతో ఈ వ్యాధి వస్తుంది. జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఎవరికై నా ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక బరువుతో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మిషన్‌ మధుమేహ1
1/3

మిషన్‌ మధుమేహ

మిషన్‌ మధుమేహ2
2/3

మిషన్‌ మధుమేహ

మిషన్‌ మధుమేహ3
3/3

మిషన్‌ మధుమేహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement