
మన్యంకొండలో వైభవంగా కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతినెల పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తులు తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్ఛరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కనులపండువగా సాగింది. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామివారి దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.