ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేశారు. ఎక్కడికక్కడ తమ మద్దతుదారులతో విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రచారానికి తెరపడడంతో ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపారన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లానే కీలకం..
ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఉమ్మడి వరంగల్ జిల్లా కీలకంగా మారింది. మిగతా జిల్లాలతో పోలీస్తే ఇక్కడే ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మొత్తంగా 25,797మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 11,189మంది ఉన్నారు. అభ్యర్థులు కొద్దిరోజులుగా ఓ వైపు ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటూనే రాత్రివేళ విందులు ఏర్పాటు చేశారు. ఒక్కో ఓటుకు రూ.2వేలు, ఆపైన డబ్బుల పంపిణీకి రంగం చేసుకున్నారన్న చర్చ కూడా ఉపాధ్యాయ వర్గాల్లో నడుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే పరిస్థితి లేదని, రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుండడంతో అభ్యర్థులు దీనిపైనా దృష్టి పెట్టారు. మొదటి ఓటు కాకపోయినా రెండో ప్రాధాన్యత ఓటు అయినా తనకు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ నెలకొన్న ఈ పోరులో విజేత ఎవరన్నది మార్చి 3న తేలనుంది.
ఆరుగురు.. అమీతుమీ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికి ఆరుగురి మధ్యే పోటీ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2019లో గెలుపొందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి టీఎస్యూటీఎఫ్ మద్దతుతో బరిలో నిలిచారు. టీచర్ల, అధ్యాపకుల అనేక సమస్యలను పరిష్కరించానని, మరోసారి గెలిపిస్తే మిగతా సమస్యలను పరిష్కరిస్తానని హామీలు ఇస్తూ ప్రచారం కొనసాగించారు.
● 2013లో పీఆర్టీయూ మద్దతుతో పూల రవీందర్ ఎమ్మెల్సీగా గెలుపొంది 2019 వర కు కొనసాగారు. ఈసారి ఉపాధ్యాయ సంఘా ల జాక్టో, ఎస్టీయూ, బీసీ సంఘాల మద్దతుతో బరిలో నిలిచారు. తాను గతంలో ఎమ్మెల్సీగా అనేక సమస్యలను పరిష్కరించానని, బహుజన బిడ్డను మరోసారి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా మద్దతు ప్రకటించింది.
● గతంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన పులి సరోత్తంరెడ్డి బీజేపీ మద్దతుతో పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు కూడా సరోత్తంరెడ్డి కోసం వివిధ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఈయనకు టీపీయూఎస్ మద్దతు ప్రకటించింది.
● ఉపాధ్యాయ సంఘాల్లో అధిక సభ్యత్వం కలిగిన పీఆర్టీయూ టీఎస్నుంచి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి తన మద్దతుదారులతో ఉమ్మడి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పరిష్కరించిన ఉపాధ్యాయుల పలు సమస్యలను తెలియజేస్తూ తనకు అవకాశం ఇవ్వాలని ఓట్లను అభ్యర్థించారు.
● మరో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి కూడా తన మద్దతుదారులతో విస్తృతంగా ప్రచారం చేశారు.
● కుడా మాజీ చైర్మన్, ఓ ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత ఎస్.సుందర్రాజ్యాదవ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి ప్రైవేట్ హైస్కూళ్ల టీచర్లు, కళాశాలల అధ్యాపకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆయన బీసీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తూనే పలు ప్రైవేట్ యాజమాన్యాల మద్దతుతో గెలిపించాలని అభ్యర్థించారు.
జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్ల వివరాలు
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు?
రేపు పోలింగ్.. ఉత్కంఠ
పోరులో విజేత ఎవరో
ఆరుగురు అభ్యర్థుల మధ్య
ప్రధానంగా పోటీ
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ మొత్తం ఓటర్లు 11,189
పోలింగ్కేంద్రాలు
72
27న పోలింగ్, 3న లెక్కింపు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో మొత్తం 72 పోలింగ్సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నారు.
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment