ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీయే కార్యాలయానికి వచ్చిన ఆయనను గేటువద్దే అడ్డుకుని అరెస్టుచేసి, స్టేషన్కు తరలించారు. అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీయే కార్యాలయానికి వస్తే.. తనను అరెస్టు చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆర్టీయే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్టు చేశారు.