Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jaganmohan Reddy Strongly Condemned Pahalgam Terror Attack1
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.జమ్మూకశ్మీర్‌ దుర్ఘటనపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘పహెల్‌ గామ్‌ లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025టూరిస్టులపై కాల్పులుమంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌ నాగ్‌ జిల్లా పహెల్‌ గామ్‌లో బైసరీన్‌ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు. ఇండియన్‌ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్‌ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్‌ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.

Terrorist Attack In jammu kashmir Pahalgam2
Pahalgam: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహెల్‌ గామ్‌లో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల దాడిలో 27మంది టూరిస్టులు మరణించారు. పదిమందికిపై టూరిస్ట్‌లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మర్‌ సీజన్‌ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరీన్‌ వ్యాలీ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. అయితే, ఈ బైసరీన్‌ వ్యాలీని సందర్శించాలంటే కాలినడకన లేదంటే గుర్రాలమీద చేరాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా భావించిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు.A newlywed’s honeymoon turned into horror in #Pahalgam as terrorists shot her husband for not being Muslim. They asked his name, caste then killed him point-blank in kashmir. Her life shattered forever.#Kashmir #UPSC pic.twitter.com/4s1OYAdsiE— Rebel_Warriors (@Rebel_Warriors) April 22, 2025 భారత ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పెహల్‌ గామ్‌లో ట్రెక్కింగ్‌ టూర్‌కు వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులను చెక్‌ చేశారు.మతం అడిగి తెలుసుకున్నారు. ముస్లింలు కాని వారిని పక్కన నిలబెట్టి కాల్పులు జరిపారు.పేరు, మతం అడిగి తన భర్తపై కాల్పులు జరిపారని ఓ బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులపై ఎదురుదాడికి దిగాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించాయి.టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. భారీగా బద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. ఈ దాడులు జరిగిన కొద్ది సేపటికే.. పర్యాటకులపై దాడి చేసింది తామేనని టీఆర్‌ఎఫ్‌ సంస్థ ప్రకటించింది. ప్రధాని మోదీ ఆరాకాల్పుల ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని దుబాయ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఖండించారు. కాల్పుల ఘటనపై అమిత్‌షాతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లోనే పరిస్థితులను అమిత్‌షా వివరించారు. అయితే ఘటనాస్థలికి వెళ్లాలని అమిత్‌షాకు సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో అమిత్‌షా హుటాహుటీన కాశ్మీర్‌కు బయల్దేరారు. I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected. Those behind this heinous act will be brought…— Narendra Modi (@narendramodi) April 22, 2025న్యాయ స్థానం ముందు నిలబెడతాంమరోవైపు ఈ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పెట్టే ప్రసక్తిలేదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయ పడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష. ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం గొప్పది. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయ స్థానంలో నిలబెడతాం’అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.ఇది క్రూరమైన చర్య : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించారు. ఇది క్రూరమైన చర్య. అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానిది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. The terrorist attack on tourists in Pahalgam of Jammu and Kashmir is shocking and painful. It is a dastardly and inhuman act which must be condemned unequivocally. Attacking innocent citizens, in this case tourists, is utterly appalling and unpardonable. My heartfelt condolences…— President of India (@rashtrapatibhvn) April 22, 2025 ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదుజమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిపై హోంశాఖ అ‍త్యున్నత సమీక్ష నిర్వహించింది. ఉగ్రవాదుల దాడి నన్ను కలిచి వేసింది. ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. Anguished by the terror attack on tourists in Pahalgam, Jammu and Kashmir. My thoughts are with the family members of the deceased. Those involved in this dastardly act of terror will not be spared, and we will come down heavily on the perpetrators with the harshest consequences.…— Amit Shah (@AmitShah) April 22, 2025 ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిజమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడిన దేశ వ్యతిరేక శక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటై నిలబడుతుందని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

Ram Charan responds to Pahelgam Terror Tragedy3
పహెల్‌ గామ్‌ దుర్ఘటన పై స్పందించిన రామ్ చరణ్

పహెల్‌ గామ్‌ దుర్ఘటనపై నటుడు రామ్ చరణ్ స్పందించాడు. పహెల్‌ గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను, చాలా బాధపడ్డాను. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో స్థానం లేదు వాటిని తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ హీరో రామ్ చరణ్ తన సానుభూతిని తెలిపాడు. Shocked and saddened by the terror attack in Pahalgam. Such incidents have no place in our society and should be strongly condemned.My prayers are with the families of those affected.— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2025

YSRCP Suspension imposed on MLC Duvvada Srinivas4
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్సార్ సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్టు సమాచారం.

Sakshi Guest Column On Universities in crisis5
సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు

నేడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సంక్షోభంలో వున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీలు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అధిపత్య, సామ్రాజ్య వాద చర్యలకు గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్‌ ఎంతో స్వేచ్ఛను అనుభవించిన విషయం ఆయన జీవన గాథల్లో వ్యక్తం అవుతుంది. అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో విద్యతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసినట్లు మనకు చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడ ప్రపంచంలోని ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, సాంకేతిక నిపుణులు తయా రయ్యారు. అనేక దేశాల్లో అత్యున్నతంగా చదువుకున్న మేధావులు పెక్కుమంది ఇక్కడ తమ జ్ఞానానికి పదును పెట్టుకున్నారు. ట్రంప్‌ వర్సెస్‌ హార్వర్డ్‌ట్రంప్‌ ఆదేశాలను హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అలెన్‌ ఎం. గార్బర్‌ ధిక్కరించడం పట్ల సామాజిక, రాజకీయ మేధావి వర్గం సానుకూలంగా స్పందించింది. ‘‘హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు. తన రాజ్యాంగ హక్కు లను వదులుకోబోదు. ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే విశ్వవిద్యాల యాలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను చేర్చుకోవాలి. ఏ సిబ్బందిని నియమించుకోవాలి, ఏ పరిశోధనలు జరపాలి అనే విషయా లను ఆదేశించజాలదు’’ అని గార్బర్‌ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యా లయ వ్యవహారాల నిర్వహణలో పాలకుల జోక్యానికి ప్రతిస్పందిస్తూ ఏ భారతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్‌ ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఉంటారు? ఈ ధరిత్రిపై తన కంటే శక్తిమంతుడు మరొకరు లేరని విశ్వసిస్తున్న ట్రంప్‌ ఆదేశాలను గార్బర్‌ ధిక్కరించారు.అందుకు ఆగ్రహించిన ట్రంప్‌ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదలను నిలిపివేశారు. అయినప్పటికీ శ్వేత సౌధ ఆదేశాలను పాటించేందుకు హార్వర్డ్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గత నెలలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలంబియాకు కూడా 400 మిలియన్‌ డాలర్లను మంజూరు చేసేందుకు ట్రంప్‌ నిరాకరించారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆయన షరతులకు కొలంబియా సమ్మతించింది. నిజానికి విశ్వవిద్యాలయాల అధిప తులు సామ్రాజ్యాధిపతుల కంటే గొప్పవారు. వారు ఎంతో జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంటేనే ప్రపంచం నడుస్తుంది. అమెరికా నేడు అనేక విషయాల్లో ప్రపంచంలో ముందు ఉందంటే అందులో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో ఉంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యాన్ని ప్రవచించిన, స్టాలిన్‌ నియంతృత్వాన్ని ఎదిరించి ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ప్రవచించిన జాన్‌ డ్యూయీ వంటి ఎందరో మేధావులు ఆవిర్భవించిన కొలంబియా విశ్వవిద్యాలయం నేడు ఆంక్షలను ఎదుర్కోవడం బాధాకరమైన విషయం. ‘‘ప్రజాస్వామికం అనే భావాన్నీ, ప్రజాస్వామికం అర్థాన్నీ మనం ఎప్పటికప్పుడు కొత్తగా తరచి చూసుకుంటూ వుండాలి. రాజకీయ, ఆర్థిక, సాంఘిక సంస్థలను కూడా దీనికి అనుకూలంగా మార్చుకోవాలి. ప్రజాస్వా మికం నిత్యనూతనం అయి, ప్రజల అవసరాలతోపాటు మారుతూ వచ్చినపుడే అది ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేదీ, ప్రజలకు సహాయం చెయ్యగలిగేదీ అవుతుంది. ఈనాటి మార్పులనూ, రాబోయే మార్పులనూ తెలుసుకోటానికి అది ముందుకు నడవాలి. అది కదలకుండా నిలబడటం ఆత్మహత్య చేసుకోవటమే అవుతుంది’’ అని హెచ్చరించారు జాన్‌ డ్యూయీ. ఆయన విద్యకు ప్రధానమైన పాత్రను ఇచ్చారు. విద్య అంటే జ్ఞాన జ్యోతి, విద్య అంటే విప్లవ సంకేతం, విద్య అంటే మానవాభ్యుదయానికి మార్గం. భారతదేశ పరిస్థితిమన దేశంలో కూడా యూనివర్సిటీల మీద పెత్తనం అప్రజాస్వా మికంగా, లౌకిక భావజాలానికి భిన్నంగానే జరుగుతోంది. విశ్వ విద్యాలయాల గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) రూపాన్నే మార్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. 2023 నాటికి మనకు 1,074 విశ్వవిద్యాల యాలున్నాయి. ఇందులో 128 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇక్కడ ఒకప్పుడు లౌకికవాద, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామ్యవాద, సామాజిక పరిణామవాద భావజాలం అభివృద్ధి చెందింది. జీవశాస్త్రం, పదార్థ శాస్త్రం, రసాయన శాస్త్రంలో ప్రపంచానికే జ్ఞానసంపత్తిని అందించ గల్గిన పరిశోధనలు వచ్చాయి. దళిత బహుజన విద్యార్థులకు మెరు గైన స్కాలర్‌షిప్‌లు లభించాయి. దళిత బహుజన మైనారిటీల నుండి కూడా ఎంతో నూత్న జ్ఞానం ఆవిర్భవించింది. జేఎన్‌ యూ, ఢిల్లీ విశ్వ విద్యాలయం, జామియా మిలియా, ఏఎవ్‌ుయూ, జాదవపూర్, జమ్ము సెంట్రల్‌ వర్సిటీల్లో (వాటి అధ్యాపకులు, విద్యార్థులు) ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. జేఎన్‌యూలో ఇమ్మానుయేల్‌ కాంట్, హెగెల్, కారల్‌ మార్క్స్‌ గురించిన విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. సబాల్ట్రన్‌ స్టడీస్‌లో భాగంగా హిస్టరీలో అత్యంత విలువైన విషయాలను ముందుకు తెచ్చిన రొమిల్లా థాపర్‌ జేఎన్‌యూలో చరిత్ర బోధకురాలని మరువరాదు. కానీ నేడు దేశంలో మత గ్రంథాల్లోని పురాణ కథలను పాఠ్య గ్రంథాలుగా తెచ్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. భారతీయ విశ్వ విద్యాలయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువగా వుంది. ట్రంప్‌ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారత మేధావులు కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించడం ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా విద్యా వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. భారతదేశంలో ఎక్కువ ధనం విద్యకే ఖర్చవుతోంది. అయినా ఉపాధి రంగాలు లేక ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతు న్నారు. ఇప్పుడు భారత పాలకులకు, రాష్ట్రాలను పాలించే ముఖ్య మంత్రులకు ఈ దేశంలో ఉన్న మానవ వనరులను, మానవ శక్తిని ఎలా సమన్వయించాలో తెలియక ఇతర దేశాలకు ఉపాధి రంగాల కోసం విద్యార్థులను వెళ్ళమని పురమాయిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళడం తప్పు కాదు. దేశంలో ఉన్న విద్యను, విద్యా మూలాలను దెబ్బతీసుకోవడం వలన వనరుల మీద ఆసక్తి తగ్గిపోతుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. విద్యకు హద్దులా?ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు పాలకవర్గ సామ్రాజ్య వాద, పెట్టుబడిదారీ, మతోన్మాద భావజాలాల ఒత్తిడిలో వున్నాయి. సరైన గ్రాంట్స్, స్కాలర్‌షిప్‌లు లేక విలవిల్లాడుతున్నాయి. తెలంగాణలో సెంట్రల్‌ విశ్వవిద్యాలయ భూములను ఆక్రమిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కులాధిపత్య భావాల మధ్య నలుగుతున్నాయి. భారతదేశంలో జీవించలేక, ఉపాధి లేక, స్వేచ్ఛ లేక ఇతర దేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అమె రికా విధిస్తున్న ఆంక్షలు గొడ్డలిపెట్టుగా ఉన్నాయి.ఆసియా దేశాలు తమ స్వీయ విద్యోత్పత్తి, జ్ఞానోత్పత్తి విషయంలో స్వయంకృషికి పూనుకోవలసిన అవసరం వుంది. విద్య మానవుని వికాసానికి సోపానం. ఉన్నత విద్య ప్రపంచ జీవన వ్యవస్థ లను పునరుజ్జీవింపజేయగల శక్తిని కలిగి వుంటుంది. హార్వర్డ్, కొలంబియా, భారతీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవన ఉద్యమం అత్య వసరం. ప్రపంచంలో విశ్వ మానవులైన వారందరూ విద్య ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే అయ్యారు. సామ్రాజ్యానికి ఎల్లలుంటాయి. పాలనకు హద్దులు వుంటాయి. కానీ విద్యకు హద్దులుండవు. విద్య గురించి అంబేడ్కర్‌ మాట్లాడుతూ, ‘‘ఏ విద్య అయితే సమర్థతను సమున్నతంగా పెంచలేదో, సమానత్వాన్ని పెంపొందించుకోవడానికి బాధ్యత వహించదో, నీతికి భూమికగా నిలువదో అది విద్యకాదు. విద్య అనేది మానవ సంక్షేమానికి రక్షణగా, శక్తిమంతంగా, బహుళ ప్రయోజనకారిగా సమతానురాగాల మూలస్థానంగా ఉండాల’’న్నారు. విద్యావంతమైన జాతి దానంతటదే అభివృద్ధిలోకి వస్తుంది. అంబే డ్కర్‌ ఆలోచనలే ప్రపంచ విశ్వవిద్యాలయాల వికాసానికి మార్గం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695

Sakshi Editorial On JD Vance India Visit6
ఊరిస్తున్న వాన్స్‌ టూర్‌

అమెరికా విధించబోయే సుంకాల గురించి మనతో సహా ప్రపంచమంతా బెంబేలు పడుతున్న వేళ, అక్కడ చదివే మన విద్యార్థులు, వృత్తిగత నిపుణులు వీసా సమస్యలతో సతమతమవుతున్న వేళ నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబ సమేతంగా సోమవారం మన గడ్డపై అడుగుపెట్టారు. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంతో ఇష్టుడైన నేత కనుక ఆయన ద్వారా కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయన్న విశ్వాసం మన దేశానికున్నట్టుంది.అందుకే కావొచ్చు... ప్రోటోకాల్స్‌ పక్కనబెట్టి మరీ ఆయనకు ఘనస్వాగతమిచ్చారు. మారిన పరిస్థితుల రీత్యా అమెరికాతో కొత్తగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మన దేశానికి తప్పనిసరి. ఇప్పటికే ఆ విషయంలో ఇరు దేశాల మధ్యా సంప్రదింపులు సాగుతున్నాయి. ఒప్పందాలకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు ఖరారయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత వాన్స్‌ ప్రకటించారు. దాదాపు 60 దేశాలపై సుంకాలను భారీ యెత్తున పెంచుతూ ఈ నెల 2 నుంచి అమల్లోకొస్తాయని ప్రకటించిన ట్రంప్, ఆ తర్వాత 90 రోజుల పాటు నిలిపివేశారు. కేవలం చైనాపై మాత్రమే అవి కొనసాగుతున్నాయి. పాత ఒప్పందాల స్థానంలో కొత్తవి కుదుర్చుకోవటం, తమకు మరింత మేలు కలిగేలా చేసుకోవటం ట్రంప్‌ ధ్యేయం. అందుకోసమే మూడు నెలల కొత్త గడువు విధించారు.నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్‌ పార్టీకీ, ప్రత్యేకించి ట్రంప్‌కూ తీవ్ర వ్యతిరేకి అయిన జేడీ వాన్స్‌ ట్రంప్‌ తొలి దశ పాలనలోనే ఆయనకు మద్దతుదారుగా మారారు. గడచిన వంద రోజులుగా ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహార శైలి గమనిస్తే రిపబ్లికన్‌ పార్టీలో ఆయన మున్ముందు కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని సులభంగానే చెప్పొచ్చు. ఆ మితవాద పక్షానికి ఆయన సరికొత్త స్వరంగా మారారు. ట్రంప్‌ను ఏయే అంశాల్లో ఇంతవరకూ వాన్స్‌ ఒప్పించారన్నది ఎవరికీ తెలి యదుగానీ... ఆయన విజన్‌ను తు.చ. తప్పకుండా పాటిస్తున్న నేతగా ఇప్పటికే నిరూపించు కున్నారు. మ్యూనిక్‌ భద్రతా సదస్సు సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో మారిన అమెరికా వైఖరిని నిక్కచ్చిగా చెప్పటంలో వాన్స్‌ విజయం సాధించారు. యూరప్‌ దేశాలు నొచ్చుకున్నా ఆయన ఖాతరు చేయలేదు. బ్రిటన్‌ విధానాలను దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మందలిస్తున్న ట్రంప్‌తో గొంతు కలిపారు. గ్రీన్‌ల్యాండ్‌ను కొనితీరాలన్న ట్రంప్‌ అభిమతానికి అనుగుణంగా చెప్పాపెట్టకుండా కుటుంబ సమేతంగా వాన్స్‌ అక్కడికెళ్లారు. ప్రస్తుతం రక్షణ, విదేశీ వ్యవహారాలు డెన్మార్క్‌కు అప్పగించటం మినహా ఇతరత్రా స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్న గ్రీన్‌ల్యాండ్‌కుగానీ, డెన్మార్క్‌కుగానీ ఈ ప్రతిపాదన ఇష్టం లేదు. ట్రంప్‌ మాదిరే స్వేచ్ఛా వాణిజ్యాన్ని, ఉదారవాద ఆర్థికవిధానాలనూ, భారీ వలసలనూ వాన్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వాన్స్‌ అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడటానికి ట్రంప్‌కు చాలా కారణాలున్నాయి. వాన్స్‌ లోని రచనా శక్తి అందులో ఒకటి. ఒకప్పుడు తనను ‘అమెరికన్‌ హిట్లర్‌’ అన్నా దాన్నంతటినీ మరిచి పోయే స్థాయిలో వాన్స్‌ ఆత్మకథాత్మక నవల ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ ట్రంప్‌ను కట్టిపడేసింది. 2022లో ఆయనను ఒహాయో సెనెటర్‌ను చేయటమేగాక, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించటానికి కూడా ఆ నవల ఉపకరించింది. శ్వేతజాతి అమెరికన్‌ జనాన్ని కూడగట్టడంలో, డెమాక్రాట్ల ఏలుబడిలో జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టడంలో ట్రంప్‌కు వాన్స్‌ నవల తోడ్పడిందని చెప్పాలి. పర్వత ప్రాంతాలను ఆనుకుని వుండే మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యతకూ, అభివృద్ధికీ దూరంగా వుండే శ్వేతజాతి అట్టడుగు వర్గాల జీవితాన్ని ఆ నవలలో వాన్స్‌ చిత్రీకరించారు. అరకొర పనులతో, అర్ధాకలి బతుకులతో వెళ్లబుచ్చే జనాలను నేరుగా చూసిన ఆ ప్రాంతవాసిగా వాన్స్‌ దాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగారు. ఆ అట్టడుగు జనం గురించి ట్రంప్‌ ఎంత మాట్లాడినా నవలలో వాన్స్‌ చిత్రించిన జీవితానుభవం ట్రంప్‌కు లేదు. అది తెలుసుకున్నాక ఆయన మరింతగా ఆ వర్గంలోకి చొచ్చుకుపోగలిగారు. అందుకే కావొచ్చు... ట్రంప్‌కు వాన్స్‌ అంటే ప్రత్యేకాభిమానం ఏర్పడింది. అలాగని ఆయనను తన వారసుడిగా ప్రకటించదల్చుకోలేదు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయటాన్ని రాజ్యాంగం నిరాకరిస్తున్నా, దాన్ని ఎలాగోలా మార్చి మరోసారి ఆ పీఠాన్ని అధిష్ఠించాలని ట్రంప్‌ కలలుగంటున్నారు. అదెంతవరకూ కుదురుతుందో భవిష్యత్తే తేల్చాలి. అసాధ్యమైతే మాత్రం ట్రంప్‌ మొదటి ఎంపిక వాన్సే కావొచ్చు.గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల వాణిజ్యం విలువ 12,920 కోట్ల డాలర్లు. మన నుంచి అమెరికా నిరుడు 8,740 కోట్ల డాలర్ల సరుకును దిగుమతి చేసుకుంది. మూడు నెలల తర్వాత మనపై 26 శాతం సుంకాలు విధిస్తే అక్కడి మార్కెట్‌లో మన సరుకుల ధర పెరిగి డిమాండ్‌ పడి పోవచ్చు. అందుకే ద్వైపాక్షిక చర్చలు అత్యవసరమయ్యాయి. తమను నష్టపరిచే విధంగా అమె రికాతో ఎవరైనా ఒప్పందం చేసుకుంటే ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించగా... ఆ దేశంతో పరిమిత వాణిజ్యమే నెరపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్‌ చెబుతున్నారు. ఇది ముదిరితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో దౌత్యం తాడు మీది నడక లాంటిది. దాన్ని విజయవంతంగా పరిపూర్తి చేయటం అంత సులభమేం కాదు.గట్టిగా మాట్లాడి, అనుకున్నది సాధించటంలో మోదీకి మరెవరూ సాటిరారని వాన్స్‌ కితాబిచ్చారు. కుదరబోయే ఒప్పందాలు దాన్ని నిరూపిస్తే అంతకన్నా కావాల్సిందేముంది?

Ys Jagan Key Comments At Ysrcp Pac Meeting7
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌ చేస్తున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులును అరెస్ట్‌ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్‌ అధికారుల పట​ ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్‌ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్‌ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్‌ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్‌ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్‌ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్‌ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్‌ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్‌ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ తీసేశారు. మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదు అని అడిగాను. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్‌లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్‌ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్‌ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్‌ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్‌ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్‌ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్‌ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్‌ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

IPL 2025 LSG vs DC: Delhi Capitals Win By 8 Wickets8
చెలరేగిన కేఎల్ రాహుల్‌.. ల‌క్నోను చిత్తు చేసిన ఢిల్లీ

ఐపీఎల్‌-2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తిరిగి క‌మ్‌బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం రెండు వికెట్ల మాత్ర‌మే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్‌(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో57 నాటౌట్‌), అభిషేక్ పోరెల్‌(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగగా.. అక్ష‌ర్ ప‌టేల్‌(20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లతో 34 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో పార్ట్ టైమ్ స్పిన్న‌ర్ ఐడైన్ మార్క్‌ర‌మ్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిగితా ల‌క్నో బౌల‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.మార్‌క్ర‌మ్ హాఫ్ సెంచ‌రీ..అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ల‌క్నో ఓపెన‌ర్లు అద్భుత‌మైన ఆరంభం అందించిన‌ప్ప‌టికి, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌కావ‌డంతో నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది.ల‌క్నో బ్యాట‌ర్ల‌లో ఐడైన్ మార్‌క్ర‌మ్‌(52) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..మిచెల్ మార్ష్‌(45), ఆయూష్ బ‌దోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్టార్క్‌, చ‌మీరా త‌లా వికెట్ సాధించారు.

Mla Chintamaneni Prabhakar Halchal In Eluru Sakshi Office9
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం

ఏలూరు,సాక్షి: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వీరంగం సృష్టించాడు. మంగళవారం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వేధింపులు తాళలేక బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో తిరగనివ్వను. సాక్షి పత్రిక ప్రతులను తాడేపల్లి గూడెం దాటనివ్వను.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడు బాబురావును అసలు చూడలేదని దబాయిస్తూనే బాబూరావు వివాదం వివరాలన్నీ చింతమనేని ప్రభాకర్‌ బయటపెట్టడం గమనార్హం.👉గమనిక: చింతమనేని ఆగడాలపై ‘ఎన్టీఆర్‌ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం’ అంటూ రాసిన సాక్షి కథనాన్ని యథాతధంగా ప్రచురిస్తున్నాం ఎన్టీఆర్‌ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణంకొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూ­రావు తెలిపారు.అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్‌ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తాహసీల్దార్, మైనింగ్‌ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రిత­మే బా­బూ­రావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పా­ర్టీ కా­ర్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.మరోవైపు తమ పార్టీ నేతల­తో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తాన­ని చింతమనేని ప్రభాకర్‌ నుంచి బాబూరావుకు బెదిరి­ంపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూ­రావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీ­డీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగ­డంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్‌ విగ్ర­హం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయ­న భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యే శరణ్యం ‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్‌ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య

Twist in Bengaluru road rage Case10
CCTV: నిను వీడని నీడను నేనే..!

బెంగళూరు: అతనొక ఐఏఎఫ్ ఆఫీసర్.. పేరు సలాధిత్య బోస్. .డీఆర్డీవో పైలట్. ఇదంతా బానే ఉంది. అయితే తనపై కొంతమంది దాడి చేశారని ఆరోపించాడు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతుంటే పలువురు బైక్ పై అడ్డగించి తనను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భార్యను కూడా అసభ్య పదజాలంతో తిట్టారన్నాడు. ఇదంతా బోస్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పిన మాటలు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. బోస్ చెప్పిన దానికి పరిశోధనలో తేలిన దానికి పొంతనే లేకుండా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా బోస్ చెప్పింది అంతా అబద్ధమేనని తేలిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ ల్లో కేవలం విక్రమ్ అనే వ్యక్తిపై బోస్ దాడి చేయడమే కనిపించింది. అతన్ని కిందపడేసి మరీ పిడుగు గుద్దులు కురిపించాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. న్యాయాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లు ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బలి అవుతారని నెటిజన్లు పేర్కొంట్నునారు. ప్రస్తుతం బోస్ పై హత్యాయాత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బయ్యప్పనహళ్లి పోలీసులు.. బోస్ పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 109 (హత్యాయత్నం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 304 (స్నాచింగ్), 324 (అల్లరి), మరియు 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.The #DRDO pilot who had alleged that he was assaulted by a motorist on Monday has now been booked for attempted murder of that same motorist, #Bengaluru police sources said. Investigations have revealed that the #wingcommander made several false claims in the vdeo. @DeccanHerald pic.twitter.com/FnaA5jzUD2— Chetan B C (@Chetan_Gowda18) April 22, 2025 ఆఫీసర్‌ చెప్పిన కథ ఇది.. సోమవారం ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాను. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నా. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement