కృష్ణానదిలో బోటు బోల్తాపడి.. 20 మంది మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. కృష్ణానదిలో జరిగిన ఈ ప్రమాదం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు కృష్ణానదిలో 20 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని సీఎం తెలిపారు. నదిలో గల్లంతైన బోటు డ్రైవర్, హెల్పర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎం చెప్పుకొచ్చారు.