సాక్షి, హైదరాబాద్ : కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్లో ఎక్కువగా నమోదు కావడంపై కేంద్ర బృందం నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి గురించి అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందం హైదరాబాద్లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయానికి బృందం వెళ్లింది. వీరికి డీజీపీ మహేందర్రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడికి పోలీసులు, రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వారు పరిశీలించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ బరోకా నేతృత్వంలోని బృందం డీజీపీ, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రాష్ట్రంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆరా తీస్తోంది.