
అధికారిపై ఏసీబీ ‘ఫైర్’
ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచమడిగిన అవినీతి తిమింగలం ఒకటి బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కింది.
ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ
అగ్నిమాపక అధికారి
{బోకర్ ద్వారా అవినీతికి ద్వారాలు
ఫైర్ సర్టిఫికెట్కు లంచమివ్వాల్సిందే
ఏసీబీ దాడితో పట్టుబడిన వైనం
విశాఖపట్నం సిటీ : ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచమడిగిన అవినీతి తిమింగలం ఒకటి బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. నగరంలోని ఓ పాఠశాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ. 35 వేలు లంచం తీసుకుంటూ జీవీఎంసీ జిల్లా అగ్నిమాపక అధికారి(డీఎఫ్ఓ) ఎం. శ్రీహరి జగన్నాథరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కె. రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలిలా వున్నాయి. షీలానగర్కు చెందిన ఏపీఎంపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు ఫైర్ నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. గతనెలలో దరఖాస్తు చేసుకున్న ఆ పాఠశాల ఉద్యోగులను కొద్ది రోజులుగా తిప్పించుకుంటూ ఎన్ఓసీ ఇవ్వడం లేదు. ఫైర్ కార్యాలయ ఉద్యోగినంటూ ఓ ప్రైవేట్ వ్యక్తి లందా తారక రామకృష్ణ ఆ స్కూల్ యాజమాన్యంతో బేరానికి దిగాడు. రూ. 35 వేలు ఇస్తే పని చేసేస్తామని రామకృష్ణ చెప్పడంతో స్కూలు యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ అధికారులు ఫిర్యాదు అందుకున్న తర్వాత ఆ మొత్తం స్కూలు ఉద్యోగి ద్వారా బుధవారం రాత్రి జీవీఎంసీలోని డీఎఫ్ఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తి అయిన లందా తారక రామకృష్ణకు రూ. 35 వేలు అందజేశారు. ఆ మొత్తాన్ని డీఎఫ్ఓకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్తో పాటు ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, రవణమూర్తి పాల్గొన్నారు. డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పట్టుబడ్డ డీఎఫ్ఓ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
చక్రం తిప్పుతున్న బ్రోకర్లు..!: జీవీఎంసీలో అధికారులకు ప్రజలకు మధ్య బ్రోకర్లు చక్రం తిప్పుతున్నారు. కమిషనర్గా ప్రవీణ్కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ దళారీ వ్యవస్థను మాత్రం నిలువరించలేకపోయారు. అగ్నిమాపక అధికారి ఛాంబర్లో కూర్చొని మరీ తామే షాడో అధికారులుగా వ్యవహరిస్తూ చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. బుధవారం పట్టుబడ్డ బ్రోకర్ లందా తారక రామకృష్ణ ఆ వృత్తిలో ఆరితేరిపోయాడు. నేరుగా లంచం తీసుకుంటే సమస్యలొస్తాయని భావించే అధికారులకు ఆపద్బాంధవుడిలా కనిపిస్తుంటాడు. ఇతను బ్రోకర్ అని చాలా మందికి తెలీదు. జీవీఎంసీలో ఇతనూ ఓ ఉద్యోగి అనే అంతా భావించేంతలా అక్కడ పాగా వేశాడు. ప్రతీ దీపావళికి లెసైన్సులు జారీ చేస్తూ అధికారులందరికీ డీఎఫ్ఓ పేరిట టపాసులను అందిస్తుంటాడు. ఏసీబీకి చిక్కిన తర్వాతే అసలు గుట్టు బయటపడడంతో అంతా ముక్కున వే లేసుకుంటున్నారు.
పదోన్నతిపై వచ్చి..!: రాజమండ్రి అగ్నిమాపక అధికారి పోస్టు నుంచి డీఎఫ్ఓగా పదోన్నతి పొంది డె ప్యుటేషన్పై జీవీఎంసీకి 2013లో వచ్చారు. అప్పటి నుంచీ నగరంలోని ఆనూపానూ అంతా పసిగట్టారు. జీవీఎంసీ కమిషనర్గా ప్రవీణ్కుమార్ వచ్చినప్పటి నుంచీ ఫైర్ ఎన్ఓసీలు, పట్టణ ప్లానింగ్పై దృష్టి సారించడంతో అగ్నిమాపక అధికారి కార్యాలయానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ లోగా బీపీఎస్ కూడా తోడవడంతో కాసుల పరంపర మొదలైంది. ప్రతీ బీపీఎస్ దరఖాస్తుకు అగ్నిమాపక ఎన్ఓసీ ఉండాలనే నిబంధన ఉండడంతో ఈ శాఖకు డిమాండ్ పెరిగింది. ఇద్దరు ఉద్యోగులతో నడుస్తున్న ఈ శాఖ పగలంతా తలుపు మూసి వుంటుంది. సాయంత్రమైతే కళకళలాడుతుంది.