bribery
-
క్యాడర్ను బట్టి లంచం!
సాక్షి, అమరావతి: ప్రసూతి సెలవుల ఆమోదం కోసం రూ.10 వేలు తీసుకున్నారని ఓ మహిళా వైద్యురాలు... రూ.4 వేలు లంచం ఇస్తే గానీ ఎస్ఆర్ నమోదు చేయలేదని మరొక మెడికల్ ఆఫీసర్... రూ.10 వేలు ముట్టజెప్పాకే ప్రొబేషన్ డిక్లరేషన్(రెగ్యులరైజేషన్) చేశారని ఇంకొకరు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్వో కార్యాలయం అవినీతిపై మెడికల్ ఆఫీసర్ (ఎంవో)లు అధికారిక వాట్సాప్ గ్రూప్లోనే తమ ఆవేదనను వ్యక్తంచేయడం వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంహెచ్వో కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్ శుక్రవారం వైద్యశాఖ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా క్యాడర్, పనిని బట్టి డీఎంహెచ్వో కార్యాలయాల్లో రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు. ఆఖరికి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద పని చేసే చిరుద్యోగులను సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకుంటున్న ప్రతి రూపాయిలో కొంత డీహెచ్ కార్యాలయానికి ముట్టజెప్పాలని జిల్లా కార్యాలయాల్లో చెబుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్వో మంతనాలు! తన కార్యాలయ అవినీతి తంతు బట్టబయలు కావడంతో ఉలిక్కిపడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్వో... కొందరు మెడికల్ ఆఫీసర్లను తన కార్యాలయానికి పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. తనకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తానని డీఎంహెచ్వో బతిమిలాడినట్లు సమాచారం. అదేవిధంగా వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలా చూస్తానని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ప్రాథేయపడినట్లు తెలిసింది. మెడికల్ ఆఫీసర్లు సైతం పీహెచ్సీల వారీగా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఎంహెచ్వో కార్యాలయం అవినీతిపై ఎంవోలు జిల్లా స్థాయి అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినా... ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తేలికగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు. -
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్కుమార్ సత్పతి, చేతన్కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
అన్నీ పొలిటికల్ బదిలీలే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఎమ్మెల్యేల సిఫారసు లేకుండా ఏ ఉద్యోగి, ఏ అధికారి కూడా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గంలోని కార్యాలయంలోనైనా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియమించాలని కలెక్టర్లకు కూడా అనధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. సీనియారిటీ, ప్రతిభను కూడా పక్కన పెట్టి కేవలం సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరపాలని ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వారే పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. నచ్చిన వారికి, ముడుపులిచ్చిన వారికి మాత్రమే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీల ప్రక్రియ మొదలైన తర్వాత ఇలా లక్షకుపైగా సిఫారసు లేఖలు ఎమ్మెల్యేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 150 సిఫారసు లేఖలు ఇచ్చారని, కొందరు 250 నుంచి 300 లేఖలు కూడా ఇచ్చారని సమాచారం. జిల్లాకు సగటున 4 వేల సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 5 వేలకు పైగా సిఫారసు లేఖలు రావడంతో ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. బదిలీల్లో ఇంతటి రాజకీయ జోక్యం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎప్పుడూ చూడలేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీతో బదిలీల గడువు ముగిసినప్పటికీ, పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిళ్లతో ఇప్పటికీ బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలా జిల్లాల్లో పాత తేదీలు వేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అనధికారికంగా వచ్చే నెల 2వ తేదీ వరకు బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.‘దక్షిణ’ ఇస్తే ‘దమ్మున్న’ పోస్టింగ్ నియోజకవర్గాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను గుప్పిట్లో ఉంచుకునేలా ఎమ్మెల్యేలు అనువైన వారిని గుర్తించి సిఫారసు లేఖలు ఇచ్చారు. ఎక్కువ ముడుపులు ఇచ్చిన వారికి ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించారు. కుల ప్రాతిపదికన కూడా చాలామందికి సిఫారసు చేశారు. ఇందుకోసం అప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని బలవంతంగా లూప్లైన్లోకి, అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయించారు. కొందరు ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేసి మరీ పక్కన పెడుతున్నారు. కొన్నిచోట్ల బదిలీల జాబితాలో ఉన్న పేర్ల పక్కన టీడీపీ, వైఎస్సార్సీపీ, తటస్థం అని రాశారు. టీడీపీకి అనుకూలమైన వారికే నియోజకవర్గాల్లో పోస్టింగ్కి అనుమతిస్తున్నారు. లేకపోతే లూప్లైన్లోకి పంపించేస్తున్నారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా తమ వారినే నియమించుకుంటున్నారు. నిబంధనలు బేఖాతరు బదిలీల్లో నిబంధనలను అసలే పట్టించుకోవడంలేదు. తహశీల్దార్లను సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయకూడదనే నిబంధనను అన్ని చోట్లా తుంగలో తొక్కారు. కాగితాలపై ఆ నియోజకవర్గం కాదని చూపించి మరీ సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఇదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పనిచేస్తున్న తహశీల్దార్ తన సొంత నియోజకవర్గమైన భీమవరం వేయించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చినా అధికారులు కాదనలేని పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్పై ఏసీబీ కేసు ఉన్నా ప్రధానమైన పోస్టు కోసం అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేల లేఖలను తప్పనిసరిగా ఆమోదించాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున నిబంధనలకు విరుద్ధమైన వారికి కూడా పోస్టింగ్లు ఇవ్వక తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్లు కట్టబెట్టారు. పోస్టింగ్ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
ఎన్నదగిన తీర్పు
చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు. కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లోక్సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం. లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు. నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న. అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్కు గైర్హాజరైన జనతాదళ్(ఏ) సభ్యుడు అజిత్ సింగ్కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్ కుమార్తె సీతా సోరెన్ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు. అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్కు గైర్హాజరైన అజిత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్కు కూడా వర్తిస్తుందని హైకోర్టు భావించి ఆ పిటిషన్ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్ అప్పీల్ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్పూర్ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్పూర్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది. -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెంటారస్ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ బాయిలర్ ఫిటింగ్ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు
సాక్షి, అమరావతి: సీబీఐ, ఏసీబీ నమోదు చేసే అవి నీతి కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా ఆ కేసులను సంబంధిత కోర్టు లు మూసివేయడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లకు సాక్ష్యం చెప్పే అవకా శాన్ని నిరాకరిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు 2014లో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఇద్ద రు అధికారులకు సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువ రించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో తన పేరు ఎక్కించేందుకు చిత్తూరు జిల్లా ఏర్పేడు తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వో బాలకృష్ణారెడ్డి రూ.2,500 లంచం డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి 2009లో ఏసీ బీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాది నుంచి బాలకృష్ణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఈ కేసును కర్నూలు కోర్టు విచారణ చేసింది. అయితే, లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టు కుని ఈ కేసులో సాక్షులుగా ఉన్న డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ఎన్నికల విధుల్లో ఉండటంతో సాక్ష్యం చెç³్పలేక పోయారు. వారు సాక్ష్యం ఇచ్చేందుకు కేసును రీ ఓపెన్ చేయాలని కర్నూలు కోర్టును ఏసీబీ అధికా రులు అభ్యర్థించారు. దీనిని ఆ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీబీ 2014లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. ఏసీబీ తరఫు న్యాయవాది ఎస్ఎం సుభానీ వాదనలు వినిపిస్తూ మరో అధికారిక విధుల్లో ఉండటంతో ఆ ఇద్దరు అధికారులు సాక్ష్యం చెప్పలేకపోయారని,ఎన్నికల విధులు ముగిశాక సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని చెప్పినా కర్నూలు కోర్టు పట్టించుకోలేదన్నారు. వీఆర్వో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సాక్ష్యం చెప్పేందుకు అధికారులకు ఏసీబీ కోర్టు పలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేదని, దీంతో కోర్టు వారి సాక్ష్యాలను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. కర్నూలు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కేసులను త్వరగా పరిష్కరించడం అంటే సాక్షులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వకపోవడం కాదన్నారు. ఈ కేçÜులో వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వక పోవడం సరికాదన్నారు. మూసివేసిన సాక్ష్యాలను తిరిగి తెరిచే అవకాశాన్ని కోర్టులకు చట్టం కల్పిస్తోందన్నారు. అవకాశం ఇచ్చినా అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రాకపోతే ఆ విషయాన్ని లేఖ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సాక్షులుగా ఉన్న సంబంధిత అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా అవినీతి కేసులను మూసివేయకుండా న్యాయాధికారులకు ఆదేశాలు ఇస్తూ సర్క్యులర్ జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను న్యాయమూర్తి ఆదేశించారు. -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 9 తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విభాగం టోల్ఫ్రీ నంబర్ 14400, ఏసీబీ యాప్ 14400లకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్(వైఎస్సార్ జిల్లా), తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖపట్నం జగదాంబ, తుని(కాకినాడ జిల్లా), నర్సాపురం, ఏలూరు, కందుకూరు (నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మేడికొండూరు(గుంటూరు), జలుమూరు(శ్రీకాకుళం) తహశీల్దార్ కార్యాలయాల్లో దాదాపు 35 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కాగా, గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్ కారులో అనధికారికంగా ఉన్న రూ.లక్షా, 4 వేల, 7 వందలు నగదును, çకారు డ్యాష్ బోర్డులో ఉన్న పలు రికార్డులు, సర్టిఫికెట్లను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ నగదుపై పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో తహసీల్దార్ను కార్యాలయానికి తీసుకొచ్చి కంప్యూటర్ డేటాను తనిఖీ చేశారు. ఇదే తహసీల్దార్ కరుణకుమార్ మేడికొండూరు కార్యాలయంలోనే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయం(2009)లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీరవెంకటప్రతాప్కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేడికొండూరు తహసీల్దార్పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పలు రికార్డుల్లో అక్రమాలను గుర్తించినట్టు తెలిసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన అర్జీలను కూడా ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నట్టు గుర్తించారు. తనిఖీలు గురువారం కొనసాగనున్నాయి. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏబీసీ దాడులు చేసి లెక్కల్లో చూపని నగదు భారీగా స్వా«దీనం చేసుకున్నారు. అనంతపురం రూరల్ (రుద్రంపేట) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో రిజిస్ట్రేషన్ చలానాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ స్వయాన అల్లుడు, ఆయన వాహన డ్రైవరుగానూ ఉన్న షేక్ ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అక్రమంగా దాచుకున్న రూ.2.27 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఇటీవల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ పరిశీలించారు. బుధవారం జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలకు మించి అధికంగా నగదు, అలాగే అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండటంపైనా ఆరా తీశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపకుండా ఉన్న మొత్తం రూ.1,53,410 నగదును సీజ్ చేశారు. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్ల’ పథకం కింద ఇంటి బిల్లులను మంజూరు చేసేందుకు ఓ లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గృహనిర్మాణ శాఖ ఏఈ బుధవారం ఏసీబీకి చిక్కారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గృహనిర్మాణ శాఖ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు బిల్లు మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై లబ్దిదారుడు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన లబ్దిదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ వెంకటేశ్వరరావును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన్ని విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు
సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్బుక్ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్ పండకు ఈ–పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
సారు చెబితేనే చేశాం..
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్గౌడ్లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రింగ్రోడ్డు వద్ద కలవండి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్గౌడ్కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది. బినామీల విచారణ.. రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
అనంతపురం కార్పొరేషన్లో వసూళ్ల పర్వం
ప్రభాకర్: నమస్తే .. సార్ నా కుమారునికి ఆరేళ్లు. బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అధికారి: ఎక్కడ పుట్టినాడో అక్కడే తీసుకోవాలి. ప్రభాకర్: అక్కడ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్.. అధికారి: అవునా.. ఏం అర్జెంట్ పని ఉందా.. ప్రభాకర్: అవును సార్.. చాలా పని ఉంది అధికారి: అయితే నీ ఫోన్ నంబర్ చెప్పు మధ్యాహ్నం తరువాత చేస్తా. ప్రభాకర్: ఎంత ఖర్చు అవుతుంది సార్. డబ్బులు సర్దుబాటు చేసుకుంటా. అధికారి: రూ. 2500 ఇస్తే.. మూడు రోజులకు సర్టిఫికెట్ ఇస్తా. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు సెక్షన్లో ఓ అధికారి నగరవాసితో జరిపిన సంభాషణ ఇది. దీన్ని బట్టి చూస్తే చాలు ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు పీడించుకొని తింటున్నారో తెలుస్తుంది. నగరంలో వేణుగోపాల్నగర్లో నివాసముంటున్న ప్రభాకర్ (పేరుమార్చాం) తన కుమారుడు సనత్ (పేరుమార్చాం)కి బర్త్ సరి్టఫికెట్ తీసుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగానికి వెళ్లారు. అన్ని రికార్డులు సమర్పించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అధికారికి విజ్ఞప్తి చేశారు. సదరు అధికారి ప్రస్తుతం రూ. 300 ఇచ్చి రెండు రోజులు తర్వాత రావాలని చెప్పారు. సర్టిఫికెట్ తీసుకునే రోజు రూ. 1,500 ఇవాల్సి ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారుడు కంగుతిన్నాడు. అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు విభాగం అధికారులు సేవలకు రేట్లు ఫిక్స్ చేశారు. అవసరాన్ని బట్టి రేటు పెంచేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ. 500 మొదలుకొని రూ. 5000 వరకూ అవసరాన్ని బట్టి దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పెరగడంతో నగరవాసులు నగరపాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ దాదాపు వంద మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. కానీ చేయి తడపందే ఇక్కడి సిబ్బంది ధ్రువీకరణ పత్రాలివ్వడం లేదు. ఉద్యోగుల చేతివాటం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఎక్కువగా చిన్నస్థాయి ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తుండటంతో అందినకాడికి దోచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో కొన్నేళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేశాడు. వాస్తవానికి అతను పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేయాల్సి ఉంది. కానీ ఇతర కారణాలు చూపి ఇక్కడే పాతుకుపోయాడు. ఏ పని కోసం వెళ్లినా సరే మొహమాటం లేకుండా బేరం మొదలు పెడతాడు. మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇదే రీతిలో పనిచేస్తున్నాడు. ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం నగర పాలక సంస్థ ద్వారా అందే సేవలన్నీ వార్డు సచివాలయాల్లోనే అందజేస్తున్నాం. ప్రజలెవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగంపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఓ అధికారిని తొలగించాం. తాజాగా వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
లంచం కేసు.. సీఐ శంకరయ్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి శంకరయ్య ఇంటిలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. (ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ) -
అవినీతి రోగం కుదిరింది!
పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్సీలో యూడీసీ (సీనియర్ అసిస్టెంట్) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్కుమార్, యూడీసీ శోభారాణి తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్ఎంలు యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ డిమాండ్ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్ఎంల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు, లీవ్లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్కమల్, సీఐ ప్రేమ్కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కానిస్టేబుల్స్
సాక్షి, హైదరాబాద్ : గూడ్స్ ఆటో డ్రైవర్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుల్స్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. అప్జల్ గంజ్ పీఎస్కు చెందిన కానిస్టేబుల్స్ ముఖేష్, సురేష్ ఆదివారం గూడ్స్ ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం సీపీ అంజనీ కుమార్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు. అలాగే పర్యవేక్షణా లోపం కారణంగా అఫ్జల్గంజ్ సీఐకి చార్జ్ మెమో జారీ చేశారు. -
దండం పెట్టే రోజులు పోయాయి
సాక్షి, సిద్దిపేట: లంచాలు అడిగే అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా మున్సిపల్ కొత్త చట్టం లో నిబంధనలు పొందు పరిచారని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన సిద్దిపేటలోని పలు వార్డుల్లో తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. దరఖాస్తులు పెట్టి దండం పెట్టే రోజులు పోయాయన్నారు. సిరిసిల్లకు యాభై ఏళ్ల దరిద్రం వది లిందన్నారు. కేటీఆర్ చొరవతో అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బుధవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. -
ఇజ్రాయెల్ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!
జెరూసలేం : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై లంచగొండితనం, మోసం, నమ్మకద్రోహం తదితర నేరాల కింద కేసులు నమోదయ్యాయి. నెతన్యాహు, ఆయన భార్య కొంతమంది బడా వ్యక్తులకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినందుకు గానూ దాదాపు 2 లక్షల అరవై వేల డాలర్లను విలాస వస్తువుల రూపంలో స్వీకరించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ అవిచాయ్ మాండెల్బ్లిట్ 63 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. మూడేళ్ల దర్యాప్తులో భాగంగా నెతన్యాహు, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం లంచాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ‘ వ్యక్తిగతంగా ఈ విషయం నన్నెంతగానో బాధిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రధానికి వ్యతిరేకంగా మూడు కేసులు నమోదయ్యాయి. చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు.. న్యాయ వ్యవస్థపై ఇజ్రాయెల్ ప్రజల నమ్మకాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చాటిచెప్పేందుకే మీ అందరి ముందుకు వచ్చాను అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఆరోపణలను బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తనపై అభియోగాలను లంచగొండులైన న్యాయవాదుల తిరుగుబాటుగా ఆయన అభివర్ణించారు. ‘విచారణ జరిపిన వారి గురించి విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. స్వయంప్రతిపత్తి గల సంస్థ చేత ఇలాంటి వాళ్లపై విచారణకు కోర్టు ఆదేశించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా... ‘ ఈ దేశం కోసం నా జీవితాన్ని ధారబోశాను. యుద్ధం చేశాను. గాయపడ్డాను. అంతర్జాతీయ వేదికపైన ఇజ్రాయెల్ను ఓ బలమైన శక్తిగా నిలిపేందుకు ఎల్లవేళలా కృషి చేశాను. దేశ శ్రేయస్సుకై పోరాడి సాధించిన విజయాల పట్ల ఎంతో గర్విస్తున్నాను. అయితే ప్రస్తుత సంఘటనలు నన్ను, నాకు అండగా నిలిచిన వారిని అగాథంలోకి నెట్టేశాయి’ అని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే ఇలాంటి ఆరోపణలు చేయబడిన మొదటి ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. అదే విధంగా ఈ ఆరోపణలు రుజువు అయినట్లయితే తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా... కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఇజ్రాయెల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నెతన్యాహు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఖరీదైన నగలు, సిగరెట్లు తదితర వస్తువులు లంచంగా స్వీకరించారంటూ ప్రస్తుతం ఆయనపై చార్జిషీట్ నమోదైంది. ఈ క్రమంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇక సుదీర్ఘకాలంగా ప్రధానిగా సేవలు అందించిన నెతన్యాహు లికుడ్ పార్టీ నుంచి తొలిసారిగా పోటీ చేసి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1993లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వివిధ పదవులు అలకరించారు. -
రూ.లక్ష లంచం తీసుకుంటూ..
లక్ష్మీపురం (గుంటూరు): వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్ బుధవారం గుంటూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాపట్లకు చెందిన మధ్యవర్తి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ ద్వారా డైట్ కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు నుంచి రూ.లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్బాబు సిబ్బందితో పట్టుకున్నారు. అదనపు ఎస్పీ సురేష్బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు బాపట్ల, తెనాలి ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం (డైట్) సరఫరా చేస్తుంటారు. అందుకు సంబంధించిన బిల్లులను జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం మంజూరు చేయాలి. రూ.20 లక్షలు బిల్లు మంజూరై మూడు నెలలు అవుతున్నా అనేక కొర్రీలు పెడుతూ అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ వేధిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోలేని చెప్పడంతో చివరకు 5 శాతం అంటే రూ.లక్ష ఇవ్వాలని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు 19వ తేదీన ప్రసన్నకుమార్కు కాంట్రాక్టర్ శ్రీనివాసరావు ఫోన్ చేసి రూ.లక్ష సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ నగదును బాపట్ల ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గోపీకృష్ణకు అందజేయాలని సూచించారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాని చెప్పగా బాపట్ల నుంచి వచ్చిన గోపీకృష్ణ వచ్చి రూ.లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. దీంతో డాక్టర్ ప్రసన్నకుమార్తోపాటు గోపీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
అవినీతిని ‘కాల్’చేస్తున్నారు!
పెద్దపల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.2,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. కామారెడ్డికి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్సై లంచం అడిగినందుకే క్రిమినల్ మిస్ కండక్ట్ కింద ఏసీబీ అధికారులు కేసులు బుక్ చేశారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు అవినీతిపై సమరశంఖం పూరిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తున్న ఒక్కో అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిస్తున్నారు. అవినీతిపై మీడియా ప్రచారం, ఇటు ఏసీబీ చర్యలు వెరసి ప్రజల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బాధితులు ఒక్కొక్కరు ముందు కొస్తున్నారు. బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం మొదలుకుని మిగిలిన 33 జిల్లాల కార్యాలయాలకు ప్రతీరోజూ పలువురు బాధితులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతీ కార్యాలయానికి రోజుకు ఐదు నుంచి 10 వరకు బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రజల్లో పెరిగిన చైతన్యంతో ఏసీబీ రెట్టింపు దూకుడుతో పనిచేస్తోంది. ఓ వైపు ప్రజలను వేధించే అవినీతి జలగలకు వల వేస్తూనే.. మరోవైపు అక్రమంగా దోచే సిన సొమ్ముతో ఆస్తులు కూడబెడుతున్న వారిపై దాడులు చేస్తోంది. వరంగల్ జోన్ నుంచే ఎక్కువగా.. ఏసీబీని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా మూడు జోన్లుగా విభజించారు. వాటిలో వరంగల్ (కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్), హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి), రూరల్ హైదరాబాద్ (నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్) జోన్లుగా ఉన్నాయి. వీటికి డీఎస్పీ ర్యాంకు అధికారి చీఫ్గా వ్యవహరిస్తారు. కొత్త జిల్లాల అనంతరం కూడా వాటి బాధ్యతలను కూడా వారే చూసుకుంటున్నారు. ఈ మూడు జోన్లలో వరంగల్ నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో గ్రామీణ ప్రాం తాల్లో రెవెన్యూ, గ్రామ పంచాయతీ విభాగాలపై ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. ఇక హైదరాబాద్ జోన్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు క్లియర్ చేసేందుకు అధికారులు లంచం అడుగుతున్నారు. ఇందులో పోలీసు, ఎక్సైజ్, జీఎస్టీ, రెవెన్యూ మొదలుకుని దాదాపుగా అన్ని విభాగాలున్నాయి. ఈ మూడు జోన్లలో తక్కువ ఫిర్యాదులతో హైదరాబాద్ రూరల్ నిలిచింది. ఏసీబీ కార్యాలయాలకు వస్తున్న ఫోన్ కాల్స్లో 50 శాతం మాత్రమే కేసుల వరకు వెళ్తున్నాయి. ఫిర్యాదు చేసిన తరువాత చాలామంది తర్వాత పరిణామాలకు భయపడి వెనకడుగు వేయడమే దీనికి కారణం. దీంతో అధికారులు రూట్ మార్చారు. ఆడియో, వీడియోలతో చెక్.. ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏసీబీ అవినీతి అధికారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల్ని లంచాలడిగి పీడిస్తోన్న అధికారులను చాకచక్యంగా పట్టుకుంటోంది. ముందుగా లంచం అడిగే అధికారి సంభాషణలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారి ఆఖరి నిమిషంలో లంచం తీసుకోవడానికి ఆసక్తి చూపకపోయినా, ఫిర్యాదుదారుడు వెనక్కు తగ్గినా.. లంచం అడిగిన అధికారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారి లంచం డిమాండ్ చేయడం నేరమే. అందుకు క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 7ఏ/2018 పీసీ సవరణ చట్టం ప్రకారం కేసులు బుక్ చేస్తున్నారు. దీంతో లంచం అడిగేందుకు అధికారుల్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. -
పైసలిస్తే.. పట్టా చేసేస్తారు!
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): పట్టాదారు ఎవరైనా సరే.. పైసలిస్తే ఎవరి పేరుపైనైనా పట్టా ఇచ్చేస్తారు.. తమ్ముడి జైలుకి వెళ్తే.. అన్న పేరిట పట్టా చేస్తారు.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం వీఆర్ఓల బదిలీలతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వీఆర్ఓలు గ్రామాల్లో రికార్డు అనుభవం ఉన్న వ్యక్తులను మధ్యవర్తిత్వంగా పెట్టుకొని అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులైన రైతుల భూములను రికార్డుల్లో మార్పు చేస్తున్నారు. భూ రికార్డుల్లో నమోదు చేయాలంటే భూమి కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజుల తర్వాత మీసేవలో డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత జిరాక్స్ డాక్యుమెంట్, ఆధార్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి విక్రయ పత్రాలు లేకుండానే, ఇళ్ల స్థలాల భూమిని ఏకంగా పట్టాభూమిగా మార్చి రికార్డులోకి ఎక్కించారు. ఈ విషయం విలేకరుల దృష్టికి వచ్చిందని తెలుసుకున్న అధికారులు పట్టా మార్పిడి నంబరును ఆన్లైన్లో తొలగించారు. గండేడ్ తరహాలో ఇక్కడ కూడా విచారణ చేపడితే మరిన్ని అక్రమ భాగోతాలు బయటపడే అవకాశం ఉంది. తేదీ లేకుండానే ప్రొసీడింగ్స్ మండలంలోని కొత్తమొల్గరలో సర్వే నంబరు 379లో ఇళ్ల స్థలాల పేరిట రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే సర్వే నంబరులో ఎకరా భూమి ప్రభుత్వం గతంలో పేదలకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమి, ఇళ్ల స్థలాలు ఉండటంతో డిజిటల్ సైన్ ఆన్లైన్లో పెండింగ్ ఉంచారు. కొత్త మొల్గరకు చెందిన కె.తిమ్మయ్య, నర్సమ్మ పేరు మీద ఒక్కొక్కరికి గాను 0.0250 గుంటల భూమిని పట్టా చేశారు. 60073, 60074 ఖాతా నంబర్లు సైతం ఆన్లైన్లో ఎక్కించారు. భూత్పూర్ తహసీల్దార్ మహేందర్రెడ్డి కె.తిమ్మయ్య, నర్సమ్మలపై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రొసీడింగ్స్ జారీ చేసిన తేదీ లేకపోవడం గమనార్హం. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండానే పట్టా మార్పు చేసినట్లు తెలిసింది. ప్రజావాణిలో ఫిర్యాదుతో.. అలాగే మండలంలోని పోతులమడుగు అనుబంధ గ్రామమైన గోపన్నపల్లిలో సర్వే నంబరు 165లో ఎకరా భూమిని కొనుగోలు చేసుకొని పట్టా చేసుకున్నారు. చెన్నయ్య 2012లో మృతి చెందడంతో భార్య మాల ఊషమ్మ పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చారు. భర్త మృతి చెందిన కొద్ది నెలలకే మాల ఊషమ్మ సైతం మృతిచెందింది. ఈమెకు మాల శంకరయ్య, వెంకటయ్య అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ తల్లి పేరు మీద ఉన్న సర్వే నంబరు 165లో ఉన్న ఒక ఎకరా భూమిని విరాసత్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే వెంకటయ్య భార్య మరణించిన కేసులో ఆయనకు మూడు నెలల జైలుశిక్ష పడింది. వెంకటయ్య జైలులో ఉన్న సమయంలోనే ఆయన అన్న శంకరయ్య, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, సంబంధిత అధికారులతో కుమ్మక్కై మొత్తం తన పేరిట పట్టా చేయించుకున్నాడు. జైలును శిక్ష అనుభవించి వచ్చిన వెంకటయ్య ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నేళ్లు వలస వెళ్లాడు. ఏడాది క్రితం భూమి విషయమై అన్న శంకరయ్యను అడగగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని తిరగడంతో అనుమానం వచ్చిన వెంకటయ్య గత నెల 24న ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ స్థానిక తహసీల్దార్కు శంకరయ్య ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయం చేయాలి.. నేను నా భార్య మృతి కేసులో మూడు నెలలు జైలు జీవితం అనుభవించే సమయంలో రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని మా అన్న పేరిట పట్టా చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత మా అన్న శంకరయ్యతో కలిసి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. పంచనామాలో ఇద్దరు పేర్లు రాసిచ్చాం. ఇద్దరికి భూమి చేయకుండా మా అన్న శంకరయ్య పేరిటే విరాసత్ చేశారు. విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి. విరాసత్ ప్రకారం నా భాగం నాకు పట్టా చేయాలి. -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్లోకి ఫస్ట్ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
డూప్లికెట్ మెమోకు లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి డూప్లికేట్ మెమోకు లంచం తీసుకుంటుండగా ప్రభుత్వ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్రావు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు. తనకు డూప్లికేట్ మెమో జారీ చేయాలని అహ్మద్ అబ్దుల్ హసీబ్ అక్బర్ భాస్కర్రావును కోరాడు. అయితే మెమో ఇచ్చేందుకు రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కర్రావు డిమాండ్ చేశాడు. దీంతో హసీబ్ అక్బర్ ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం అక్బర్ వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా భాస్కర్రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే గతంలో కూడా భాస్కర్రావు డూపికేట్ మెమోకు రూ.1,500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు తెలిపారు. మూడేళ్లలో ఇది రెండోసారని, భాస్కర్రావును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. -
లంచమిచ్చినా జైలుకే
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేకం చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం లంచం తీసుకున్న అధికారులే కాదు, ఇచ్చిన వారు కూడా శిక్షార్హులవుతారు. అవినీతి నిరోధక చట్టం–1988 సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లంచం తీసుకోవటంతోపాటు ఇవ్వడమూ నేరమే. లంచం ఇచ్చే వారికి ఇకపై మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధిం చే వీలుంటుంది. అవినీతి కేసులు దాఖలైన రెండేళ్లలోగా కోర్టులు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ మునియప్ప మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గమన్నారు. -
‘లంచం లేనిదే పని కావడం లేదు’
సాక్షి, వైఎస్సార్ కడప : నగర పాలక సంస్థ అధికారులపై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం లేనిదే ఏ పని కావడం లేదని మండిపడ్డారు. ప్రతి పేద వాడి దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. అధికార టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు చెప్పినట్టు అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అందరికి ఒకేలా పని చేయాలని.. ఇలా వ్యవహరించటం తప్పని.. హితవు పలికారు. అధికారుల తీరు మారకుంటే చూస్తు ఊరుకునేది లేదని బాషా హెచ్చరించారు. -
కాటేసిన లంచం
లంచం అడిగితే చెప్పుతో కొట్టండని రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా.. అధికారుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు.ఇదే లంచం ఓ రైతు కుటుంబాన్నిబలి తీసుకుంది. కాసిపేట (బెల్లంపల్లి): రుణం మంజూరు కోసం లంచం ఇచ్చుకోలేక ఓ రైతు భార్యా ఇద్దరు పిల్లలకు విషం తాగించి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మృతి చెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో ఆశించిన మేరకు లాభాలు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో వ్యవసాయం వదిలి టెంట్హౌస్ కోసం ఎస్సీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ను కలసి తన దీనస్థితిని వివరించగా.. స్పందించిన ఆయన యూనిట్ మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్ రుణం మంజూరుకు రూ.20 వేలు లంచం అడగడంతో ఇప్పటికే అప్పుల పాలైన తాను లంచం ఇచ్చుకునే స్థితిలో లేనని, ఇక రుణం రాదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న రాత్రి భార్య భూదేవి (31), కుమార్తె కీర్తన (14), కుమారుడు శిశాంత్ (12)లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ వేసుకున్నాడు. అందరూ తీవ్రమైన మత్తులోకి జారుకున్నారు. కానీ అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం జరగలేదు. అప్పటి నుంచి ఆందోళనగా ఉన్న తిరుపతి.. బుధవారం రాత్రి భార్యాపిల్లలకు యాపిల్ జ్యూస్లో క్రిమిసంహారక మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య మృతి చెందింది. ముగ్గురూ చనిపోయినట్లు భావించిన తిరుపతి.. తన అన్నయ్య శంకర్కు ఫోన్ చేయగా.. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం శంకర్ తిరిగి ఫోన్ చేయగా కొద్దిగా స్పృహలోకి వచ్చిన పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మానాన్నలు చనిపోయినట్లు విలపిస్తూ చెప్పారు. దీంతో శంకర్ హుటాహుటిన వచ్చి పిల్లలను బెల్లంపల్లి ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ కోలుకుంటున్నారు. వాయిస్ రికార్డు.. సూసైడ్నోట్ తిరుపతి ఆత్మహత్య చేసుకునే సూసైడ్ నోట్, ఫోన్లో వాయిస్ రికార్డు చేశాడు. తాను ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.6.5 లక్షల వరకు అప్పులు అయ్యాయని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల రుణం మంజూరైనా దానిని ఇప్పించేందుకు బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ప్రణయ్ సార్ (జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు లంచం అడుగుతున్నాడని పేర్కొన్నాడు. రుణం మంజూరు కాకపోవడం, అప్పులబాధ భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించాడు. గ్రామస్తుల రాస్తారోకో: లంచం అడిగి దంపతుల మృతికి కారకుడైన జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చొప్పరిపల్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయా లని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మందమర్రి సీఐ రాంచందర్రావు భరోసా ఇవ్వడంతోఆందోళన విరమించారు. నాన్ బెయిలబుల్ కేసు పెడతాం: ఏసీపీ అప్పుల విషయంలో ఒత్తిడి తెచ్చిన వారి వివరాలు సేకరించి వారిపై, లంచం అడిగిన ఉద్యోగిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. మంజూరైన రూ.5 లక్షల రుణాన్ని కలెక్టర్తో మాట్లాడి తిరుపతి కుటుంబానికి అందించేలా చూస్తామన్నారు. పిల్లలు చదువుకునేందుకు సహకరిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. డబ్బులు అడగలేదు: ఎంపీడీఓ బెల్లంపల్లి రూరల్: తిరుపతిని ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం ఎవరూ డబ్బులు అడగలేదని బెల్లంపల్లి ఎంపీడీఓ వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి రూ.5 లక్షల రుణం మంజూరు చేసి గతనెల 11న ఆన్లైన్లో అఫ్రూవల్ ఇచ్చామని పేర్కొన్నారు. రుణం మంజూరయ్యాక ఆ డబ్బులు అప్పులు కట్టుకోకుండా యూనిట్ పెట్టుకోవాలని చెప్పామే తప్ప కార్యాలయంలో ఎవరూ డబ్బులు అడగలేదని ఆయన స్పష్టం చేశారు. రుణం మంజూరు చేశాం ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో తిరుపతి పేరు ఉంది. అతడి దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ సిఫారసుతో రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తూ ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చాం. రుణం మంజూరు అయిన విషయాన్ని రెండు రోజుల క్రితమే బెల్లంపల్లి ఎంపీడీఓ ద్వారా లబ్ధిదారుడికి తెలియజేశాం. రూ.5 లక్షల రుణంలో రూ.2 లక్షలు బ్యాంకు రుణం కాగా.. మిగతా రూ.3 లక్షలు సబ్సిడీని వర్తింప చేశాం. రుణం మంజూరు కోసం డబ్బులు ఎవరడిగారో నాకు తెలియదు. రుణం మంజూరు చేసినట్లు సమాచారం ఇచ్చాక కూడా తిరుపతి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో అర్థంకావడం లేదు. – హరినాథ్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
30 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వర్సిటీ వీసీ
సాక్షి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి రూ.30 లక్షలు లంచం తీసుకుంటూ కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ వీసీ గణపతి అవినీతి నిరోధక విభాగం అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టు కోసం సురేశ్ అనే అభ్యర్థి వీసీ గణపతిని సంప్రదించాడు. అయితే, ఆయన రూ.35లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీనిపై సురేశ్ అవినీతి నిరోధక విభాగానికి సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం రూ.లక్ష నగదు, రూ.29 లక్షలకు చెక్కులను వీసీకి ఆయన నివాసంలో అందజేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలపై వర్సిటీ ప్రొఫెసర్ ధర్మరాజ్పైనా కేసు నమోదు చేశారు. ఇద్దరి నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరెన్సీ నోట్లను చించివేసి డ్రైనేజీలో పడ వేసిన వీసీ భార్య స్వర్ణలతపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. -
విద్యాశాఖలో అవినీతి పురుగు!
కె.జమ్మయ్య..గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుండగా సస్పెండ్కు గురయ్యారు. రీపోస్టింగ్ కోసం ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన శ్రమ ఫలించింది. రీపోస్టింగ్ కోసం కావాల్సిన పత్రాలను పంపించాలని విద్యాశాఖాధికారులు సూచించారు. దీంతో డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న ఎ.విక్టర్ప్రసాద్ను ఆశ్రయించారు. అయితే చేయి తడిపితేనే ఫైల్ కదులుతోందని తెగేసి చెప్పేశాడు. దీంతో చేసేది లేక రూ. 20 వేలు ఇచ్చేందుకు జమ్మయ్య ఒప్పుకున్నారు. ఇప్పటికే ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆయన అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు. వారిచ్చిన సలహా మేరకు జమ్మయ్య మంగళవారం సూపరిటెండెంట్ విక్టర్ప్రసాద్కు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విక్టర్ప్రసాద్ను బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. శ్రీకాకుళం సిటీ: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ స్థాయి అధికారి అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడటంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నానికి చెందిన కె.జమ్మయ్య 1984 జనవరి 27న భామిని మండలం గురండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తరువాత వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వహించారు. ఇతని భార్య విజేత యాగ్రోఫాం ఫైనాన్స్ సంస్థలో ఏజెంట్గా పని చేస్తుండేవారు. సంస్థకు, వీరికి మధ్య ఆర్థికపరమైన వివాదాలు తలెత్తాయి. దీంతో జమ్మయ్య కుటుంబంపై ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు 2002లో క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు జమయ్యను అరెస్టు చేశారు. ఆ సమయంలో చంగుడి ఎంపీ యూపీ స్కూల్లో ఎస్జీటీగా జమ్మయ్య పని చేస్తుండేవారు. బత్తిలి పోలీస్స్టేషన్లో ఆయనపై కేసు నమోదవ్వగా, 2003 ఆగస్టు 17ను జమ్మయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. తిరిగి 2010 నవంబర్ 11వ తేదీన జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. అయితే అప్పటి నుంచి గతేడాది ఆగస్టు వరకు జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకుండా శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు తాత్సారం చేశారు. దీంతో జమ్మయ్య తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇప్పటివరకు జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలిపాలని ఆదేశిస్తూ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి అతనికి సంబంధించిన సర్వీసు రిజిస్టర్ ఫైల్ డీఈవో కార్యాలయంలో కనిపించకపోవడంతో జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ నెలలో ఆయనకు చెందిన సర్వీసు రిజిస్టరు ఫైల్ దొరికింది. అయితే అతనికి అనుకూలంగా ప్రభుత్వానికి నివేదికను పంపించేందుకు విద్యాశాఖ సూపరింటెండెంట్ ఎ.విక్టర్ప్రసాద్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేíశారు. చేసేదిలేక జమయ్య అంగీకరించారు. తరువాత ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జమ్మయ్య నుంచి సూపరింటెండెంట్ విక్టర్ప్రసాద్ లంచంగా 20 వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విక్టర్ప్రసాద్ను బుధవారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాసరావు, రమేష్ పాల్గొన్నారు. విసిగిపోయాను రీ పోస్టింగ్ కోసం ఏడేళ్లు నిరీక్షించాను. జాప్యం జరగడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. తొలుత ఫైలు కనిపించలేదని ఇక్కడి అధికారులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఫైల్ కనిపించడంతో ఊరట చెందాను. ఇప్పటికే నా కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితిలో రీ పొస్టింగ్ కోసం సూపరింటెండెంట్ విక్టర్ప్రసాద్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. – కె.జమ్మయ్య, బాధితుడు -
కోటి ఇస్తామన్నారు
గాంధీనగర్: పటేల్ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వాఘానీ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో బీజేపీకి పటేళ్ల బలం పెరుగుతోందనే భావన వ్యక్తమైంది. అంతలోనే సీన్ రివర్స్ అయింది.. చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు. పటేల్ ఆందోళనలో కీలకంగా వ్యవహరించి.. శనివారం బీజేపీలో చేరిన వరుణ్ పటేల్, రేష్మా పటేల్లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమని విమర్శించింది. అటు, పటేళ్ల సంక్షేమానికి బీజేపీ ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదంటూ నిఖిల్ సవానీ అనే పటీదార్ నేత కమలం పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. నరేంద్ర పటేల్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘పటీదార్ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్ బీజేపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. కోర్టు నేతృత్వంలో విచారణ జరగని పక్షంలో గుజరాత్ ఎన్నికల పవిత్రతపైనే అనుమానాలు తలెత్తుతాయన్నారు. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ భయపడుతోందని.. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలను ఆలస్యం చేస్తోందన్నారు. ప్రధాని గుజరాత్ ప్రజలకు వరాలు ప్రకటించేందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారని మనీశ్ తివారీ ఢిల్లీలో ఆరోపించారు. -
రూ.10 వేలు తీసుకుంటూ.. పట్టుబడ్డాడు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోనున్న వేసైడ్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్ కంట్రోలర్ అధికారులు శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. ఆ రిపోర్ట్ ఎలా ఉన్నా తాను చూసుకుంటానని, రూ.పది వేలు ఇవ్వాలని హోటల్ యజమాని వెంకటేశ్వరరావుతో శ్రీనివాసరెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో లంచం తీసుకుంటున్నాడనే ముందస్తు సమాచారంతో ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఇన్స్పెక్టర్ తేజేశ్వరరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
♦ సాదాబైనామా’కురూ.27వేలు డిమాండ్ ♦ తన గదిలో లంచం తీసుకుంటూ ♦ పట్టుబడిన వీఆర్వో రవి వైరా : సాదా బైనామా ప్రక్రియ పూర్తి చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాం డ్ చేసిన వైరా ఇన్చార్జ్ వీఆర్వో మీనుగు రవిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాలు ఇలా.. వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన న్యా యవాది జోనబోయిన గోవిందరావు..తన 7.5 ఎకరాలు, తన సోదరుడికి చెం దిన మరో రెండు ఎకరాల భూమి నిసాదాబైనామా కింద ఆన్లైన్ చే యాలని ఏడాదికాలంగా తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. అష్ణగుర్తి, గొల్లెనపాడు వీఆర్వోగా చేస్తున్న రవి, వైరా ఇన్చార్జ్గా కూడా ఉండడంతో..ఆయనను కలిశారు. 1బీ, ఆన్లైన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.27వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో..బాధితుడు ఏసీబీ కార్యాలయంలో సంప్రదించారు. వారి సూచనల మేరకు డబ్బు తీసుకొని వీఆర్వోకు ఫోన్ చేయగా..బ్రాహ్మణపల్లిలోని తన గదికి రావాలని సూచించగా..అక్కడికి వెళ్లి లంచం ఇస్తుండగా..ముందగానే వలపన్ని ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, పద్మ, సిబ్బంది ఉన్నారు. రైతుల గోడు..: ఏసీబీ డీఎస్పీని పలువురు రైతులు కలిసి..తహసీల్దార్ కార్యాలయంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా..ఈ విషయమై బాధ్యులైన అధికారిని ఆయన ప్రశ్నించారు. విసిగిన లాయర్ తెగువతో.. ఖమ్మంలో నివాసముంటున్న న్యాయవాది జోనబోయిన గోవిందరావు సాదా బైనామా ప్రక్రియ కోసం దాదాపు ఏడాదికాలంగా..వైరాకు వచ్చి వెళుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని, వంశపారపర్యంగా వచ్చిన భూమిని నిబంధనల ప్రకారం కేటాయించాలని దరఖాస్తు చేసుకోగా..ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వీఆర్వో రవి ఎకరానికి రూ.10వేలు నుంచి రూ.20వేలు తీసుకుంటానని, లాయర్ కాబట్టి తగ్గించి తీసుకుంటున్నాని ఇబ్బంది పెట్టాడని, గతంలో రూ.6వేలు ఇచ్చానని తెలిపారు. చివరకు ఎకరానికి రూ.3వేల చొప్పున ఇవ్వాల్సిందేనని, ఆఫీసులో మిగతావారికి వాటా ఇస్తానని పట్టుబట్టడంతో.. విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు. గోవిందరావు, న్యాయవాది ప్రతి పనికీ ఓ లెక్క..ఆయన గదే అడ్డా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో రవి వైరా గ్రామ పంచాయతీ ఇన్చార్జ్. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల నుంచి ప్రతి పనికీ ఓ లెక్క ఏర్పాటు చేసుకొని కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత మండల అధికారి కనీసం మందలించలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గది ఉన్నా..బ్రాహ్మణపల్లిలో ఓ కిరాయి గదిని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొణిజర్ల, మధిర మండలాల్లో పనిచేసిన చోట కూడా వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారనే మచ్చుంది. ఉలిక్కి పడ్డ వైరా..అప్పుడు వారిపై..ఇప్పుడు ఇతడిపై 2007లో వైరాలో మోటారు వాహనాల తనఖీ అధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరావు..ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. ఈ కార్యాలయంలో ఎంవీఐగా పనిచేసిన ఎండీ.గౌస్ పాషా కొత్తగూడెం ఎంవీఐగా బదిలీపై వెళ్లాక కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పుడు రెవెన్యూ విభాగంలో వైరా ఇన్చార్జ్ వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడడంతో చర్చనీయాంశమైంది. ఏసీబీ అధికారుల దాడితో..కొన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగి ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రక్రియ చేపడుతుంటే..అవినీతికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూడడంతో..రైతులు, సామాన్యులు దీనిపై చర్చించుకున్నారు. -
ప్రతి పనికీ ఓ లెక్క..పత్రం ఏదైనా పక్కా..!
♦ నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో లంచావతారాలు ♦ ఉద్యోగులకు లేని రోగాలు ఉన్నట్లు సృష్టించి ధ్రువపత్రాల జారీ ♦ దళారుల సాయంతో అక్రమ దందా ♦ మనిషిని చూడకుండానే పత్రాలు అందజేత అదో ప్రభుత్వ వైద్యశాల.. జిల్లాలో పల్నాడు ప్రాంతానికి ఆయువుపట్టు.. అక్కడ లంచావతారాలెత్తిన అధికారులదే హవా.. అక్రమ సర్టిఫికెట్లకు వాళ్లు కేరాఫ్ అడ్రస్.. వారికి డబ్బులిస్తే చాలు.. మనిషిని కూడా చూడకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేంత ఘనులు.. వారి వద్ద ఎప్పుడూ ‘జీ.. హుజూర్..!’ అంటూ దళారులు. ప్రతి పనినీ చాకచక్యంగా చేసిపెట్టడం వారి ప్రత్యేకత. సొంత పనులు చూసుకుని.. అసలు పనిని పక్కన పెట్టే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫినెస్ సర్టిఫికెట్లు అందజేయడం వీళ్ల పని. సర్టిఫికెట్ను బట్టి రేటు కట్టి.. ఉద్యోగి అవసరాన్ని బట్టి ధర మార్చి డబ్బు పోగుచేసుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి..! – నరసరావుపేట టౌన్ నరసరావుపేట : వైద్యశాలలో రోగులకు వైద్యసేవలు అందించాల్సిన అధికార సిబ్బంది అక్రమ దందాకు తెరతీశారు. ఏం చేసినా అడిగేవారు లేరనే ధైర్యంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అలాంటి అక్రమ దందాకు నరసరావుపేట ఏరియా వైద్యశాల వేదికైంది. ఉద్యోగులు కోరిన రీతిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తూ రూ. వేలల్లో డబ్బు దండుకుంటూ వైద్యాధికారులు పబ్బం గడుపుకొంటున్నారు. ఈ వ్యవహారంలో దళారులదే కీలక పాత్ర. వారు చెప్పిందే శాసనంగా మారింది. ధ్రువపత్రం కావాల్సిన ఉద్యోగి లేకుండానే అతని పేరిట సర్టిఫికెట్ అందుతుందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగులు అనారోగ్యం పాలైతే తిరిగి ఉద్యోగంలో చేరడానికి యాజమాన్యాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాంటివారికి ఫిటెనెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం సబబు. అయితే.. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సొంత పనుల కోసం విధులకు హాజరు కాకుండా రోజుల తరబడి గడిపి విధుల్లో చేరాలంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ధ్రువపత్రం తప్పనిసరి. అలాంటి వారిని గుర్తించి దళారులు చక్రం తిప్పుతున్నారు. వేలకు వేలు డబ్బులు దండుకొని ఉద్యోగులకు ఏదో ఒక జబ్బు ఉన్నట్లు చిత్రీకరించడం లేదా సదరు ఉద్యోగులు ఫిట్గా ఉన్నారని సర్టిఫికెట్లు ఇవ్వడం ఆస్పత్రిలో నిత్య కృత్యంగా మారింది. కనీస విచారణ కూడా లేదు.. డబ్బు ముట్టజెప్తే ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడానికైనా వైద్యాధికారులు సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా దళారులను కూడా నియమించడం విశేషం. పత్రాలు అవసరమైన వారు దళారుల సాయంతో సర్టిఫికెట్లు పొందుతున్నారు. సదరు వైద్యులు కనీస విచారణ కూడా లేకుండా సంతకాలు పెట్టి పంపడం గమనార్హం. కొందరి పేర్లను కనీసం ఓపీలో కూడా రాయకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారంటే అధికారుల ధనార్జన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ, రైల్వేశాఖ, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలకు చెందిన ఉద్యోగులు ఎక్కువశాతం ఫిట్¯నెస్లు కోరుతుండటంతో అక్రమార్కుల దందా మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నెలలో కనీసం 30 నుంచి 40 మంది ఇలా అక్రమంగా సర్టిఫికెట్లు పొందుతారని ఓ అంచనా. గతంలోనూ విమర్శలు.. అధికార పార్టీ అండదండలతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలక్రితం నిబంధనలకు విరుద్ధంగా ఔషధాల దహనం చేసిన అధికారులు నిన్నామొన్న రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ విమర్శలపాలయ్యారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమ పద్ధతిలో ధ్రువపత్రాలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా పల్నాడు ప్రాంతానికే తలమానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జరగడం గమనార్హం. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ... ఏరియా వైద్యశాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతోనే ఈ పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో శిశుమరణాలు సంభవించినా, రోగులకు బయట మందులు, స్కానింగ్ పరీక్షలు రాసినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. వైద్యశాలలో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యరంగంపై దృష్టి సారించిన కలెక్టర్ వైద్యశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. అంతా దళారులదే హవా... వైద్యశాలలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా దళారులను ఆశ్రయించాల్సిందే. ఒక్కో సర్టిఫికెట్కు ఒక్కో ధర నిర్ణయించి ఇక్కడి సిబ్బంది పనులు చక్కబెడుతుంటారు. వివరాలు ఇస్తే మనిషితో కూడా పని లేకుండా సర్టిఫికెట్ నిమిషాల్లో సిద్ధమవుతుంది. ఒక్కో సర్టిఫికెట్కు ఇచ్చే రోజుల కాలవ్యవధిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి రోగిని పరీక్షించిన అనంతరం డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండగా అసలు రోగిని పరీక్షించకుండానే వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడం కొసమెరుపు. -
దినకరన్కు మరిన్ని కష్టాలు...
ఢిల్లీ: అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్పై ఎన్నికల కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదుకు నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డబ్బు పంపిణీ వ్యవహారం కేసులో దినకరన్తో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి విజయ్భాస్కర్పైనా కేసు నమోదు అయింది. మరోవైపు దినకరన్పై ఈడీ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. విచ్చలవిడిగా సాగిన ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
ఏసీబీ వలలో పెద్ద లంచావతారాలు
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఈసీఎస్ అధికారులు - వారి నుంచి రూ.10 లక్షల నగదు, చెక్కులు స్వాధీనం ఉక్కునగరం (గాజువాక): ఏసీబీ వలలో పెద్ద లంచావతారాలు పడ్డాయి. కరెంటు ఫేజ్ మార్చడానికి రూ. లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. వారి వద్ద నుంచి నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. పరవాడ బోనంగిలో సంస్కృతి గ్లోబల్ స్కూల్కు చెందిన టూ ఫేజ్ కరెంటును త్రీ ఫేజ్గా మార్చేందుకు పాఠశాల యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై ఆర్ఈసీఎస్ కశింకోట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) నక్కా సురేష్, పరవాడ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) దాసరి శివశంకర్ ప్రసాద్ మొదట రూ. 14 లక్షలు డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేమని బతిమాలగా రూ. 9 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని అధికారులు చెప్పారు. దీంతో పాఠశాల చైర్మన్ పి.సూర్యనారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సలహా మేరకు గురువారం వారు అడిగిన రూ.3 లక్షలు నగదు, రూ.1.20 లక్షలు చొప్పున ఐదు చెక్కులను సిద్ధం చేయగా.. ఆ విషయం తెలిసిన ఇద్దరు అధికారులు సరాసరి స్కూల్ చైర్మన్ ఇంటికే వచ్చేశారు. అక్కడకు చేరుకున్న ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది అధికారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ అధికారులను వెంటనే అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ లంచం కేసులో పట్టుకున్న అతి పెద్ద కేసు ఇదే అన్నారు. నగదుతో పాటు చెక్కులు తీసుకోవటం ఆశ్చర్యకరమన్నారు. -
లైసెన్స్ జారీకి లంచం డిమాండ్
ఇద్దరు ఎయిర్పోర్టు అధికారులు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: లైసెన్సు జారీకి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎయిర్పోర్టు అధికారులు శుక్రవారం సీబీఐకి చిక్కారు. హైదరాబాద్లోని బడంగ్పేట్కు చెందిన సమీర్.. ‘మై టీ’ పేరుతో టీ కప్పుల బిజినెస్ ప్రారంభించాడు. అమెరికా, కెనడాలకు ఎగుమతి చేసేందుకు పైటో శానిటరీ లైసెన్స్ కోసం ప్లాంట్ క్వారంటైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అథారిటీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న స ంబంధిత అధికారులు అతుల్ ఠాక్రే, మనోజ్.. సమీర్కు రూ.15 వేలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో సమీర్ ఈ విషయాన్ని సీబీఐకి ఈనెల 10న ఫిర్యాదు చేశాడు. -
ఇంటికి వెళ్లి వస్తామంటే ఊరుకోను ఇక్కడే..
► గర్భిణిని లంచం డిమాండ్ చేసిన వైద్యుడు ► పసిపిల్లలను ఇవ్వాలన్నా సొమ్ము ఇవ్వాల్సిందే మల్కన్గిరి: మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వ లేకుండా ప్రవర్తించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఖోయిరాపుట్ సమితి బొండాçఘాట్లోని మందిలిపొడియా గ్రామంలోని బొండా తెగకు చెందిన గిరిజన మహిళ గురుసీసా రెండోసారి గర్భం దాల్చింది. కడుపులో కవలలు ఉన్నట్టు గ్రామంలో మంత్రసాని తెలిపింది. నెలలు నిండిన ఆమెను ప్రసవం కోసం మంగళవారం ఆమె భర్త, తమ్ముడు మల్కన్గిరి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో విదుల్లో ఉన్న వైద్యుడు నిర్మల్నాయక్ ఆమెను పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేయాలి..రూ. ఐదువేలు ఇవ్వండి..లేకుంటే ఆపరేషన్ చేయనని చెప్పాడు. దీంతో ఏమీ తోచక గర్భిణితో పాటు భర్త, సోదరుడు అరగంట సేపు అలానే ఉన్నారు. గురుసీసాకు చికిత్స అందించండి అని వేడుకున్నారు. వైద్యుడు రూ.మూడు వేలు ఇవ్వమన్నాడు. ఇంటికి వెళ్లి వస్తామంటే ఊరుకోను ఇక్కడే ఇవ్వాలని వైద్యుడు తెగేసి చెప్పాడు. దీంతో గురుసీసా తమ్ముడు అక్కడ ఎవరినో అడిగి రెండు వేల రూపాయలు ఇవ్వడంతో వైద్యుడు ఆపరేషన్ చేశాడు. పిల్లలు ఇద్దరూ క్షేమంగా∙పుట్టారు. కానీ తక్కువ బరువు ఉండడంతో పిల్లలను ఐసీయూలో పెట్టారు. అయితే మిగతా మూడు వేలు ఇస్తేనే పిల్లలను అప్పగిస్తామని వైద్యుడు చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే పిల్లలు చనిపోయారని సర్టిఫికెట్ ఇస్తానని బెదిరించాడు. స్పందించిన ఎమ్మెల్యే దీంతో గురుసీసా భర్త వెంటనే మల్కన్గిరి ఎమ్మెల్యే మనాస్మడకామిని కలిసి విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని సీడీఎంఓ ఉదయ్ చంద్రమిశ్రా, ఎడీఎం రఘుమణి గొమాంగోలతో కలిసి వార్డుకు వచ్చి గురుసీసా భర్తను విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలను పరిశీలించారు. అనంతరం వైద్యుడు నిర్మల్నాయక్ను ఆ వార్డులో విధుల నుంచి సీడీఎంఓ తొలగించారు. అనంతరం సీడీఎంఓ ఉదయ్ చంద్ర మిశ్రో మాట్లాడుతూ నిర్మల్నాయక్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేరు. ఆయన వస్తే వైద్యుడ్ని సస్పెండ్ చేయిస్తాం..ఇకపై ఎక్కడా ఇలా ప్రవర్తించకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మానాన్మాడకమి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలన్నీ త్వరలోనే గురుసీసాకు అందజేసి వైద్యునిపై చర్య తీసుకుంటామని చెప్పారు. -
ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తమశీల్దార్..
► రూ.1.30 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి ► భూసేకరణ డబ్బులిచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్ హన్మకొండ అర్బన్: రెవెన్యూశాఖలో అవినీతి మరో సారి కట్టలు తెంచుకుంది. ఎన్హెచ్ భూసేకరణలో భూమి కోల్పోయిన వారి కి పరిహారం అందించేందుకు రూ.2లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ.1.30 లక్షలు తీసుకుంటూ వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ టి.శ్రీనివాస్గౌడ్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, బాధితుడు మధుసూదన్రెడ్డి కథనం ప్రకారం.. హన్మకొండ జులైవాడకు చెందిన రిటైర్డ్ ఎస్సై సీహెచ్ మధుసూదన్రెడ్డి 2010లో స్టేషన్ ఘన్పూర్ వద్ద ఎన్హెచ్–163 పక్కన 464 చదరపు అడుగుల స్థలం కొన్నారు. ఆ స్థలం తన కూతురు స్వాతి పేరుతో రిజిస్టర్ చేయిం చారు. ఈ భూమిలో కొంత మేరకు రోడ్డు విస్తరణలో పోయింది. ఈ భూమి ని ప్రభుత్వం సేకరించినందుకు బాధితులకు పరిహారం చెల్లించాలి. ఈ మేరకు బాధితులకు రూ.7.11లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఇవ్వడానికి వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలోని డీటీ టి.శ్రీని వాస్గౌడ్ రూ.2లక్షలు డిమాండ్ చేశారు. ముందు లంచం ఇస్తేనే ఫైల్ మీద సంతకం చేయించి ఇస్తామని చెప్పాడు. దీంతో లంచం ఇచ్చుకోలేక బాధితులు గత నెల 30న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అంతేకాకుండా బాధితులు కలెక్టర్కు, జేసీకి ఫిర్యాదుచేశారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం సు మారు 7 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు రా ఘవేందర్రావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఇదే రికార్డు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడడంలో ఇదే రికార్డు. గతంలో కలెక్టరేట్లో పట్టుబడ్డ డీపీఓ రూ. 1లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు. తొమ్మిది నెలలుగా వేధించారు.. మా భూమికి పరిహారం ఇచ్చే విషయంలో సుమారు తొమ్మిది నెలలుగా మమ్మల్ని వేధించారు. ప్రతిరోజు ఉదయం రావడం సాయంత్రం వరకు ఇక్కడే ఉండటం నాకు డ్యూటీగా అయింది. పరిహారం ఇవ్వాలంటే రూ.2లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.1.50 లక్షలకు ఒప్పుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్కు తిరిగే క్రమంలో నాకు యాక్సిడెంట్ కూడా అయింది. వేధింపులు భరించలేక ఏసీబీకి ఫిర్యాదు చేశా. – మధుసూదన్రెడ్డి , బాధితుడు -
ఏసీబీ వలలో జియమ్మవలస ఎమ్మార్వో
జియలమ్మవలస: డబ్బు కో్సం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక ప్రజలను పట్టి పీడిస్తున్నారు. తాజాగా ఓ రైతు నుంచి తహశీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. విజయనగరం జిల్లా జియమ్మవలసకు చెందిన ఓ రైతు వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న తహిశీల్దార్ కొల్లి వెంకటరావును ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఆయన్ని విచారణ చేపడుతున్నారు. పార్వతీపురంలో ఉన్న తహశీల్దార్ నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ విషయంలో మనమే టాప్!
బెర్లిన్/న్యూఢిల్లీ: ప్రభుత్వాలు మారినా, అధికారం చేతులు మారుతున్నా ఇండియాలో అవినీతి రేటు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బల్లకింద చేతులు పెట్టే ఆనవాయితీకి అడ్డుకట్ట పడడం లేదు. ఆసియా పసిఫిక్ లో అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది. ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చామని మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సంస్థ 'ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్' నిర్వహించిన సర్వే తెలిపింది. అమ్యామ్యాలు సమర్పించుకున్నామని భారత్ లో 69 శాతం మంది చెప్పారు. ఇండియా తర్వాతి స్థానంలో వియత్నాం నిలిచింది. లంచాలు ఇచ్చామని వియత్నాంలో 65 శాతం మంది వెల్లడించారు. పాకిస్థాన్ లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. జపాన్ అతి తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత సంవత్సర కాలంతో పోలిస్తే చైనాలో 73 శాతం అవినీతి పెరిగిందని సర్వే అంచనా వేసింది. 16 దేశాల్లో 20 వేల మంది అభిప్రాయాలతో సర్వే నిర్వహించారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో 90 కోట్ల మంది గత సంవత్సర కాలంలో కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చారని ఈ సర్వే అంచనా వేసింది. లంచాలు తీసుకోవడంతో పోలీసులు అందరి కంటే ముందున్నారని వెల్లడించింది. 'అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ సేవలకు లంచాలు సమర్పించుకుంటున్నారు. అవినీతి కారణంగా ఎక్కువగా పేదలే నష్టపోతున్నార'ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అధిపతి జోస్ ఉగాజ్ పేర్కొన్నారు. -
లంచం ఇస్తేనే మరుగుదొడ్డి బిల్లు?
మౌలిక వసతుల కోసం ఫిర్యాదులు గ్రీవెన్స్సెల్లో దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ వరంగల్ అర్బన్ : స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్డి బిల్లు రావాలంటే రూ. 2 వేల లంచం అడుగుతున్నారంటూ పైడిపల్లికి చెందిన పలువురు బాధితులు కమిషనర్ శృతిఓజాకు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్ సెల్ కార్యక్రమం జరిగింది. కమిషనర్ శృతి ఓజా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, మహిళ సంఘాల లీడర్లు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు కమిషనర్కు వివరించడంతో అవాక్కయ్యారు. వెంటనే విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కనీస వసతులైన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పైపులైన్లు కోసం ఫిర్యాదులు అందాయి. ఇంజినీరింగ్ విభాగం కోసం 25 ఫిర్యాదులు రాగా, టౌన్ప్లానింగ్కు 8, జనరల్ విభాగానికి 10, ప్రజారోగ్యంకు 3, పన్నుల విభాగానికి 3, అర్బన్ మలేరియాకు 1 చొప్పన ఫిర్యాదులు అందాయి. మడికొండ ఎంఎన్ నగర్లో మౌలిక వసతులు, 39వ డివిజన్లో శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేశారు. 52వ డివిజన్ మొయిన్ రోడ్డు బాపూజీ నగర్లో 30 వ డివిజన్లోని లోటస్ కాలనీలో డ్రైయినేజీలు దెబ్బతిని, మురుగు నీరు పారుతుందని, కొత్తగా నిర్మించాలని కోరారు. ఉర్సు డీకే నగర్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించుకున్నా బిల్లులు రాలేదని ముగ్గురు లబ్ధిదారులు కమిషనర్ శృతి ఓజాను వేడుకున్నారు. పింఛన్ ఇప్పించండి నాకు రెండు కళ్లు కనబడవు. వందశాతం అంధుడిగా ఎంజీఎం వైద్యులు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. గత ఏడాది 4వ నెలలో పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. విచారణ చేశారు. ఇంతవరకు పింఛన్ రాలేదు. ఎలాగైనా పింఛన్ డబ్బులు ఇప్పించండి. – గిరిబాబు, అంధుడు -
ఏసీబీకి పట్టుబడిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
-
ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
రూ.6 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం ఎస్ఈ, సూపరింటెండెంట్ ఆస్తులపై సోదాలు నల్లగొండ క్రైం: ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారు లను అరెస్టు చేశారు. నల్లగొండలో ఓ కాం ట్రాక్టర్ వద్ద రూ.6 లక్షలు లంచం తీసుకుం టుండగా గ్రామీణ తాగునీటి పథకం (ఆర్డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్ను, ఇం దుకు ప్రోత్సహించిన ఎస్ఈని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లగొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారి భాస్కర్రావు లంచం తీసుకుంటుం డగా పట్టుబడిన విషయం మరువక ముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీకీ చిక్కడం ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. ఇలా చిక్కారు.. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన శాస్త్రీ వివేకానందరెడ్డి పుష్కరాల సమయంలో నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్వో ప్లాంట్లు సహా మొత్తం 39 పనులను చేపట్టాడు. టెండర్ లేకుండా కాంట్రాక్టర్కు అప్ప గించడంతో పనులు పూర్తి చేశాడు. 30 పనులకు బిల్లులు చెల్లించగా, మిగిలిన తొమ్మిది పనులకు రూ.30 లక్షల బిల్లులు రావాల్సి వుంది. ఈ బిల్లుల కోసం కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం సూపరిం టెండెంట్ లక్ష్మారెడ్డిని కలవగా రూ.6 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో వివేకా నందరెడ్డి ఏసీబీ నల్లగొండ డీఎస్పీ కోటేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుం డగా అక్కడే కాపుగాసిన ఏసీబీ అధికారులు లక్ష్మారెడ్డిని పట్టుకున్నారు. బిల్లుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈని హైదరాబాద్లో.. లంచం విషయంలో లక్ష్మారెడ్డిని ప్రోత్సహిం చిన ఎస్ఈ రమణను ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని నల్లగొండకు తీసుకొచ్చారు. ఇద్దరి ఆస్తుల ను తనిఖీ చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
కేజ్రీవాల్కు ఈసీ మందలింపు
ఓటుకు ‘లంచం’వ్యాఖ్యలపై మండిపాటు న్యూఢిల్లీ: గోవా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఓటుకు లంచం వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మరోసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఆప్ గుర్తింపు రద్దుతో పాటు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని హెచ్చరించింది. ‘కాంగ్రెస్, బీజేపీలు వచ్చి డబ్బులు పంచుతాయి. వాటిని తీసుకోండి. ఓటు మాత్రం ఆప్కే వేయండి’ అని గోవాలో ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ గతంలో అన్నారు. దీనిపై ఈసీ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈసీ ఆదేశాలను కేజ్రీవాల్ తప్పుపట్టారు. దీనిపై కోర్టులో సవాలు చేస్తానన్నారు. ‘కింది కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఈసీ దాన్ని పట్టించుకోలేదు’అంటూ ఢిల్లీ సీఎం ట్వీట్ చేశారు. ఈసీకి ఇచ్చిన సమాధానంలో కూడా కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తానే ఓటరుకీ లంచం ఇవ్వజూపలేదని, ఆ దిశగా ఎవరినీ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో వాటర్షెడ్ టీఏ
మార్కాపురం: ఇద్దరు రైతుల నుంచి లంచం తీసుకుంటున్న వాటర్షెడ్ పథకం టెక్నికల్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న వాటర్షెడ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం మండలం బిరుదుల నరవకు చెందిన సీహెచ్ చిన్న సాల్మన్, పెద్దనాగులు ఈ ఏడాది మేలో తమ పొలంలో పంట సంజీవని పథకం కింద నీటి కుంటలు తొవ్వుకున్నారు. ఒక్కో కుంటకు 1.80 లక్షల రూపాయలతో వాటర్షెడ్ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ (కాంట్రాక్టు ఉద్యోగి) త్రిపురారెడ్డి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలలు నుంచి బిల్లులు మంజూరు చేయకుండా రైతులను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కొక్కరు తనకు 20 వేల రూపాయలు ఇస్తేనే నిధులు మంజూరు చేయిస్తానని రైతులతో చెప్పాడు. ఈ నెల 13న సాల్మన్, పెద్ద నాగులు కలిసి ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వాటర్షెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసిన పది రూ.2 వేల నోట్లు మొత్తం రూ.20 వేలు బాధిత రైతులకు ఇచ్చారు. ఆ నగదు తీసుకున్న రైతులు నేరుగా త్రిపురారెడ్డి వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆయన వెంటనే ఆ నగదును జేబులో పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐ ప్రతాప్కుమార్ల ఆధ్వర్యంలో ఎస్ఐ కరీముల్లా, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్లు లోపలికి వెళ్లి త్రిపురారెడ్డిని అదుపులోకి తీసుకుని రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. తమను ఆరు నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో విసిగి వేసారి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ వార్త పట్టణంలో క్షణాల్లో తెలిసి పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది అలర్ట్ అయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
సచివాలయంలో ఏసీబీ దాడులు
అమరావతి: ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ను వలపన్ని పట్టుకున్నారు. శ్రీనాథ్ హోంశాఖ విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలుతున్న మామూళ్ల మతాబు!
– వాణిజ్య పన్నుల శాఖ అధికారుల 'దీపావళి' దందా – పండుగ మామూళ్లు ఇవ్వాలని వసూళ్లు.. షాపును బట్టి రేట్లు – ప్రశ్నిస్తే తనిఖీల పేరుతో బెదిరింపులు కర్నూలు(రాజ్విహార్): దీపావళి పండగకు మామూళ్ల మతాబులు పేలుతున్నాయి. పండగ సందర్భంగా బాణా సంచా సామగ్రి అమ్మే దుకాణాల నుంచి కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వ్యాపారులను.. తనిఖీల పేరుతో బెదిరిస్తున్నారు. ఆర్డీఓ లైసెన్స్లు ఇచ్చినా.. సాధారణంగా ప్రతి ఏటా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు నిర్ణయించిన స్థలంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తారు. ఇందుకు సంబంధిన రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) అనుమతులు ఇస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖ, పోలీసుల, అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఆవరణంలో బాణాసంచా అంగళ్లు పెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే వ్యాపార లావాదేవీలను బట్టి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు అధికారులు సందట్లో సడేమియాలా మామూళ్ల దందాకు తెరలేపారు. దీపావళి టపాసులు అమ్మే వ్యాపారుల నుంచి రూ.2వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. సామూహికంగా ఏర్పాటు చేసే షాపులతోపాటు చిన్నాచితకా కిరాణం షాపుల వద్ద బాణాసంచా సామాగ్రి తెచ్చుకునే వారి నుంచి కూడా వసూళ్లు మొదలు పెట్టారు. రూ.7.50లక్షల వరకు మినహాయింపు ఉన్నా.. చిరు వ్యాపారులు.. వాణిజ పన్నుల శాఖ లైసెన్స్లు కలిగి ఉండరు. వీరికి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. రూ.7.50లక్షలకు పైబడి లావాదేవీలకు ఉన్న అంగళ్ల నుంచి 14.5శాతం పన్నులు వసూలు చేస్తారు. కాని ఆ కింది స్థాయి అధికారులు ఈ నిబంధన పక్కన పెట్టి ఒక అడుగు ముందుకేశారు. కొందరు ఏసీటీఓలకు తోడు ఉద్యోగులు జతకట్టి బాణసంచా దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కింది నుంచి పైవరకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఒక్కోక్క దుకాణం నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాదూకూడదంటే దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నూలులోని పాతబస్టాండ్, నెహ్రూ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మామూళ్లు ఇవ్వనందుకు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ దందా లక్షల రూపాయాలకు చేరినట్లు తెలుస్తోంది. అధికారులు, వ్యాపారులకు మధ్య కొందరు అకౌంటెంట్లు, ఆడిటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి : పి. నాగేంద్ర ప్రసాద్, సీటీఓ, కర్నూలు–1సర్కిల్. పెద్ద వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలి. రూ.7.50లక్షల లోపు వ్యాపారం ఉంటే ట్యాక్స్ పరిధిలోకి రారు. మామూళ్లు అడుగుతున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి. వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాం. -
రూ.3.5 లక్షలకు గాంధీలో ఉద్యోగం!
చిలకలగూడ: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన బాబు(30) గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన బాలానగర్కు చెందిన శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. అదేవిధంగా పరిచయం అయిన మరో ముగ్గురుతో కలిసి ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమకు తెలిసిన వారికి చెప్పారు. బాలానగర్కు చెందిన బాలకృష్ణ ఉద్యోగం కోసం యత్నిస్తున్నాడని తెలుసుకున్నారు. అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.5 లక్షలకు బేరం కుదర్చుకుని పథకం ప్రకారం బాలకృష్ణ నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆరునెలలైనా ఉద్యోగం రాకపోవడం, సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండడంతో అనుమానం వచ్చిన బాలకృష్ణ 20 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వచ్చి ఆరా తీయగా, ల్యాబ్ టెక్నిషియన్ బాబును విధుల్లోంచి తొలగించినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా సభ్యులు బాబు(30), శ్రీనివాస్(31), శ్రవణ్(31)లను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన మోసం ఒప్పుకున్నారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఎస్ఐ మోహన్ తెలిపారు. -
వీఆర్వోల లంచావతారం
పట్టాదారు పాసుపుస్తకాలు, కంప్యూటర్ అడంగళ్లు, భూముల వివరాల కోసం కొందరు వీఆర్వోలు అన్నదాతలను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. తాజాగా సోమవారం తెలంగాణలోని రెండు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వీఆర్వోల లంచావతారం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లా చిట్యాల మండలం పంగిడిపల్లి గ్రామ పంచాయితీలో లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గ్రామానికి చెందిన గౌడ సమ్మయ్య అనే రైతు నుంచి స్థానిక వీఆర్ఓ కొత్తూరి రవీందర్ రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రందించాడు. ఈ క్రమంలో ఈ రోజు రైతు నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వీఆర్ఓ మల్లేశం, దుర్గయ్య అనే రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పెద్ద కల్వల గ్రామానికి చెందిన దుర్గయ్య అనే రైతు తన భూమి మ్యుటేషన్ కోసం వీఆర్ఓకు దరఖాస్తు చేసుకోగా రూ.15 వేలు డిమాండ్ చేశాడు. 5 వేల రూపాయలు ఇదివరకే ఇచ్చినా పనిచేయకపోవడంతో పాటు మిగతా డబ్బులు కూడా ఇవ్వాలన్నాడు. చివరకు రూ.10 వేలు రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ వెనక్కి..
లండన్: డోపింగ్ పరీక్షల గురించి ముందుగానే సమాచారం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలపై కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ మైకేల్ రోటిచ్ను రియో గేమ్స్ నుంచి వెనక్కి రప్పించారు. సండే టైమ్స్, జర్మనీ టీవీ చానెల్ ఏఆర్డీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో అతను దొరికిపోయాడు. 10 వేల పౌండ్లు ఇస్తే డోపింగ్ చేసిన అథ్లెట్లకు టెస్టుల గురించి ముందుగానే సమాచారం చేరవేస్తానని ఇందులో తేలింది. దీంతో రోటిచ్ను కెన్యా అథ్లెటిక్స్ సమాఖ్య వెంటనే వెనక్కి రప్పించింది. -
ఒక పిల్లి కథ
హ్యూమర్ప్లస్ మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో అదే మనల్ని వెంటాడి వేధిస్తుంది. ఇది తెలియక భార్యలు భర్తల నుంచి, భర్తలు భార్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సకాలంలో పాలు దొరికినంతకాలం జైలయినా ఒకటే, ఆరుబయటయినా ఒకటే. తల్లి భాష వల్ల ఒక పిల్లి చిక్కుల్లో పడింది. పాలగిన్నెని చూసినప్పుడల్లా ‘మ్యామ్యా’ అని మాతృభాషలో అరవడం వల్ల దానిపై ఏసీబీ అధికారుల కన్నుపడింది. వచ్చిపోయే వాళ్లందరిని ‘అమ్యామ్యా’ అని లంచం అడుగుతూందని కేసు కట్టి జైల్లో వేశారు. మరుక్షణమే ఊచల్లోంచి దూరి పిల్లి బయటికొచ్చింది. ‘‘నేతితో తప్ప నీతి అవినీతులతో నాకు సంబంధం లేదు’’ అని జైలు అధికారిని పిల్లి ప్రశ్నించింది. అలవాటుకొద్దీ అధికారి వెంటనే ఒక నివేదిక రాశాడు ‘‘కాలం మారుతున్నా జైళ్లు మారడం లేదు. ఊచల్ని గడ్డిపోచలుగా లెక్కేసే రోజులొచ్చాయి. మనుషులతో పాటు జంతువుల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. అవి వృత్తి నేరస్తులుగా మారిపోతున్నాయి. మనుషుల్ని జంతువులుగా చూడడం అధికార ధర్మం. కానీ జంతువులను ఎలా చూడాలన్నది ధర్మ సందేహం. నేరస్తుల్ని చావబాదాలన్నా, బాది చంపాలన్నా ముందు వాళ్లు పారిపోకుండా చూడడం మన విధి. అందువల్ల ఊచల డిజైన్ మార్చాలని విన్నవిస్తున్నాను’’ అని ఒక ఫైల్ తయారుచేశాడు. అనేక అధికారుల చేతులు మారి ‘జైలు ఊచలు ఉంచా రహ్నా’ అనే నినాదంగా తయారై ఒక కమిటీ ఏర్పాటైంది. ఒక భౌతిక శాస్త్రవేత్త, నైతిక తత్వవేత్త, రాజకీయ భోక్త ఇలా పలువురితో కూడిన కమిటీ జైలుకొచ్చి ఊచల పొడవు, వెడల్పు చుట్టుకొలత, మందం, వైశాల్యం అన్నింటిని కొలతలు తీసుకుని వెళ్లింది. ఇదంతా చూసి పిల్లి పకపక నవ్వింది. ‘‘హాస్యం అంతరించిపోయి మనుషుల జీవితాలన్నీ రహస్యంగా మారిపోతున్న ఈ రోజుల్లో కూడా నవ్వుతున్నావంటే నువ్వు మామూలు పిల్లివి కాదు’’ అన్నాడు అధికారి. ‘‘నేను మామూలు పిల్లినే, అందుకే నవ్వుతున్నా. నాన్సెన్స్కి, సైన్స్కి తేడా తెలియదు మీకు. నా మెడలో ఒక గంట కడితే నేనెక్కడికి పారిపోతాను చెప్పు’’ అంది పిల్లి. ‘‘గంట కట్టాలని నాకు తెలుసు. కానీ ఈ విషయం పై అధికారికి చెప్పేదెవరు? బాస్కి ఎంత తెలుసో, అంతకంటే మనకు తక్కువ తెలిసుండాలి. బాస్కి ఏది తెలియదో, అది మనకు ఎప్పటికీ తెలియకూడదు. బాస్కి ఏబీసీడీలు రాకపోతే మనం ‘ఎ’ని గుర్తుపట్టనట్టు నటించాలి. నటన వల్లే నాలుగు వేళ్లు లోనకెళతాయి’’ అన్నాడు అధికారి. ‘‘స్వేచ్ఛగా కనిపిస్తూ బానిసల్లా జీవించేవాళ్లు మీరు. బానిసల్లా కనిపిస్తూ స్వేచ్ఛగా జీవించేవాళ్లం మేము’’ అంది పిల్లి. ‘‘నువ్వు పిల్లివి కాబట్టి ఫిలాసఫీ చెప్పడం కరెక్ట్ కాదు. స్వేచ్ఛే ముఖ్యమనుకుంటే నువ్వెందుకు పారిపోలేదు?’’ ‘‘మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో అదే మనల్ని వెంటాడి వేధిస్తుంది. ఇది తెలియక భార్యలు భర్తల నుంచి, భర్తలు భార్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. సకాలంలో పాలు దొరికినంతకాలం జైలయినా ఒకటే, ఆరుబయటయినా ఒకటే.’’ ఇతరుల్ని పనిచేయిస్తుందో లేదో తెలియదు గాని, చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. పిల్లి ప్రభుత్వ ఉద్యోగే కానప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఏసీబీ అధికారులు గ్రహించారు. విరుద్ధాన్ని సమ్మతం చేసుకోవాలంటే ముందు దానికో గవర్నమెంట్ ఉద్యోగమిచ్చి, ఆ తర్వాత కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. యూనిఫాం తగిలించి, చేతికో కర్ర ఇచ్చి ఒక ఆఫీస్లో గార్డ్ ఉద్యోగమిచ్చారు. అలెర్ట్గా వుండి ఎలుకల్ని పట్టడం డ్యూటీ. ఆశ్చర్యంగా ఒక్క ఎలుక కూడా కనిపించలేదు. ఈ విషయమై ఒక క్లర్క్ని అడిగింది. ‘‘మనుషులే కలుగుల్లో దూరుకుని ఎలుకల్లా మారిపోతున్నారు. అందువల్ల ఎలుకెవరో, మనిషెవరో కనుక్కోవడం కష్టం’’ అన్నాడాయన. ఏం చేయాలో తెలియక పిల్లి డ్యూటీలో నిద్రపోసాగింది. బెస్ట్ గార్డ్గా రివార్డిచ్చారు. నిద్ర లేవగానే ‘క్యాట్సప్’ అని అభినందించేవాళ్లు. ఒకరోజు మూడుసార్లు నిద్రపోయి లేచేసరికి ‘క్యాట్రిక్’ అని అరిచారు. ఇదంతా విసుగెత్తి డ్యూటీ మానేసి రోడ్డుమీద వెళుతుంటే ‘బెస్ట్ క్యాట్వాక్’ అని మీడియా వచ్చి ఫొటోలు తీసింది. దొరికినవాణ్ని దొరికినట్టు కరిచింది పిల్లి. ‘‘ఇంట్లో సౌండ్ సిస్టమ్ చెడిపోతే వెంటనే రిపేరు చేయిస్తారు. మనం బతుకుతున్న సిస్టమే చెడిపోతే ఎవడూ పట్టించుకోడేంట్రా’’ అని కేకలు పెట్టింది. పిల్లి నడవడిక సిస్టమాటిక్గా లేదని దాన్ని వెంటనే జైల్లో పెట్టారు. - జి.ఆర్.మహర్షి -
లంచం అడుగుతున్నారు
టీఏపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన లకిమేర గ్రామస్తులు నరసన్నపేట : ‘మేం నిరుపేద కూలీలం. ఉపాధి పనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాం. ఉపాధి అధికారుల సూచన మేరకు గ్రామంలో ఫారంఫాండ్ తవ్వాం. దీనికి రోజుకు రూ.35 మాత్రమే వేతనం పడింది. ఇదేమని టెక్నికల్ అసిస్టెంట్ త్రినాథరావును ప్రశ్నించగా ఒక్కో పాండ్కు రోజుకు రూ.190 వేతనం వచ్చేలా చేస్తాను.. అందుకు రూ. 3 వేలు నాకు లంచం ఇస్తారా అని అడిగారు’ అంటూ లకిమేర గ్రామానికి చెందినపలువురు ఉపాధి వేతనదారులు శుక్రవారం నరసన్నపేట ఎంపీడీఓ విద్యాసాగర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వేతనదారులు వంజరాపు అప్పలరామయ్య, ఎల్. లక్ష్మి, ఆర్.లక్ష్మి, ఎ.కాళీప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ రెండు వారాలకు చెందిన సొమ్ము రావాల్సి ఉందని చెప్పారు. వారానికి రూ. 200 చొప్పున మాత్రమే వేతనం వస్తోందని వాపోయారు. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ‘చేప’
నిజామాబాద్ క్రైం: సబ్సిడీ చెక్కు ఇచ్చేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఫిషరీస్ అధికారి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. బోధన్ మండలం సంగెం గ్రామానికి చెందిన గంగాధర్ చేపల వ్యాపారి. చేపలు రవాణా చేసేందుకు వాహనం అవసరం కావడంతో, జిల్లా కేంద్రంలోని ఫిషరీస్ కార్యాలయంలో సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు 75 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల రుణం మంజూరైంది. అయితే, సబ్సిడీ చెక్కు వాహన షోరూంకు పంపిస్తే, వాహనాన్ని అందజేస్తారు. చెక్కును పంపించాలని గంగాధర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అధికారి రూపేందర్సింగ్ను కలిశాడు. అయితే, రూ.7 వేల ఇస్తే చెక్కును పంపిస్తానని ఆయన స్పష్టం చేశాడు. చివరకు రూ.5 వేలకు బేరం కుదిరింది. లంచం ఇచ్చేందుకు మనస్సు ఒప్పుకోకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు రసాయనాలు పూసిన రూ.5 వేల నోట్లను గంగాధర్కు అందజేసి, కార్యాలయం వద్ద మాటు వేశారు. బుధవారం సాయంత్రం రూపేందర్సింగ్కు డబ్బు ఇస్తుండగా, రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, చర్లపల్లి జైలుకు పంపించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ నరేందర్రెడ్డి తెలిపారు. మరోవైపు, అదే సమయంలో సబ్సిడీ చెక్కు కోసం మరో లబ్ధిదారుడు బోధన్కు చెందిన శ్రావణ్ కూడా లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే రూపేందర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనను కూడా డబ్బు అడిగాడని శ్రావణ్ తెలిపాడు. -
లంచం కేసులో తహసీల్దార్కు మూడేళ్లు జైలు
నెల్లూరు(లీగల్) : వ్యవసాయ భూమి పట్టాకోసం లంచం తీసుకున్నాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో చిత్తూరు జిల్లా రామసముద్రం తహసీల్దార్ పనిచేసిన సీమనపల్లి రెడ్డెప్పకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.90 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నరసింహరాజు మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. రామసముద్రం మండలం బోగవాడి గ్రామానికి చెందిన ఫిర్యాది దొడ్డారెడ్డిగారి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి సదరు గ్రామ పరిధిలో 8 ఎకరాల కలప, మామిడి, వివిధ రకాలచెట్లున్నాయి. వాటిని కొట్టేందుకు అనుమతి, వ్యవసాయభూమి మార్చుకునేందుకు పట్టాకోసం 24-12-2012న రామసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాడు. సంబంధిత తహశీల్దార్ రెడ్డప్ప 15-02-2013న అర్జీలను పరిశీలించి తనకు రూ.40వేలు లంచం ఇస్తే అనుమతి ఇస్తామన్నాడు. రూ.20 వేలకు అంగీకారాన్ని కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఫిర్యాది 20-02-2013న తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన అధికారులు మరుసటి రోజు పుంగనూరులోని తన ఇంటి వద్ద ఉన్న తహసీల్దార్ ఫిర్యాదు వద్ద నుంచి లంచం తీసుకొని పక్కన ఉన్న డ్రైవర్కు ఇచ్చాడు. డ్రైవర్ ఆ డబ్బును లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని, రెడ్డప్ప, డ్రైవర్ పొన్నాల బాలమునిరెడ్డిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో రెడ్డప్పపై నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధించారు. కారుడ్రైవర్పై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ (సర్కిల్-18) జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆడిటర్(గణాంకాధికారి)గా పనిచేస్తున్న నిత్యానంద్ లంచం తీసుకుంటూ...శనివారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రెజిమెంటల్బజార్కు చెందిన ఉమాదేవి, పద్మావతి ఇరువురు అక్కాచెల్లెల్లు. వారసత్వంగా వారి తల్లిదండ్రుల గృహం ఇరువురు అక్కాచెల్లెల్లకు వచ్చింది. సదరు గృహాన్ని గిఫ్ట్ డీడ్ చేసుకున్న ఉమాదేవి, పద్మావతి గృహం పేరు మార్పిడి కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని పన్నుల విభాగంలో నిత్యానంద్ను సంప్రదించారు. పేరుమార్పిడి కోసం ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో ఉమాదేవి ఎసీబీ అధికారులను సంప్రదించింది. వారు ముందస్తు వ్యూహం మేరకు ఉమాదేవికి రూ. 2000 నగదును ఇచ్చి పంపించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిత్యానంద్ చాంబర్కు చేరుకున్న ఉమాదేవి వెంటతెచ్చుకున్న డబ్బును అప్పగించింది. అప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాటువేసి ఉన్న ఏసీబీ డీసీపీ అశోక్కుమార్ బృందం దాడి చేసి నిత్యానంద్ తీసుకున్న లంచం డబ్బును స్వాధీనం చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైళ్లను, ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కృపాదానంను గత మే 11న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు నెలలలోపే ఇరువురు అధికారులు ఏసీబీ వలలో చిక్కడం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలకలం సృష్టించింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
► కలెక్టరేట్ ఆవరణలో కలకలం ► పాఠశాల భవన నిర్మాణ బిల్లు చెల్లించేందుకు రూ.5వేలు డిమాండ్ ► గతంలోనూ రూ.45వేలు తీసుకున్న ఉద్యోగి నయీంనగర్ : జిల్లా పాలనకు కేంద్రబిం దువు, సాక్షాత్తు కలెక్టర్ విధులు నిర్వర్తించే జిల్లా కలెక్టరేట్లోని ఓ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకోగా కలకలం సృష్టించింది. కలెక్టరేట్ ఆవరణలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల భవనాల నిర్మాణం, బిల్లులు చెల్లింపు ఇతరత్రా వ్యవహారాలు కొనసాగుతారుు. ఇందులో భాగంగా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణ పనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆలకుంట్ల దుర్గయ్య పూర్తిచేశాడు. ఈ మేరకు చివరి విడత రూ.26లక్షల బిల్లు కోసం కార్యాలయంలోని ఏఈ ఎం.ఏ.అజీజ్ను సంప్రదించాడు. నిధులు విడుదల చేయూలం టూ రూ.5వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. అరుుతే, గతంలో మొదటి, రెండో విడత బిల్లుల కోసం కూడా అజీజ్కు రూ.45వేల వరకు ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్గయ్య ఈసారి విసిగి పోయూడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు సంప్రదించగా వారు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఏ ఈ అజీజ్కు ఆయన కార్యాలయంలో దుర్గయ్య రూ.5వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సారుుబాబా ఆధ్వర్యంలో రెడ్ హ్యాం డెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నుంచి నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు సాంబయ్య, రాఘవేందర్రా వు పాల్గొన్నారు. కాగా, ఈనెల 1న ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20వేలు తీసుకుంటూ గ్రేటర్ వరంగల్ కాజీపేట సర్కిల్ కార్యాలయంలో టీపీఎస్ రమణయ్య, మేడారం జాతర పనుల్లో భాగంగా చిలుకల గుట్ట వద్ద నిర్మించిన సీసీ రోడ్డు పను ల బిల్లు చెల్లించేందుకు 6వ తేదీన రూ.40వేలు తీసుకుంటూ తా డ్వాయి పీఆర్ ఏఈ జీ.పీ.కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఇలా పది రో జుల్లోనే ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి దొరకడం గమనార్హం. కలెక్టరేట్లో ఇది ఆరో కేసు హన్మకొండ: గత సంవత్సరం కాలంలో కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయూల్లో లంచం తీసుకుంటున్న ముగ్గు రు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయూంశంగా మారింది. కలెక్టరేట్ ఆవరణలో ఇప్పటి వరకు ఆరు మార్లు ఏసీబీ దాడులు జరగగా ఎనిమిది మంది ఉద్యోగులు పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీకి దొరికిన ఉద్యోగుల వివరాలిలా ఉన్నారుు. ♦ కలెక్టరేట్ సమావేశ మందిరం పైభాగంలో ఉన్న చిన్నమొత్తాల పొదుపు విభాగం ప్రత్యేక తహశీల్దార్గా పనిచేసిన పంత్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి రూ.3వేలు తీసుకుంటూ 2004లో ఏసీబీకి చిక్కారు. ♦ కలెక్టరేట్ ప్రగతి భవనంలోని సాంఘిక సంక్షేమ శాఖ డీఎస్డ బ్ల్యూవో వై.గాలయ్య.. వార్డెన్ మునిరుద్దీన్కు వైద్య బిల్లుల విషయంలో రూ.4వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ♦ సాంఘిక సంక్షేమ శాఖలో గాలయ్య స్థానంలో ఇన్చార్జ్గా ఉన్న డీఎస్డబ్ల్యూవో ప్రభాకర్ కూడా అదే వార్డెన్ మునీరుద్దీన్ పదోన్నతి విషయంలో లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ♦ కలెక్టరేట్లోని ‘సీ’ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునీల్ తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో 1 జూలై 2015న ఏసీబీ అధికారులు వల పన్నగా ఆయన చిక్కారు. ♦ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో డీపీఓ ఈఎస్.నాయక్ కారుణ్య నియూమకం విషయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇంత నగదుతో ఏసీబీకి దొరకడం జిల్లాలో ఇదే ప్రథమం. కాగా, ఇదే అంశంలో రూ.5వేల చొప్పున లంచం తీసుకుంటున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ, అటెండర్ సారంగపాణికి పట్టుబడ్డారు. ♦ ప్రస్తుతం కలెక్టరేట్ ఆవ ణలోని టీఎస్డబ్ల్యూఈఐడీసీ ఉద్యోగి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కాగా, కలెక్టరేట్ ఆవరణలోనిఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి ఉమామహేశ్వర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం కూడా ఏసీబీకి చిక్కారు. అరుుతే, ఈ దాడులు కలెక్టరేట్ ఆవరణలో జరగలేదు. -
మేమే డొనేషన్ ఇస్తాం.. సమన్లు తీసుకోండి
♦ లంచం ఇవ్వబోయిననిందితురాలితో సీసీఎస్ పోలీసులు ♦ విషయం తెలిసి సిబ్బందిని ప్రశంసించిన కమిషనర్ సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానం జారీ చేసిన సమన్లు ఇవ్వొద్దు. నేను అందుబాటులో లేనంటూ నమోదు చేసుకోండి. అందుకు ప్రతిగా రూ.500 ఇస్తా’ - సీసీఎస్ పోలీసులతో ఓ నిందితురాలి వ్యాఖ్య ‘అలా కుదరదు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్లు అందుకోవాల్సిందే. అందుకు ప్రతిగా అవసరమైతే మేమే రూ.1000 డొనేషన్ ఇస్తాం’ - స్పష్టం చేసిన సీసీఎస్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ అంశం మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి దృష్టికి వచ్చింది. జరిగిన విషయం ఆరా తీసిన ఆయన లంచం తిరస్కరించిన కానిస్టేబుళ్లను ప్రశంసించారు. ఇదీ కేసు నేపథ్యం... నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ డెరైక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు 2013లో కేసు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో కుమార్తెల ఫిర్యాదు మేరకు తల్లిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆ సంస్థకు సీఎండీ వ్యవహరించిన యజమాని మరణానంతరం ఆయన కుమార్తెల్లో ఒకరు ఆ బాధ్యతలు స్వీకరించారు. మరో ఇద్దరు కుమార్తెలు బోర్డులో డెరైక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరు ఈ కుటుంబానికే చెందిన మరో సంస్థకూ డెరైక్టర్. యజమాని భార్య సైతం అప్పటికే ఆ బోర్డులో డెరైక్టర్గా కొనసాగుతున్నారు. 2013లో ‘మరో సంస్థ’కు చెందిన కీలక డాక్యుమెంట్లు దాని కార్యాలయం నుంచి పోయాయని, అందులో తమ తల్లి ప్రమే యం ఉందని ఆరోపిస్తూ కుమార్తెలు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఏం జరిగిందంటే... సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన కేసులో నిందితురాలి గా ఉన్న మహిళకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీటిని అందించడానికి సీసీఎస్ సిబ్బంది వెళ్లారు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించిన నిందితురాలు... పోలీసులకు రూ.500 లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. సదరు చిరునామాలో తాను అందుబాటులో లేనంటూ సమన్లు జారీ చేయవద్దని కోరారు. దీంతో సీసీఎస్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ... సమన్లు స్వీకరించాలని, వాటితో పాటు తామే రూ.1000 డొనేషన్గా ఇస్తామంటూ ఆమెకు స్పష్టం చేశారు. అప్పటికీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ సమన్లను ఆమె ఇంటి గేటు వద్ద అతికించి, ఆ ఫొటోలు తీసుకుని వచ్చా రు. ఈ కేసులో ఫిర్యాదుదారులు రెండు రోజుల క్రితం నగర కొత్వాల్ను కలిసి ‘రూ.500’ విషయంపై ఆయన కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆరా తీయగా... జరిగిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. లంచం తిరస్కరించడంతో పాటు సమన్ల జారీ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన సీసీఎస్ సిబ్బందిని ప్రశంసించారు. -
ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్
గుంటూరు: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాడేపల్లికు చెందిన ఓ వ్యక్తి పాస్పోర్టు కోసం అప్లై చేసుకున్నాడు. వెరిఫికేషన్ క్లియరెన్స్ కోసం కానిస్టేబుల్ వీరయ్య అతన్ని రూ.2 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్న సమయంలో స్టేషన్లో లంచం తీసుకుంటుండగా వీరయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు
రాజమహేంద్రవరం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన భూగర్భ జలాలు, మైన్స్ శాఖ ఏడీ రౌతు గొల్ల కేసు విచారణలో అనేక ఆస్తులు బయట పడుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడిలో శుక్రవారం ఏడీ రౌతు గొల్ల పట్టుబడిన విషయం విదితమే. రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన తాళ్ల చిరంజీవిరావు 7.50 ఎకరాల భూమిని గ్రావెల్ తవ్వుకునేందుకు లీజుకిచ్చే విషయంలో ఎకరానికి రూ.15 వేల చొప్పన రూ.1.50 లక్షలు లంచం అడిగారు. ఈ నేపథ్యంలో రైతు చిరంజీవిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు రూ.75 వేలకు బేరం కుదిర్చి, ఏడీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదేరోజు ఏడీ ఇంటి వద్ద సోదాలు చేయగా, రూ.4.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో ఉన్న ఏడీ ఇంట్లో లాకర్ తాళం స్వాధీనం చేసుకున్నారు. ఈ లాకర్ను సోమవారం తెరవగా, అందులో 1,100 గ్రాముల బంగారం, విజయ వాడలో రెండు ఇళ్లకు సంబంధించిన పత్రాలు, రెండు భూములకు సంబంధించిన పట్టాలు లభ్యమయ్యాయి. అలాగే ఏడీ సొంత గ్రామమైన శ్రీకాకుళంలో అర ఎకరం భూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. -
ఫోకల్ అధికారి.. అవినీతి సవారీ!
ఆర్డబ్ల్యూఎస్లో హల్చల్ అధికార పార్టీ నేతల అండ కాంట్రాక్టర్ల గగ్గోలు రూ.22 కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు ఆర్డబ్ల్యూఎస్లో ఆయనో అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితేనేం అధికార పార్టీ నేతల అండదండలతో ఫోకల్ పోస్టింగ్ తెచ్చుకున్నాడు. పర్సంటేజ్ల కోసం కాంట్రాక్టర్లను కాల్చుకుతింటున్నాడు. అయ్యగారి ‘ఆనందం’ కోసం ముడుపులు సమర్పించుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్లో పనంటే.. అయ్య ‘బాబో’య్ అనే పరిస్థితి నెలకొంది. విజయవాడ : అధికార పార్టీ నేతల అండతో ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం)లో ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడ్డంగా దోచేస్తున్నారు. పర్సంటేజీ డబ్బు కోసం కాంట్రాక్టర్లను వేధింపులకు గురిచేస్తూ, బిల్లులు చేయటంలో ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెడుతున్నా అధికార పార్టీ నేతలు ఆ బాబుపై వల్లమాలిన అభిమానం చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2014లో ఏసీబీ ట్రాప్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ అధికారి, తాను పనిచేసే శాఖ ముఖ్య ప్రజాప్రతినిధికి లక్షలు కుమ్మరించి ఆదాయం దండిగా వచ్చే గన్నవరం నియోజకవర్గంలో ఫోకల్ పోస్టింగ్ పొందారు. అంతేకాదు.. పామర్రు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతను కూడా అధికార పార్టీ నేత అండతో కైవసం చేసుకున్నారు. గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లో రెండు ఫోకల్ పాయింట్లను దున్నేస్తూ, కాంట్రాక్టర్లను, ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏడాదికాలంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు విలువైన బిల్లులకు ఆయన చెక్ మెజర్మెంట్ చేయటం గమనార్హం. ఏసీబీ కేసును ఎదుర్కొంటున్న అధికారికి బిల్లులు, చెక్ మెజర్మెంట్ చేసి ఎంబుక్లు రికార్డు చేసే అధికారం లేదని, ఉయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన్ని ఫోకల్ పోస్టింగ్ నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు. సదరు అధికారి తీరుతో పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.4 కోట్ల పనులకు ముగ్గురు కాంట్రాక్టర్లు... గన్నవరం నియోజకవర్గంలో పదిరోజుల క్రితం పైపులైన్ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. బాపులపాడులో జాతీయ రహదారి అధికారులు రోడ్ల విస్తరణకు సంబంధించి తాము చెల్లించాల్సిన రూ.4 కోట్ల పనులకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా టెండర్లు పిలిపించారు. వీటికి కనీసం 30 మంది కాంట్రాక్టర్లు పోటీపడి 20 శాతం తక్కువకు టెండర్లు వేయాల్సి ఉందని, కేవలం ముగ్గురే టెండర్లు వేయటం, మిగిలినవారు వెనకడుగేయటం సదరు అధికారికి భయపడటం వల్లేనని ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడిందని తెలుస్తోంది. ఫిర్యాదులు ఇలా... ఇటీవల పామర్రు నియోజకవర్గంలో జరిగిన రూ.22 కోట్ల విలువైన పైపులైన్ పనులపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విజయవాడ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.6 కోట్లతో చేపట్టిన అయ్యంకి నుంచి మొవ్వ స్కీమ్, రూ.16 కోట్లతో అయ్యంకి వయా యలమర్రు మీదుగా వెంట్రప్రగడకు చేసిన వాటర్ స్కీమ్లపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. కొద్ది మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలోని యలమర్రు గ్రామ పంచాయతీలో ఓ బోరులో పాత మోటారు బిగించి కొత్తది కొన్నట్టు బిల్ చేశారు. దీనిపై రగడ జరగటంతో అధికార పార్టీ ముఖ్య నేత సహాయంతో బయటపడ్డారు. బాపులపాడు మండలంలోని పెలైట్ ప్రాజెక్టులో మోటార్లు లేకుండానే బిల్లులు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.నెల రోజుల క్రితం భూపతిరెడ్డి అనే కాంట్రాక్టరు పామర్రులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అందరూ ఉండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పక్కనున్నవారు అతన్ని వారించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో సదరు అధికారి పెడుతున్న ఇబ్బందులే కారణమని అతను ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. నాలుగు మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలో బిల్లుల పెండింగ్ అంశంపైనే తీవ్ర ఆవేదనతో వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టరు తాను నిర్మించిన ట్యాంకు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కిందిస్థాయి అధికారులు జోక్యం చేసుకుని అతని సమస్య పరిష్కరించారు. -
కార్పొరేట్ కంపెనీల్లోనూ లంచాలు
లండన్ : కార్పొరేట్, ప్రముఖ కంపెనీల్లో లంచగొండితనం, అవినీతి పెరుగుతున్నాయి. ఈ నిజాన్ని ఆ కంపెనీల్లో పనిచేసే 80శాతం మంది ఎగ్జిక్యూటివ్ లే ఒప్పుకున్నారని యూకే న్యాయసంస్థ ఎవర్ సెడ్స్ సర్వే వెల్లడించింది. కంపెనీల్లో అవినీతి నిరోధక విధానాల అమలును పట్టించుకునే దిక్కే లేదని ఈ సర్వే పేర్కొంది. మొత్తం 12 దేశాల్లో 500 మంది బోర్డు లెవల్ ఎగ్జిక్యూటివ్ లపై జరిపిన సర్వేలో కంపెనీల్లో అవినీతికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైయ్యాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసిన లంచం వ్యతిరేక విధానాలు సరిగ్గా పనిచేయడం లేదని 59శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కంపెనీలో మరో కంపెనీ విలీనం చేసేటప్పుడు, ఒక కంపెనీని మరో కంపెనీ స్వాధీనం చేసుకునేప్పుడు అవినీతి వ్యతిరేక విధానాలపై అసలు శ్రద్ధ వహించడం లేదని 33శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు చెప్పినట్టు సర్వే వెల్లడించింది. లంచం తీసుకోవడం, అవినీతికి పాల్పడటం వంటివి యూకేలో రాజకీయ సమస్యగా మారాయి. ఇవి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చట్టసభ సభ్యులు గుర్తించారు. ఈ సమస్యను రూపుమాపడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న స్పందనలపై చర్చించడానికి ఆ దేశ ప్రధాని డేవిడ్ కెమెరూన్ వచ్చే వారంలో అవినీతి వ్యతిరేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరొందిన ప్రముఖులు, వ్యాపారస్తులు ప్రభుత్వాలకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులు ఎగొట్టి, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ బిలియన్ ధనాన్ని దొంగ ఖాతాల్లో దాచుకున్నారని పనామా పేపర్ల కుంభకోణంతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిపిన సర్వేలో అసలు కంపెనీల్లో ఈ లంచగొండి వ్యతిరేక విధానాలు అమలుకావడం లేదని వెల్లడైంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు యూకే, ఇటలీ, బ్రెజిల్, హాంగ్ కాంగ్, చైనా కంపెనీల్లో 500 ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టారు. -
మహిళా తహశీల్దార్ అరెస్ట్...
- రూ.4.6లక్షలు స్వాధీనం ఎ.కొండూరు కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం తహశీల్దార్ ప్రశాంతిని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. పట్టాదారు పాసు పుస్తకం జారీకి గానుగురువారం రాత్రి బాణోతు గోపిరాజు అనే రైతు నుంచి ఆమె రూ.8వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రూ.4.60 లక్షలను గుర్తించారు. వాటికి ఎలాంటి లెక్కలు లేకపోవడంతో సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
ఆరు సార్లు దొరికి పోయాడు..
ఆదిలాబాద్ జిల్లా దహేగామ్ తహశీల్దార్ విశ్వంబర్ ఓ రైతు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిర్పూర్ కాగజ్నగర్లోని బాలాజీ నగర్ ప్రాంతంలో తహశీల్దార్ నివాసం వద్ద ఈ ఘటన చేసుకుంది. సోమయ్య అనే రైతుకు చెందిన భూమి పత్రాల్లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో వలవేసి పట్టుకున్నారు. తహశీల్దార్ ని అదుపులోకితీసుకుని విచారిస్తున్న అధికారులు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. తహశీల్దార్ విశ్వంబర్ కి ఇలా లంచం తీసుకుంటూ పట్టు బడటం లో బాగానే అనుభవం ఉంది. గతంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు సార్లు ఏసీబీకి పట్టుపడ్డాడీ అధికారి. దీంతో షాక్ తిన్న అధికారులు.. పాత కేసులను సైతం తిరగతోడే పనిలో ఉన్నారు. మరో వైపు ఈ కార్యలయం అవినీతి అధికారులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గతంలోనూ దహేగామ్ తహశీల్దార్గా పనిచేసిన అమృతరావు అనే అధికారి కూడా ఇదే రీతిలో ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. -
దొరికిపోయాడు
► లంచం తీసుకుంటూఏసీబీకి చిక్కిన ► అనంతగిరి రేంజ్ అటవీ అధికారి శృంగవరపుకోట/ అనంతగిరి : విశాఖ జిల్లా అనంతగిరి రేంజ్లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న శోభా సుబ్బారావును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ అందించిన వివరాలిలాఉన్నాయి. అనంతగిరి మండలం టోకురు గ్రామ పంచాయతీ పరిధి జాకరవలస గ్రామానికి చెందిన నరాజి ప్రసాద్ తన ఇంట్లో ఫర్నీచర్ తయూరీ కోసం హుద్హుద్ సమయంలో కూలిన టేకుచెట్లను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి శోభా సుబ్బారావు నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ చేయడం నేరమని ప్రసాద్ను బెదిరించారు. కేసు లేకుండా చూడాలంటే తనకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ఇద్దరి మధ్య రూ. 11 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ప్రసాద్ సెక్షన్ ఆఫీసర్కు రూ. 2 వేలు ఇచ్చాడు. మిగిలిన తొమ్మిది వేల రూపాయలకు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎస్.కోట రైల్వేస్టేషన్ రోడ్డులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుబ్బారావు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లి ప్రసాద్ రూ. 9 వేలు సుబ్బారావుకు అందించాడు. సొమ్ము తీసుకుంటున్న సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని విచారించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతనిని అనంతగిరి మండలం ముళియాగూడ జంక్షన్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ విషయమై రేంజర్, గార్డులను కూడా విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఇంజినీర్
రూ.42 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు మాడుగుల/ఎన్ఏడీ జంక్షన్ : రోడ్డు పనుల బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ఇంజినీరింగ్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వల లో చిక్కుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి రూ.42 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.వి.ఆర్.కె.ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. వి.మాడుగుల మండల పరిధిలోని ముకుందపురం-బంగారుమెట్ట మధ్య రూ.35 లక్షల విలువైన రోడ్డు పనులను విజయనగరం జిల్లా ఎస్. కోటకు చెందిన పోలినాయుడు అనే కాంట్రాక్టర్ చేపట్టారు. తొలి విడతగా రూ.28 లక్షల బిల్లు పొంది పని పూర్తి చేశారు. మిగిలిన మొత్తం కోసం బిల్లు పెట్టుకున్నారు. అయితే దాన్ని మంజూరు చేయాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల పంచాయతీరాజ్ ఇంజినీరు సీహెచ్ అంబేద్కర్ బిల్లును తొక్కిపెట్టారు. బిల్లు కోసం గతంలోనే కొంత ముట్టజెప్పానని.. ఇప్పుడు అంత ఇవ్వలేనని తగ్గించాలని కాంట్రాక్టర్ కోరినా ఆయన అంగీకరించలేదు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మళ్లీ ఇంజీనీర్ అంబేద్కర్ వద్దకు వెళ్లి రూ.42 వేలు ఇవ్వడానికి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సొమ్ము తీసుకొని తాను ఉంటున్న విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డు ప్రాంతానికి రమ్మని ఇంజినీరింగ్ అధికారి సూచించారు. ఆ ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎన్ఏడీ కూడలిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.42 వేలు తీసుకుంటున్న ఇంజినీర్ అంబేద్కర్ను అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రామకృష్ణ, గణేష్, రమణమూర్తి, రమేష్ పాల్గొన్నారు. ఆ ఏఈ తీరే అంత..! పంచాయతీరాజ్శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తూ గతేడాది ఆగస్టులో మాడుగుల మండల ఇంజినీరుగా బదిలీపై వచ్చినప్పటి నుంచీ అంబేద్కర్ వివాదాస్పదంగానే మసలుకుంటున్నారు. మండలంలో చేపట్టే అన్ని పనుల్లోనూ ఈ అధికారి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు విశాఖ నుంచి మండలపరిషత్ కార్యాలయానికి రాకపోకలతో బిల్లులకు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడేవారు. స్వచ్ఛభారత్లో భాగంగా మండలంలోని ప్రతి గ్రామానికి రూ.కోట్లతో సీసీ రోడ్లు మంజూరయ్యాయి. వీటిని నిర్మించిన సర్పంచ్లు, కాంట్రాక్టర్లు బిల్లులుకాకపోవడంతో లబోదిబోమనేవారు. దీంతో సీసీ రోడ్ల నిర్మాణంలో మాడుగుల మండలం జిల్లాలో వెనుకబడింది. -
ఏసీబీ వలలో జీఎన్ఎస్ఎస్ ఉద్యోగిని
కడప అర్బన్: కడప నగరం శంకరాపురంలో ఉన్న గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) పథకం కింద మంజూరైన పరిహారాన్ని ఆన్లైన్లో జమ చేసేందుకు రూ.4వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం గుర్రంగుంపు తాండాకు చెందిన ఇస్లావత్ కిశోర్నాయక్, అతని అమ్మమ్మ లక్షుమ్మకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని, గుడిసెను నిర్మించుకున్నారు. మొత్తం స్థలం, వారు ఆశ్రయం పొందుతున్న ఇల్లు, గుడిసె కెనాల్ కింద ముంపునకు గురవుతుందని ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తం రూ. 4,22,000 వారికి పన్నుల మినహాయింపు తర్వాత రావాల్సి ఉంది. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో జమ చేసేందుకు దాదాపు నెలన్నర రోజుల నుంచి జీఎన్ఎస్ఎస్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రమీలమ్మ ఇస్లావత్ కిశోర్నాయక్ను తిప్పుకుంటోంది. ఆ మొత్తాన్ని జమ చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించాడు. వారి సూచన మేరకు రూ. 4 వేలను మంగళవారం కార్యాలయంలోనే బాధితుడు జూనియర్ అసిస్టెంట్కు ఇస్తుండగా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రమీలమ్మను అరెస్టు చేసి బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
లంచమిస్తేనే ‘రుణం’
ఇందూరు : జిల్లా కలెక్టర్ యోగితారాణా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్తో అక్రమార్కుల చిట్టా బట్టబయలవుతోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు అందించే రాయితీల్లో పర్సంటేజీల కోసం పాకులాడుతున్న కొంతమంది రాజకీయ నేతలు,సంబంధిత ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... లంచాలకు తావులేకుండా అసలైన పేదవాడికి ఎస్సీ,ఎస్టీ,బీసీ రుణాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులకు అన్యాయం జరిగినా.. ఎవరైనా డబ్బులు ఆశించినా లబ్ధిదారులు నేరుగా ఫోన్చేయాలని కాల్సెంటర్ను ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నంబర్ 18004256644 ను అందుబాటులోకి తెచ్చారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం ఫోన్ నెంబరును కూడా ఇచ్చారు. దీంతో కాల్ సెంటర్తో పాటు ఏజేసీకి ఫోన్కాల్స్ల మోత ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 28 వరకు కాల్ సెంటర్కే 62 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఫోన్కాల్స్లలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ శాఖల్లో పని చేసే ఉద్యోగుల పైనే ఉన్నాయి. ఏజేసీ రాజారాంకు కూడా వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో కూడా కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులపై ఎక్కువ వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్లలో పని చేస్తున్న ఒక ఉద్యోగి రుణాల మంజూరు కోసం డబ్బులు అడుగుతున్నాడని... బీసీ కార్పొరేషన్లో ఓ అధికారి డబ్బులు ఆశిస్తున్నాడని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వచ్చే రుణం రాయితీలో 30 శాతం ఇస్తే చాలు బ్యాంకు కాన్సెంట్తో సహా రుణం మంజూరు చేయిస్తానంటూ బేరం చేస్తున్నాడని చాలామంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఆశ్రీతులకు రుణాలు ఇప్పించడానికి పావులు కదుపుతున్నారని, అసలైన పేదలు నష్టపోతున్నారని బాధితులు పేర్కొన్నారు. అయితే కాల్ సెంటర్కు, ఏజేసీకి ఫిర్యాదులు చేసిన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నప్పటికీ వారి పేర్లు బయటకు పొక్కకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాది దారుల సమస్యను నోట్ చేసుకుని రోజు వారీగా కలెక్టర్కు నివేదిక అందజేస్తున్నారు. నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కలెక్టర్ ఎక్కువగా ఎవరిపై ఫిర్యాదులు వస్తున్నాయో గమనిస్తున్నారు. ఈ మేరకే బీసీ కార్పొరేషన్ అధికారిగా పని చేసిన సాయిలు, ఎస్సీ కార్పొరేషన్లో నీలకంఠం అనే ఉద్యోగిని సరెండర్ చేశారని చెప్పుకుంటున్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ శాఖల్లో మరో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు ఉన్నాయి. వారిని కూడా త్వరలో సరెండర్ చేయనున్నట్లు విశ్వనీయ సమాచారం. పెరిగిన పోటీ.. జిల్లాలో రెండు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులు ఆన్లైన్ చేసుకున్న వారికి ఐడెంటిఫికేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 4,777 మందికి రుణాల లక్ష్యానికి గాను 20,651 మంది దఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష వరకు 80 శాతం సబ్సిడీని, రూ.2 లక్షల లోపు ఉంటే 70 శాతం, రూ. 2 లక్షల నుంచి నుంచి రూ. 5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ, 5 నుంచి 10 లక్షల వరకు యాభై శాతం సబ్సిడీని అందిస్తున్నట్లు తెలుపడంతో జిల్లా వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడాయి. యూనిట్ల సంఖ్య తక్కువగా... దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో రావడంతో రుణాలకు పోటీ తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు ఉద్యోగులు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దండుకోవడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే వచ్చే రుణంలో ముందే పర్సంటేజీలు మాట్లాడకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రుణాలు గ్రౌండింగ్ అవుతున్నాయి. -
సీబీఐకి చిక్కిన ఆదాయపన్ను అధికారిణి
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ఆదాయపన్ను శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. స్ధానిక ఒకటో వార్డు ఆదాయపన్ను అధికారిణి జయశ్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారి జయరామ్ నుంచి రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
♦ రూ.6వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ♦ బిల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు ఖమ్మం : కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్ను ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా బృందం శుక్రవారం వల వేసి పట్టుకుంది. అనంతరం నగరంలోని శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేయడంతోపాటు ఆస్తులను సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. నగరంలోని విలీన పంచాయతీ దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన షేక్ ఖాసీం తన అత్తమామల నుంచి పొందిన 80 గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నాడు. విలీన పంచాయతీ కావడంతో కార్పొరేషన్ రికార్డుల్లో నమోదు చేసి.. ఇంటి నంబర్ ఇస్తేనే నీటి పంపు, విద్యుత్ కనెక్షన్ వస్తుంది. దీంతో తనకు ఇంటి నంబర్ ఇవ్వాలని బిల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని కోరగా.. దీనికోసం రూ.22వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత మొత్తంలో ఇవ్వలేని ఖాసీం బతిమిలాడటంతో.. చివరకు రూ.12వేలకు అంగీకారం కుదుర్చుకొని.. మూడు నెలల క్రితం రూ.6వేలు లంచం తీసుకున్నాడు. అయినా నంబర్, పంపు కనెక్షన్ ఇచ్చేందుకు జాప్యం చేయడంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం శుక్రవారం రూ.6వేలు ఖాసీంకు ఇచ్చి.. శ్రీనివాస్రెడ్డికి లంచంగా ఇచ్చేందుకు ఫోన్ చేశారు. రెండు బృందాలుగా ఏసీబీ అధికారులు విడిపోయి.. ఒక బృందం ముస్తఫా నగర్, మరో బృందం శ్రీరాంనగర్లోని శ్రీనివాస్రెడ్డి ఇంటి వద్ద పాగా వేసింది. ఈ క్రమంలో లంచం డబ్బుల కోసం ముస్తఫా నగర్ పెట్రోల్ బంక్ వద్దకు రమ్మని చెప్పడంతో.. ఖాసీం అక్కడికి వెళ్లి శ్రీనివాస్రెడ్డికి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. అనంతరం నగరంలో శ్రీరాం నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీనివాస్రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఖమ్మం ఎస్సై జి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఎస్సైలు సాంబయ్య, శ్రీనివాసరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్
♦ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం ♦ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ ♦ కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో ♦ రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం పిడుగురాళ్ళ : సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని నాగబాలాజీ లేడీస్ కార్నర్ ఫిబ్రవరి 14న షార్ట్సర్య్కూట్తో కాలిపోయింది. దుకాణానికి బీమా ఉండడంతో ఫైర్ సర్టిఫికెట్ కోసం లేడీస్ కార్నర్ యజమాని జమ్మిగుంపుల నరేంద్ర పిడుగురాళ్ళ ఫైర్ ఆఫీసర్ కె. శివశంకర్రావును కలవగా రూ.30 వేలు డిమాండ్ చేశారు. నరేంద్ర రూ.20 వేలకు బేరం కుదుర్చుకుని బుధవారం గుంటూరులోని ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ శాంతోను సంప్రదించారు. ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు గురువారం సాయంత్రం నరేంద్ర ఫైర్ ఆఫీసర్ను కలిసి రూ.20 వేలు ఇవ్వగానే, ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఫైర్ ఆఫీసర్ గదిలోకి ప్రవేశించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అగ్నిమాపక అధికారి శివశంకర్రావుపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ శాంతో తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నేరుగా తమను సంప్రదించాలని, వివరాలకు 94913 05638ను సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా ఫైర్ ఆఫీసర్ శివశంకర్రావు విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర అసలు దరఖాస్తు చేసుకోలేదని, దరఖాస్తు చేసుకోకుండా సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఈ నగదును కూడా తీసుకోలేదని, తన గదిలోకి ఆ నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. -
లంచం కేసులో జైలుపాలైన నేవీ అధికారి
అమెరికా నౌకాదళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారి లంచం కుంభకోణంలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఓ మలేషియన్ ఢిఫెన్స్ కాంట్రాక్టరుకు విలువైన సమాచారం అందించిన కేసులో డానియల్ డుసెక్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఓ లగ్జరీ హోటల్లో వేశ్యల సేవలు అందుకునేందుకు గాను ఎక్స్చేంజి ఆఫర్లో సమాచారాన్ని అందించడంతో సదరు అధికారి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డుసెక్కు శిక్షలో భాగంగా 70,000 డాలర్ల జరిమానాతోపాటు నౌకాదళానికి 30,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ శిక్ష పడ్డ అమెరికాకు చెందిన సైనికాధికారుల్లో లంచం కుంభకోణంలో పట్టుబడ్డ డుసెక్ అత్యధిక ర్యాంక్ లో ఉన్న అధికారి. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 46 నెలల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జానిస్ సమ్మర్టినో ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లకు సమాచారం అందించి, వేశ్యల సేవలు అందుకోవడం కూడా లంచం పరిధిలోకి వస్తుందంటూ అనూహ్య తీర్పును ఇచ్చిన కోర్టు... డుసెక్ కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 49 ఏళ్ల డుసెక్.. జనవరి 2015న తాను లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తూ కోర్టు ముందు క్షమాపణలు కోరాడు. -
వ్యవసాయశాఖలో కలుపు మొక్క
► జేడీ కార్యాలయంలో సంచలనం ► రూ.పది వేలు లంచం తీసుకున్న సూపరింటెండెంట్ ► అటెండర్ పీఆర్సీ బిల్లు ఇచ్చేందుకు డిమాండ్ ► ఏసీబీకి చిక్కిన వైనం మచిలీపట్నం : జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్వీ రంగారావు రూ.పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఆర్.దివ్యమణిని పీఆర్సీ, అరియర్ బిల్లులు ఇవ్వాలంటే రూ.పది వేలు ఇవ్వాలని రంగారావు రెండు నెలలుగా ఆమెను వేధిస్తున్నాడు. చేసేది లేక ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సంఘటనకు సంబంధించి గుంటూరు ఏసీబీ డీఎస్పీ, జిల్లా ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ సీహెచ్ దేవానంద్శాంతో తెలిపిన వివరాలు.. జేడీ కార్యాలయ సూపరింటెండెంట్గా రంగారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ దివ్యమణి తనకు పీఆర్సీ, అరియర్ బిల్లులు ఇప్పించాలని కొద్ది కాలంగా ఆయన్ని కోరుతోంది. రూ.పది వేలు లంచంగా ఇస్తేనే బిల్లు మంజూరవుతుందని రంగారావు తెగేసి చెప్పారు. విషయాన్ని దివ్యమణి వ్యవసాయశాఖ జేడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితం దక్కలేదు. దివ్యమణి ఏసీబీ అధికారులను మంగళవారం ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. పక్కా వ్యూహంతో.. దివ్యమణి ఫిర్యాదుతో వ్యవసాయశాఖ జేడీ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వ్యవహరించారు. ఏసీబీ సిబ్బంది, అధికారులు సూపరింటెండెంట్తో పాటు ఇతర అధికారుల పనితీరు పైనా నిఘా ఉంచారు. దివ్యమణి తన వద్ద రూ.పది వేలు రంగారావుకు అందజేసింది. టేబుల్ సొరుగులో నగదును రంగారావు పెట్టిన వెంటనే ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రసాయనాలతో పరీక్షించి నగదు తీసుకున్నట్లు ధ్రువీకరించారు. సమాధానమే చెప్పలేదు.. తన బిల్లులపై రంగారావు సమాధానమే చెప్పే వారు కాదని దివ్యమణి విలేకరులకు తెలిపారు. డబ్బులు ఇస్తేనే బిల్లులు మంజూరవుతాయని ఆయన చెబుతున్నారని వివరించింది. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం
- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు - లోక్సభ స్పీకర్ ప్రకటన - అభ్యంతరం చెప్పిన తృణమూల్ ఎంపీ న్యూఢిల్లీ: కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు. జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు. కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు. మాపై కుట్రచేస్తున్నారు..: మమత ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు. -
అవినీతిపై పోరులో లంచగొండులకే గెలుపా?
విశ్లేషణ: లంచగొండితనంపై పోరాడ డానికి ప్రభుత్వాలకు ఇష్టం లేదేమోనని ఎన్నో సార్లు అను మానం వస్తూ ఉంటుంది. తాము నీతివంతమైన ప్రభు త్వాన్ని ఇస్తామని అందరూ అనే వారే. తీరా ఫిర్యాదు ఇస్తే తీసుకునే వారుండరు. కనీసం ఫిర్యాదు ఎక్కడ చేయాలో చెప్పరు. లంచం తీసుకుంటూ పట్టుబడినా సరే న్యాయ పోరాటంలో వారే గెలిచే స్థితి ఉంటే దాన్ని ఏమనాలి? నిజానికి సమాచార హక్కు కింద ప్రశ్నలకు సమా ధానం దొరకదు. ప్రభుత్వ రికార్డుల్లో దాగిన లేదా దాచిన సమాచారాన్ని దాని ప్రతి రూపంలో పొందడం అనే అత్యంత ప్రధాన హక్కును మాత్రమే ఈ చట్టం ఇస్తున్నదని చాలా మంది గమనించడం లేదు. ఢిల్లీలో ఎవరైనా లంచం తీసుకుంటూ ఉంటే మేం ఎక్కడ ఫిర్యాదు చేయాలండీ అని ఒక పౌరుడు సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించాడు. సమాచారం ఇవ్వన వసరం లేదని తిప్పి కొట్టొచ్చు. కొడతారు కూడా. కాని ఈ కేసులో అడిగిన వ్యక్తి ప్రశ్నించడం తెలిసిన న్యాయ వాది. అవినీతి ఆరోపణలు వస్తే విచారణ జరిపే అధి కారం ఫలానా అధికారికి ఉందని, ఎవరికి ఫిర్యాదు ఏ విధంగా చేయాలో వివరించే ఆఫీస్ మెమొరాండం ప్రతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రులలో ఎవరికి ఏయే అధికారాలున్నాయో తెలిపే పత్రాలు కావాలని అడిగారు. నిర్ణయాధికారాలు ఎవరికి ఉన్నా యనేది మరో ప్రశ్న. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైనా, దానికి ఒక శాసనసభ, మంత్రి మండలి ఉండడం, భూములు, శాంతి భద్రతలపై అధికారాలు కేంద్రం పరిధిలో ఉండడం వల్ల ఈ సందేహాలు తలెత్తాయి. మీరడిగిన రూపంలో మా దగ్గర ఏ పత్రాలూ సేక రించి సిద్ధంగా లేవని విజిలెన్స్ విభాగం పీఐఓ సమా ధానం చెప్పారు. 38 రూపాయలు చెల్లించిన తర్వాత 19 పేజీల నియామక నియమాల సమాచారం ఇచ్చారు. మొత్తం ఏసీబీ కార్యాలయంలో 116 పోస్టులు ఉన్నా యని, అందులో 28 ఖాళీగా ఉన్నాయని వివరించారు. కానీ అధికారాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. న్యాయవిభాగం నుంచి ఏ సమాచారమూ లేదు. వీకే గర్గ్ అనే న్యాయవాది మూడు ఫిర్యాదులు దాఖలు చేశారు. సమాధానం తెలిసి చెప్పకపోవడం, సమాచారం ఉన్నా ఇవ్వకపోవడం అనే తప్పిదాలకు మాత్రమే జరిమానా విధించవలసి ఉంటుంది. న్యాయవాదికే చట్టాల పరిధి, విచారణ పరిమితుల సమాచారం స్పష్టంగా లేనపుడు ఒక ిపీఐఓ సమాచారం ఇవ్వలేకపోయాడని తప్పు బట్టడం సరికాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాకు ఏ అధికారాలున్నాయో చెప్పండి అని ఢిల్లీ హైకోర్టును వీరంతా అడుగుతున్నారు లేదా మాకే అధి కారాలున్నాయని, వాటిని మరొకరు తీసుకొనే ప్రయ త్నం చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేస్తున్నారు. న్యాయ వాది అయిన సమాచార అభ్యర్థి లేవనెత్తిన సందేహం చాలా సమంజసమైనదే. ఎందుకంటే ఢిల్లీ ప్రజలకు లంచగొండులపైన ఫిర్యాదు ఎవరికి చేయాలో అర్థం కావడం లేదు. పాపం సాధారణ అధికారి అయిన పీఐఓ గానీ, కొంత సీనియారిటీ ఉన్న మొదటి అప్పీలు అధికారి గానీ, సమాచార కమిషనర్ గానీ తేల్చేంత సామాన్య విషయం కాదిది. అయితే న్యాయవాది అభ్యర్థనలు అన్నీ పరిశీలించి వారి ప్రశ్నలన్నీ క్రోడీకరించిన తరువాత కొంత అయో మయం ఉన్న విషయం స్పష్టమైంది. కానీ దానికి జవాబు పీఐఓ చెప్పడం సాధ్యం కాదు. ఒక కానిస్టేబుల్ ఢిల్లీలోని దుకాణదారుడినుంచి 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అతను 10 వేలు మాత్రం ఇవ్వగలనని ఇచ్చాడు. కానిస్టేబుల్ మిగిలిన డబ్బు కోసం వేధించసాగాడు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వారు వల పన్ని అతడిని అరెస్టు చేశారు. అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటూ తన అవినీతిని విచారణ చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీకి లేదని. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం తనపై వచ్చిన ఆరోపణలను పరిశోధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని వాదించాడు. దానిపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల మధ్య ఉన్నత స్థాయి న్యాయ వాదం సాగింది. సంవిధానం, చట్టాలు, జీవోలు తమ తెలివితేటలు కలిపి బోలెడు వాదోపవాదాలు చేశారు. ఢిల్లీలో 40 ఏళ్ల నుంచి అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్నది. ఆప్ సర్కారు 49 రోజుల పాటు సాగిన దశలో, ఒక పెద్దాయన పైన ఏసీబీ కేసు నమోదుచేశారు. ఆ ప్రభుత్వం దిగిపోయిన తరువాత కేంద్ర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైన విచారణ జరిపే అధి కారం ఢిల్లీ ఏసీబీ అధికారులకు లేదంటూ కేంద్ర ప్రభు త్వం ఒక జీవో జారీ చేసింది. దాన్ని ఢిల్లీ ప్రభుత్వం సవాలు చేసింది. మే 25, 2015 న ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇస్తూ ఢిల్లీ ఏసీబీ విచారణాధికారంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ప్రకటించింది. పౌరులు తమను వేధించే లంచగొండి అధికారుల పైన ఫిర్యాదు చేయాలనుకుంటే ఎవరికి చేయాలో తెలియజేయవలసిన బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రిలకు ఉంది, ఈ విషయాలు వివరంగా వారంతట వారే సెక్షన్ 4(1)(బి) కింద ఇవ్వవలసి ఉంటుంది, ఆర్టీఐ ద్వారా అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేకపోవడం న్యాయం కాదు. అవినీతిపై పోరాట అధికార వివాదాన్ని నానబెడుతూ ఉంటే అవినీతి వర్ధిల్లుతుంది కనుక ఈ విషయాలు తెల పాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు, గవర్నర్ కార్యాల యానికి కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. (సీఐసీఎస్ఏ, ఎ, 2015, 000238 వి.కె. గర్గ్ వర్సెస్ డెరైక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ లా కేసులో 29 ఫిబ్రవరిన కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్రిజిస్ట్రార్
పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన శరత్ రెడ్డి అనే రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సబ్రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. తనకున్న 70 సెంట్ల భూములను రిజిస్టర్ చేయించుకునేందుకు శరత్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా..సబ్రిజిస్ట్రార్ రిజిస్టర్ చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సబ్రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు జిల్లాలో ఏసీబీ దాడులు
నరసరావుపేట: గుంటూరు జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్ బిల్లు మంజూరుకు లంచం అడగటంతో సదరు చిరుద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏరియా వైద్యశాలలో జూనియర్ శానిటరీ వర్కర్గా విధులు నిర్వహించే తలమాల దుర్గారావుకు పది రోజుల క్రితం రూ.62,500లు ఇంక్రిమెంట్ ఎరియర్స్ కింద మంజూరయ్యాయి. వాటికి సంబంధించి బిల్లు పాస్చేసి చెక్కు ఇచ్చేందుకు వైద్యశాల సీనియర్ అసిస్టెంట్ కె.నరేంద్రబాబు రూ.15వేల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో దుర్గారావు రూ.5వేలకు బేరం కుదుర్చుకుని...ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్రబాబు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.