Published
Sun, Sep 17 2017 1:16 AM
| Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
చింతపల్లి విద్యార్థికి ప్రథమ ర్యాంకు... తెలంగాణ విద్యార్థికి మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహించిన అగ్రిసెట్–2017 పరీక్షా ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ వల్లభనేని దామోదర నాయుడు శనివారం గుంటూరుకు సమీపంలోని లాంఫారంలో విడుదల చేశారు. 184 సీట్లకు (112 ప్రభుత్వ, 72 ప్రైవేటు) నిర్వహించిన పరీక్షకు తెలంగాణకు చెందిన 512 మంది సహా 2969 మంది విద్యార్థులు హాజరయ్యారు. వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అగ్రికల్చరల్ బీఎస్సీలో చేరేందుకు ఎంసెట్కు బదులుగా అగ్రిసెట్ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం 184 సీట్లలో 149 వ్యవసాయ డిప్లొమా విద్యార్థులకు, 35 విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా విద్యార్థులకు కేటాయించారు. వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల్లో ప్ర«థమ ర్యాంకు చింతపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లాడి గిరీశ్ కుమార్, రెండో ర్యాంకు అనకాపల్లికి చెందిన పి.వీరబాల రాజు, తృతీయ ర్యాంకు నంద్యాలకు చెందిన కె.ఉమేశ్ సాధించారు. విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో ప్ర«థమ ర్యాంకు జంగమేశ్వరపురం విద్యార్థిని కుమారి ఎం.సంధ్యారాణి, ద్వితీయ ర్యాంకు కె.గోవింద్, తృతీయ ర్యాంకు కె.స్రవంతి (రుద్రూరు, తెలంగాణ) సాధించారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.a nfrau.ac.in లో తెలుసుకోవచ్చు. ఫలితాల ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ, అగ్రిసెట్ కన్వీనర్ డాక్టర్ టీసీఎం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.