
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏ పథకంతో ఎంతమందికి ప్రయోజనం కలుగుతోంది.. ఏ మేరకు ఫలితాలు సాధిస్తున్నామనే అంశాలపై అధికారులు నిశితంగా పరిశీలించాలని ఆయన సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతోపాటు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ ప్రగతిపై మంగళవారం సచివాలయంలో వేర్వేరుగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈబీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నందున వారికి వినియోగించే నిధుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు విదేశాల్లో చదువుకునేలా ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకంలో ప్రస్తుత రూ.10 లక్షల ఆర్థిక సాయానికి తోడు అదనంగా బ్యాంకుల నుంచి రుణం అందించాలని నిర్ణయించారు. జూన్ నాటికి 5 లక్షల ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.