ఆ యుగళగీతంలో ఎన్నో విశేషాలు
అన్నవరం : ‘బాహుబలి’ సినిమా కోసం తాను రాసిన యుగళగీతం ఎంతగానో పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు ప్రముఖ సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఆ సినిమాలో ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ఆ పాటలో చాలా విశేషాలున్నాయన్నారు. శనివారం సాయింత్రం కుటుంబసభ్యులతో కలసి ఆయన సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్యూ విశేషాలు..
సాక్షి: ఇంతవరకూ ఎన్ని సినిమాలకు పాటలు రాశారు, తొలి సినిమా ఏది?
అనంత శ్రీరామ్: సుమారు 50 సినిమాల్లో 700 పాటల వరకూ రాశాను. తొలిసినిమా ‘కాదంటే ఔననిలే’.
సాక్షి: రాజకీయపార్టీలకు కూడా పాటలు రాసినట్టున్నారు ?
అనంత: అవును, వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, లోక్సత్తా పార్టీలకు 50 పాటలు రాశాను.
సాక్షి: ‘బాహుబలి’కి రాసిన పాటలోని విశేషాలేంటి ?
అనంత: ఆ పాటలో భాష అటు జానపదానికి, ఇటు వాడుక తెలుగుకు మధ్యలో ఉంటుంది. భక్తి, శృంగార రసాలను మిళితం చేసి ఎటూ మొగ్గకుండా రాసిన పాట అది.
సాక్షి: మీ పాటలలో మీకు బాగా నచ్చేవి..?
అనంత: ‘కొత్త బంగారులోకం, బొమ్మరిల్లు, ఏ మాయ చేశావే, స్టాలిన్, ఊహలు గుసగుసలాడే’ సినిమాల్లో పాటలు ఇష్టం. ప్రస్తుతమైతే ‘బాహుబలి’కి రాసిన పాట ఇష్టం.
సాక్షి: మీరు ఇష్టపడే సినీ పాటల రచయిత ?
అనంత: ఇంకెవరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
సాక్షి: మీరు పాటలు రాస్తున్న కొత్త సినిమాలు?
అనంత : మహేష్బాబు హీరోగా వస్తున్న బ్రహ్మోత్సవం, గౌతమ్మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న చిత్రం, దిల్రాజు నిర్మాతగా ఉన్న రెండు సినిమాలు, మరో సినిమా ఉన్నాయి.
సాక్షి: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి గారి 150 సినిమాకు పాటలు రాయమని అడిగారా?
అనంత : అలాంటి సమాచారం ఏదీ లేదు. పూరి జగన్నాథ్ గారి చిత్రాలకు ఇప్పటి వరకూ రాయలేదు.