
సౌదీలో ఏఎస్పేట వాసి మృతి
ఇచ్ఛాపురం : మున్సిపాల్టీ పరిధిలోని అమీన్సాహేబ్ పేట గ్రామానికి చెందిన సాలిన గోపాల్ (34) సౌదీఅరేబియాలో అనుమానస్పద స్థితిలో ఆదివారం మరణించాడు. ఈ విషాదవార్త ఆదివారం రాత్రి గోపాల్ కుటుంబీకులకు తెలిసింది. అయితే గోపాల్ మృతదేహాం తమ గ్రామానికి వస్తుందో తెలియక అతని కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. గోపాల్ తో కొంత కాలం పనిచేసి ప్రస్తుతం ఇక్కడే ఉన్న సాలిన సంతోష్, గోపాల్ కుటుంబ సభ్యులు, 3 వ వార్డు కౌన్సిలర్ సాలిన ఢిల్లీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.సౌది అరేబియా లొజుబేలా అనే ప్రాంతంలో ఎన్ఎస్హెచ్ కంపెనీలో గోపాల్ రిగ్గర్ గా పనిచేస్తున్నాడు. గతంలొ రెండేళ్ళు పనిచేసిన గోపాల్ కొద్దికాలం కిందటే దేశానికి తిరిగి వచ్చాడు.
అప్పటి నుండి గ్రామంలో కుటుంబం వద్ద ఉన్నాడు. రెండు నెలల కిందటే మరలా సౌదీ అరేబియా వెళ్ళాడు.ఆదివారం మధ్యాహ్నం విదుల్లో ఉండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురై మరణించాడు.ప్రస్తుతం జుబేలాకు సమీపంలో ఉన్న దమల్ ప్రాంతంలోని ఉన్న ఆసుపత్రిలో ఆతని మృత దేహం ఉన్నట్లు చెప్పారు. సౌదీలొ ఉన్న స్థానిక కొళిగాం ప్రాంతానికి చెందిన రాపాక మోహనరావు తమకు సమాచారం అందించాడని తెలిపారు.గోపాల్ మృతికి సంబంధించిన ఎలా మరణించాడనే ఖచ్చితమైన సమాచారం లేదని,అక్కడ అధికారులు గోపాల్ మృతదేహాన్ని దేశానికి పంపిస్తారో లేదో అనే ఆందోళనలో కుటింబీకులు ఉన్నారు.
జిల్లాలోని వివిద ప్రాంతాలకు చెందిన సుమారు 3 వందల మంది తెలుగువారు అక్కడ ఉన్నారని,గోపాల్ మృతదేహాన్ని భారతదేశం పంపాలని వారు అక్కడ యాజమాన్యం పై ఒత్తిడి చేసి,అవసరమైతే సమ్మెకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. గోపాల్కు భార్య ఈశ్వరమ్మ కుమారులు హరి(8),హేంబాబు (5)కుమార్తె ప్రవల్లిక (6) తల్లి నూకాలమ్మ ఉన్నారు.