
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నాలు
మదనపల్లె : మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలోని అమ్మచెరువు మిట్ట సమీపంలో దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కదిరి-మదనపల్లె ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న గుట్టను జేసీబీ సహాయంతో చదును చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిని కాజేయాలని పథకం పన్నారు. మొత్తం 39 కుంటల స్థలాన్ని చదును చేసి ప్లాట్లుగా తయారు చేసి విక్రయించేం దుకు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడం, నిర్లక్ష్యం కారణంగా ఈ స్థలాన్ని ఆక్రమించకుండా చర్యలు చేపట్టలేకపోతున్నారు.
అంతేకాకుండా లక్షల రూపాయలు రెవెన్యూ అధికారుల చేతులు మారిందనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ స్థలానికి సంబంధించి ఒక అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. కబ్జాదారులు కూడా తాము లక్షల రూపాయలు రెవెన్యూ అధికారులు ఖర్చు పెట్టామని బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. కబ్జాదారులకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుల అండదండలు అందిస్తున్నారు. ఈ పట్టాలను కూడా వారే సృష్టించి ఆధారాలను చూపుతున్నారు.
ఇక్కడ ఒక్క కుంట స్థలం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం కబ్జాకు గురవుతున్న స్థలంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా ఆ స్థలం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన డీకేటీ అంటున్నారు. మొత్తం 39 పట్టాలలో ఏ ఒక్కటి కూడా నిజం కాదని ప్రస్తుత రెవెన్యూ అధికారులు అంటున్నారు. గతంలో తహశీల్దార్ ఇచ్చాడని వారు చూపుతున్న పట్టాలు బోగస్ అని వివరించారు.