
సినీ పరిశ్రమకు రాజమండ్రి బెస్ట్
గోకవరం :రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో వైజాగ్ చిత్ర నిర్మాణ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అయితే వైజాగ్ కంటే రాజమండ్రి సినీ నిర్మాణానికి అనుకూలమైనదని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ తనకు ఇటీవల విడుదలైన లౌక్యం సినిమాలోని బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. ఆయన ఆదివారం గోకవరంలోని వీరభద్రుని గద్దెలోని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి పళ్లెం, చీరను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అని తెలిపారు. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా 18 ఏళ్ల క్రితం తాను తెలుగుతెరకు పరిచయమయ్యానన్నారు. ఇంతవరకూ తాను సుమారు 75 సినిమాల్లో నటించానన్నారు. తనకు అన్ని పాత్రలు సంతృప్తినిచ్చాయన్నారు. సినీరంగంలో హీరో శ్రీహరి తనను బాగా ప్రోత్సహించారన్నారు. తాను పవన్కళ్యాణ్కు వీరాభిమానినని తెలిపారు. సాయిధర్మతేజ్ హీరోగా హరీష్శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో, రవితేజ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలోని ‘కిక్ 2’ సినిమాతోపాటు తనకు పేరు తెచ్చిన డైలాగ్ ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పేరుతో తన స్నేహితుడు కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నానన్నారు.