హుస్నాబాద్, న్యూస్లైన్: రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర డిపాజిట్లను బ్యాంకుల్లో భద్రపరచుకుని తెలంగాణపై జాయింట్ చెక్పవర్ కావాలంటున్నారని విమర్శించారు.
తెలంగాణ భూములు.. నీళ్లపై గవర్నర్, సీమాంధ్రుల పెత్తనం వద్దని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అన్నారు. హైదరాబాద్లోని భూములపై గవర్నర్కు అధికారం ఇవ్వాలని కొందరు కోరుతున్నారని, సీమాంధ్రులు ఆక్రమించుకున్న భూములను చట్టపరంగా పేదలకు పంపిణీ చేయాలంటే ఎవరి పెత్తనమూ ఉండకూడదని పేర్కొన్నారు. తెలంగాణపై ఇతరులు పెత్తనం చెలాయిస్తే ఉద్యమాలు, త్యాగాలు ఎందుకని ప్రశ్నించారు. 1948 నుంచి భూములపై ఆంక్షలున్నా సీమాంధ్రులు వాటిని ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు.