rayala telangana
-
ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి ప్యాకేజీలే గతి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక హోదా కోరుకోవడంలో తప్పేమీ లేదని, అయితే కేంద్రం మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదని జేసీ సోమవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను... రాయల తెలంగాణ కోరితే ఎవరు మద్దతు ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ నిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
కావూరి మూడు షరతులు
-
పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి
తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తేనే తాము ఆమోదిస్తామని, లేని పక్షంలో మళ్లీ వెల్లోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండు చేశారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు కూడా భాగం ఇవ్వాలని కావూరి అడిగారు. ఈ సవరణలకు అంగీకరించని పక్షంలో తాము మరింతగా ఆందోళన చేయడం ఖాయమని ఆయన చెప్పారు. -
రాయల తెలంగాణకు కావూరి మొగ్గు!
-
కర్నూలు, అనంత జిల్లాలను తెలంగాణలోనే ఉంచండి
ఏలూరు: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వెంటాడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఏలూరులో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇటీవల చింతలపూడిలో జరిగిన కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. దాంతో కావూరి పర్యటనకు పోలీసులు భారీగా మోహరించారు. తానెప్పటికీ సమైక్యవాదినే అంటూ కావూరి ...మరోసారి సమైక్యవాదులను తన మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసుండాలనే కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తప్పనిసరై రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భద్రాచలంను ఆంధ్రాలో కలపాలని కావూరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పర్యవేక్షణలో హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ బిల్లులో కచ్చితంగా మార్పులుంటాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి వస్తే అందులో తాను భాగస్వామిని కాలేనని కావూరి చెప్పారు. రాజీనామా చేయటమా? గైర్హాజరు కావటమా అనేది అప్పుడే నిర్ణయించుకుంటానని కావూరి తెలిపారు. -
అసెంబ్లీలో రాయలతెలంగాణపై కూడా చర్చ
హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) చర్చకు రానున్న నేపధ్యంలో రాయల తెలంగాణ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. హొటల్ సెంట్రల్ కోర్టులో ఈ సాయంత్రం రాయలసీమ కాంగ్రెస్ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రి సి.రామచంద్రయ్య రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. ఈ సమావేశంలో రాయలతెలంగాణపై చర్చిస్తారు. -
నేడు YSR కాంగ్రెస్ శాసనసభ పక్షం భేటీ
-
తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి:జైపాల్ రెడ్డి
ఢిల్లీ: దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బిల్లు శీతాకాల సమావేశాల్లోపే పార్లమెంట్ ముందకు వస్తుందని జైపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ అనేది అక్కడి ప్రజలకు, ఇక్కడి ప్రజలకు మంచిది కాదని గతంలో వ్యాఖ్యానించిన జైపాల్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనంతపురం, కర్నూలు జిల్లాలకు నదీజలాల విషయంలో అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. -
జైరాం రమేష్ వెకిలి నవ్వు
-
ఎక్కడా తెరుచుకోని దుకాణాలు
-
తెలంగాణ బంద్ సంపూర్ణం
బోసిపోయిన పది జిల్లాలు.. హోరెత్తిన నిరసనలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తోపాటు, తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాలన్నీ తెలంగాణవాదుల ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంకులు, సినిమాహాళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లు కూడా బంద్ పాటించడంతో ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపించాయి. రైల్వేస్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ తగ్గింది. టీజేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, విద్యార్థి, ప్రజా, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. బొగ్గు గనుల్లో కార్మికులు విధులకు గైర్హాజరవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ వైద్యుల జేఏసీ నిరసనలతో ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్లో సోనియా ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేయగా, తెలంగాణవాదులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జహంగీర్ పీర్ దర్గాలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యేకప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గన్పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడంతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. -
బంద్ సక్సెస్
ఖమ్మం, న్యూస్లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ జేఏసీ పిలుపులో బాగంగా గురువారం తలపెట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు సంతకాలు చేసి బయటకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ, లోక్సత్తా పార్టీలు, అనుబంధ సంఘాల నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, వైరా, మధిరతోపాటు అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో మోటార్సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మానవహారాలు చేపట్టారు. కళాకారులు ఆటాపాటలతో ప్రదర్శనలు చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంద్తో నిత్యం జనసందోహంతో ఉండే ప్రధాన వీధులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంక్లు, బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తెల్లవారుజామున 4 గంటలకే బస్డిపోల వద్దకు చేరుకున్న ఉద్యమకారులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఒక్క బస్సుకూడా రోడ్డెక్కలేదు. బస్ డిపోలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఖమ్మంలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, బీజేపీ, లోక్సత్తా పార్టీలు, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని షాపులు, వ్యాపార కూడళ్లను మూయించి బంద్ను జయప్రదం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ డిపోకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్లు, బ్యాంక్లు తెరుచుకోలేదు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ప్రరద్శన నిర్వహించి జడ్పీసెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎస్కె.ఖాజామియా, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. కొణిజర్లలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయించారు. మండల అధికారులు బంద్కు మద్దతు పలికారు. జూలూరుపాడులో టీఆర్ఎస్ కార్యకర్తలు అరగుండుతో నిరసన తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో టీజేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్, బైక్ ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురంలో వీకేడీవీఎస్ఆర్ కళాశాల బస్సును యువకులు అడ్డుకున్నారు. దమ్మపేటలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు బంద్ పాటించారు. కుక్కునూరు, ముల్కలపల్లి, వేలేరుపాడు, చండ్రుగొండ మండలాల్లో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా భద్రాచలంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మోటార్సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. దుమ్ముగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి ప్రత్యేక తెలంగాణా ఇప్పించాలంటూ పర్ణశాల రాముడి వద్ద వినతిపత్రం ఉంచారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. సినిమాహాళ్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పెట్రోల్బంక్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొత్తగూడెంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సూపర్బజార్ సెంటర్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో సింగరేణి గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. పాల్వంచలో ఏపీ జెన్కో, జేఏసీ ఆధ్వర్యంలో కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మధిర నియోకవర్గంలోని మధిర, బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. మధిరలో రాయల తెలంగాణను నిరసిస్తూ టీఆర్ఎస్, బీజెపీ, ఎమ్మార్పీఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు మూసివేయించారు. పాలేరు నియోజకవర్గంలో బంద్ సందర్భంగా గురువారం తెలంగాణావాదులు రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్రోడ్లో టీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేట చౌరస్తాలో టీజేఏసీ, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నాయకన్గూడెంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నేలకొండపల్లిలో బీజేపీ,టీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఇల్లెందులో హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు మూసివేశారు. టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, టీఆర్ఎల్డీ, పీడీఎస్యూ, ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టీఆర్ఎస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఇతర జేఏసీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. అనంతరం మండలంలోని సారపాక, బూర్గంపాడులలో ధర్నా రాస్తారోకో చేశారు. -
రాయల రగడతో ఆగిన గుండెలు
కరీంనగర్ జిల్లాలో ఇద్దరి మృతి హుస్నాబాద్/ఎల్లారెడ్డిపేట, న్యూస్లైన్: రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో మనస్తాపం చెంది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సారయ్య(40), ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు చెందిన పైతరి రామయ్య(58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. సారయ్య బుధవారం రాత్రి తన ఇంట్లో టీవీల్లో వస్తున్న రాయల తెలంగాణ వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాజయ్య సైతం ఇదే తరహా తుదిశ్వాస విడిచాడు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించేవారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంద్ సక్సెస్
-
సీడబ్ల్యూసీ తీర్మానానికే కట్టుబడండి
ప్రధానిని కోరిన టీ కాంగ్రెస్ ఎంపీలు పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నాం: టి. జేఏసీతో సుష్మా సాక్షి, న్యూఢిల్లీ: మంత్రుల బృందం(జీవోఎం) రాయల తెలంగాణకు సిఫార్సు చేసిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం ప్రధాని మన్మోహన్సింగ్తో భేటీ అయ్యారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సురేష్ శెట్కార్, గుత్తా సుఖేందర్రెడ్డి, రాజయ్య, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి ఓ మెమొరాండాన్ని సమర్పించారు. రాయల తెలంగాణ వల్ల పార్టీకి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందన్న వాదన సరికాదని చెప్పినట్లుగా సమాచారం. సీడబ్ల్యూసీ తీర్మానానికి కట్టుబడి పదిజిల్లాల తెలంగాణకే కేబినెట్లో ఆమోదం తెలపాలని ప్రధానికి విన్నవించారు. తమ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఎంపీలు తెలిపారు. అంతకుముందు వారు అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నం చేసినా వీలుపడకపోవడంతో దూరం నుంచే ఆమెకు నమస్కరించి వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు ఒప్పుకోం సుష్మా రాయల తెలంగాణకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణ జేఏసీ నేతలకు స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు. గురువారం జేఏసీ నేతలు కోదండరాం, దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాస్గౌడ్, రాజేందర్రెడ్డి, అద్దంకి దయాకర్, అమిద్ మహ్మద్ ఖాన్లు పార్లమెంట్లోని బీజేపీ కార్యాలయంలో సుష్మాను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆమెను కోరారు. ప్రజలు కోరుకున్న తెలంగాణకే తమ మద్దతు ఉంటుందని సుష్మా చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆమె స్పష్టం చేసినట్లు జేఏసీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగానే కొందరు నేతలు ఆమెను తెలంగాణ నుంచి పార్లమెంట్కు పోటీ చేయాలని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నపుడు.. బీజేపీ గెలుస్తుందంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా, పరిశీలిస్తాం అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు జేఏసీ నేతలు చెప్పారు. అనంతరం టీ జేఏసీ నేతలు కేంద్ర మంత్రి అజిత్సింగ్ను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. గాంధీ విగ్రహం వద్ద వివేక్, వినోద్ బైఠాయింపు రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎంపీ వివేక్, మాజీ ఎంపీ వినోద్కుమార్ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. సుమారు అరగంటపాటు అక్కడ కూర్చుని రాయల తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
బంద్ ఉద్రిక్తం.. సంపూర్ణం
కరీంనగర్, న్యూస్లైన్ : రాయల తెలంగాణను తెరపైకి తేవడానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీజేఏసీ, తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజాఫ్రంట్తోపాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, బార్ అసోసియేషన్లు బంద్కు మద్ద తు తెలిపాయి. ఆర్టీసీ కార్మికులు బంద్కు జైకొట్టడం తో జిల్లాలోని 11 డిపోల్లో 950 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించాయి. జిల్లా కోర్టు వద్ద ప్రధాన గేట్లుమూసి తాళాలు వేసి న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి కార్మికులు బంద్లో పాల్గొనడంతో కొంతమేర ఓపెన్కాస్టులతోపాటు భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు ఈద శంకర్రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్ తదితరులు బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. నగరంలో ర్యాలీగా తిరుగుతూ బంద్ను పర్యవేక్షించారు. ఓవైపు బంద్ జరుగుతుంటే.. మరోవైపు కరీంనగర్ సింగిల్విండో చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకున్న గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్తోపాటు పలువురు నేతలు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగి ఎన్నికలను వాయిదా వేయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణచౌక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసిన సోనియాగాంధీ గుడిని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీజేపీ నాయకులు కన్నం అంజయ్య, నారాయణరావు, మహిళా నాయకులు సుజాతారెడ్డి, గాజుల స్వప్న, న్యూడెమోక్రసీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్ తదితరులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు తెలంగాణవాదులకు వాగ్వివాదం, తోపులాట జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీజేపీ నాయకులు కన్నం ఆంజయ్య, నారాయణరావు, మహిళ నేతలు గాజుల స్వప్న, ప్రసన్న, సుజాతరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్తోపాటు మరో 20 మంది ఆదుపులోకి తీసుకొని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరిలించారు. ఆరెస్టు చేసిన బీజేపీ, సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ టుటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ, సీపీఐ, జేఏసీ చైర్మన్ వెంకట మల్లయ్య, ఫార్వర్డ్బ్లాక్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సోనియాగాంధీ గుడిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కన్న కృష్ణ, సునీల్రావు, డి.శంకర్లతోపాటు కార్యకర్తలు తెలంగాణ చౌక్కు చేరుకొని బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ నాయకుడు ఎడ్లవెల్లి విజేందర్రెడ్డి తన కార్యకర్తలతో బైక్ ర్యాలీగా రావడంతో ఒక్కరిపై ఒక్కరు నినాదాలు చేసుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సోనియా గుడిని ధ్వంసం చేయడంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుతుండగా అటుగా బండి సంజయ్ బైక్ ర్యాలీగా రావడంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ ఉన్న పోలీసులు వారిని పంపించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ప్రధానకూడళ్లలతోపాటు బస్టాండ్ చౌరస్తాలోని శ్రీపాద విగ్రహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్రావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్సింగ్, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్లతోపాటు పలు కులసంఘాల నాయకులు ర్యాలీలతో హోరెత్తించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కేంద్రప్రభుత్వం, జీఓఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ రాష్ర్ట నేతలు ఎస్.కుమార్, బల్మూరి వనిత, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, కోరుకంటి చందర్, హుస్నాబాద్లో టీఆర్ఎస్ ఇన్చార్జి ఒడితెల సతీష్బాబు, కర్ర శ్రీహరి, పన్యాల రమణారెడ్డి, మానకొండూరు టీఆర్ఎస్ ఇన్చార్జి ఓరుగంటి ఆనంద్, జీవీ.రామకృష్ణారావు, శరత్రావు, పెద్దపల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్రెడ్డి, చొప్పదండిలో బొడిగె శోభ, జగిత్యాలలో ఓరుగంటి రమణారావు, జితేందర్రావు, మంథనిలో చందుపట్ల రాంరెడ్డి, సునీల్రెడ్డి పాల్గొని బంద్ను విజయవంతం చేశారు. -
‘రాయల’ తెలంగాణ అంటే యుద్ధమే
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: రాయల తెలంగాణ అంటే టీఆర్ఎస్ మరో యుద్ధం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బంద్లో భాగంగా పొలిట్బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో తెల్లవారు జామున 5 గంటలకే జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ముందు బైఠాయించి, బస్సులను బయటికి రాకుండా ధర్నా చేశారు. ఆ తర్వాత పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీయే విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్రుల దోపిడీని శాశ్వతంగా కొనసాగించేందుకు రాయల ప్రతిపాదనను కాంగ్రెస్ చేస్తుందన్నారు. హైదరాబాద్లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు, భూములను కాపాడుకోవడానికి సీమాంధ్రులు ఎంతకైనా తెగిస్తున్నారని, అందులో భాగమే రాయల తెలంగాణ అని అన్నారు. నీటి దోపిడీని సాగించేందుకు కేంద్రంపై సీమాంధ్రులు వత్తిళ్లు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కేంద్ర రాయల తెలంగాణ ప్రకటిస్తే టీఆర్ఎస్ మరో మహోద్యం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాయల తెలంగాణతో కేంద్ర ముందుకు వస్తే టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పి కొట్టాలని, అందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలను తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. పొలిట్బ్యూరో సభ్యులు పి.చంద్రశేఖర్, సయ్యద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటి దోపిడీని చట్టబద్ధం చేసేందుకే రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బంద్ విజయవంతమైందని, బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బెక్కం జనార్దన్, మహబూబ్, గుండా మనోహర్, నాగరాజు, కృష్ణముదిరాజ్, మోసిన్ఖాన్, మిట్టేనర్సింహ్మ, గౌతంశ్రీను, కిరణ్ పాల్గొన్నారు. -
బంద్ స్వచ్ఛందం
పాలమూరు, న్యూస్లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం జిల్లాలో బంద్ స్వచ్ఛందం, సంపూర్ణంగా కొనసాగింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, టీజేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు కొనసాగాయి. ముందస్తుగా బంద్ పాటించాలని నిర్ణయించిన మేరకు అన్ని విద్యాసంస్థలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోలు బంక్లు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తెల్లవారుజామున టీఆర్ఎస్ శ్రేణులు మహబూబ్నగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు రాకుండా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్రెడ్డి ముందుండి నడిపించారు. రాయల తెలంగాణ అంటూ ప్రజాస్వామ్యానికి కేంద్రం సంకెళ్లు వేసిందని ఏబీవీపీ నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అలాగే బంద్లో భాగంగా పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జాగృతి, టీసీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బైక్ర్యాలీ నిర్వహించారు. ఓవైసీకి సెగ..! ఎంఐఎం ముఖ్య నాయకుడు చంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ సెగ తగిలింది. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేకప్రార్థనలు చేసిన ఆయన దర్గా నుంచి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా తెలంగాణవాదులు భారీసంఖ్యలో ఆయనను చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. దూస్కల్ మీదుగా బైపాస్ రోడ్డుకు చేర్చడంతో హైదారాబాద్కు చేరుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కొడంగల్, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. షాద్నగర్లో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, బీజేపీ, జేఏసీ, సీపీఐ, ఎంఎస్ఎఫ్ నాయకులు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముఖ్యకూడలిలో మానవహారం నిర్వహించారు. వనపర్తి పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, టీజేఏసీ ప్రతినిధులు ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. అలాగే జడ్చర్లలో వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, కార్యాలయాలు, పోలేపల్లి సెజ్లోని ఫార్మా కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఉదయం ఎనిమిది బస్సులను అడ్డుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు పట్టణంలో మోటార్సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఎక్కడి బస్సులు అక్కడే మహబూబ్నగర్ అర్బన్ : తెలంగాణ బంద్లో భాగంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుతో జిల్లాలో ఆర్టీసీ బస్సులకు బ్రేకులు పడ్డాయి. గురువారం జిల్లాలోని ఎనిమిది డిపోల్లో సుమారు 800 బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజు రూ.70లక్షల నష్టం వాటిల్లింది. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు, సభ్యులు సంతకాలు కూడా చేయకుండా రాయల తెలంగాణ పట్ల తీవ్ర నిరసన తెలిపారు. కాగా తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు మాత్రం విధులకు హాజరైనట్లు సంతకాలు చేసినా బస్సులను బయటికి రాకుండా ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారంతా డిపోలోనే గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణికులు, బస్సులు రాకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు, తెలంగాణ విద్యార్థి , ప్రజాసంఘాలు తెల్లవారుఝామునే డిపో ఎదుట బైటాయింపు చేశారు. -
పది జిల్లాల తెలంగాణాకే కేబినెట్ ఆమోదం
10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు... కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఆర్టికల్ 3కింద బిల్లు ఆమోదం పొందింది కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి వెళ్తుంది 10ఏళ్ల ఉమ్మడి రాజధానిగా జీ హెచ్ఎంసీ 371(డి) రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది ఉన్నత విద్య అడ్మిషన్లలో ఇప్పుడున్న విధానమే.. 10ఏళ్లపాటు కొనసాగుతుంది పోలవరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే గవర్నర్ చేతిలో జీ హెచ్ఎంసీ శాంతిభద్రతలు రాష్ట్ర విభజన అంశంపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర కేబినెట్ సమావేశం రాత్రి 8 గంటలకు ముగిసింది. కేంద్ర కేబినెట్ సమావేశంపై హోమంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. సుధీర్ఘంగా సాగిన సమావేశంలో కేంద్రం కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. షిండే మాట్లల్లో.. ''కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రవిభజనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ కేబినెట్ నిర్ణయం మేరకు 10 జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలిపింది. జీవోఎం, 18 వేల ఈమెయిల్స్, అన్ని పార్టీలను ఆహ్వానించాం. అన్ని మంత్రవర్గ కార్యదర్శిలతో మేం చర్చించాం. ముఖ్యమంత్రి, డిప్యూటి సీఎం, రాష్ట్ర మంత్రులతో మంత్రులతో భేటి నిర్వహించాం. అన్ని అంశాలను చర్చించాకే జీవోఎం సిఫారసుల మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును జీవోఎం సిఫారసు మేరకు కేంద్రం ఆమోదించింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటుందని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉమ్మడి రాజధాని ఉంటుంది. ప్రజల భద్రతకు తెలంగాణ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలుంటాయి. ఆర్టికల్ 3 కింద బిల్లు ఆమోదం పొందుతుంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పిస్తాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యతను కేంద్రం స్వీకరిస్తుంది. 371 డి రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. రెండు రాష్రాల అభివృధ్దికి కేంద్ర సహాయం అందిస్తుంది'' అని షిండే కిక్కిరిసిన మీడియా సమావేశంలో అన్నారు. -
'రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుంది'
హైదరాబాద్ : కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని తెలంగాణవాదులు గ్రహించాలని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇప్పుడు విభజన జరగకపోతే మరెప్పటికీ జరగదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు లేక కర్నూలు, అనంతపురం నష్టపోతామనే ఆవేదనతోనే రాయల తెలంగాణ అంటున్నామని మధుసూదన్ గుప్తా అన్నారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పడితే శ్రీశైలం ప్రాజెక్ట్ సమస్యాత్మకం అవుతుందన్నారు. రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుందని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం కోసం పోరాడే పరిస్థితులు వస్తాయని మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు సమైక్యవాద పార్టీలకే పట్టం కడతారని ఆయన అన్నారు. -
'మీరు12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తాం'
న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం చిదంబరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాయల తెలంగాణా? అదెక్కడుంది? అని ప్రశ్నించారు. పది జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోదం తెలిపిందని.... అయితే మీరు 12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తామని ఆయన మీడియాపై ఎదురుదాడికి దిగారు. రాయాల తెలంగాణపై మీడియాలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో దిగ్విజయ్ సింగ్.... జీవోఎం సభ్యుడు జైరాం రమేష్, నారాయణ స్వామితో భేటీ అయ్యారు. -
'రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ నైజం'
రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ... రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఆయన పేర్కొన్నారు. ఓ రోజు తెలంగాణ, మరో రోజు రాయల తెలంగాణ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగనాటకాలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు
రాయలతెలంగాణ ప్రతిపాదనకు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్శిటీ ప్రాంగణంలో గురువారం కదం తొక్కారు. అందులోభాగంగా యూనివర్శిటీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఎన్సీసీ గేట్ వద్ద ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆగ్రహంతో ఉగిపోయారు. ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. దాంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్న దశలో పోలీసులు రెండు సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం కూడా ఉస్మానియా విద్యార్థులు ఓయూలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో వారిని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఓయూలో భారీగా పోలీసులు,భద్రత బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. -
రాయల తెలంగాణపై ఆజాద్ వెనకడుగు!
న్యూఢిల్లీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనలు వెల్లువెత్తటంతో పది జిల్లాల తెలంగాణ వైపే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జీవోఎం సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణపై వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడే పది జిల్లాల తెలంగాణకే సిపార్సు చేయాలని ఆయన... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి ప్రతిపాదించారు. ప్రస్తుతం కోల్కతాలో ఉన్న ఆజాద్ ఈమేరకు ఫోన్లో షిండేతో మాట్లాడినట్లు తెలుస్తుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రత్యామ్నాయంగానే చూడాలని ఆయన షిండేకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తే రాయల తెలంగాణకు మొగ్గు చూపవచ్చని చెప్పినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్కు నిన్న జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే ఈరోజే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. -
తెలంగాణ అంతటా బస్సుల బంద్
-
స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండమే: హరీష్రావు
నేటి సాయంత్రంలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖుత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ ఓ రోజు బంద్కు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో హరీష్రావు మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయలతెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేస్తామని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ పుటకోమాటమారుస్తుండటం పట్ల హరీష్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాని ఇతర ప్రాంతాలను తెలంగాణలో కలిపితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. -
తెలంగాణ మాత్రమే కావాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రాయల తెలంగాణ మాకొద్దు... తెలంగాణ మా త్రమే కావాలి’ అంటూ జిల్లా ప్రజానీకం నినదించింది. ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తా రా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెదక్లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. డైట్ కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, నర్సాపూర్ తదితర మండల కేంద్రాల్లో విద్యార్థులు ర్యాలీలు తీశారు. పటాన్చెరులో జరిగిన ర్యాలీలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. జహీరాబాద్లో తొమ్మిదో నంబరు జాతీయ ర హదారిపై, నారాయణఖేడ్లో రాజీవ్ చౌక్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. జోగిపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్ ప్రధాన వీధుల్లో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. చేగుంటలో జరిగిన నిరసన ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. బంద్కు సన్నాహాలు పార్టీ పిలుపు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగే బంద్ను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం జరిగే బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం జరిగే బంద్ టీజేఏసీ భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ వెల్లడించారు. బంద్ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పాల్గొనాల్సిందిగా సీపీఐ పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తు సెలవు ప్రకటించాయి. మరోవైపు బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
‘రాయల’తో ఫ్యాక్షన్ విజృంభిస్తుంది
పటాన్చెరు, న్యూస్లైన్: ‘రాయల తెలంగాణ ఏర్పడితే ఫ్యాక్షన్ విజృంభిస్తుంది. హైదరాబాద్లో ఫ్యాక్షనిస్టులు పెరిగిపోయి ఫ్యాక్షన్కు వేదికవుతుంది. ఇప్పటికే చంచల్గూడ జైలు వారితోనే నిండిపోయింది. నాకు తెలిసి ఆ జైల్లో ఈ ప్రాంతం వారెవరూ లేరు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సీహెచ్ విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం ఆయన పటాన్చెరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ అధ్వర్యంలో జరిగిన మెదక్ జిల్లా వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి తెలంగాణపై నాటకాలాడుతోందన్నారు. తాము హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాయలసీమ ప్రాంతంలోని రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామంటున్నారనీ, ఒకవేళ అదే జరిగితే తాము అధికారంలోకి రాగానే ఆ రెండు జిల్లాలను తొలగించి ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్నారు. అదే సమయంలో రాయలసీమ ఆత్మగౌరవం కోసం కూడా పరిష్కారం చూపుతామన్నారు. రాయల తెలంగాణ అంటున్న కాంగ్రెస్ది కమ్యూనల్ ఎజెండాగా ఉందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ రాయల తెలంగాణ నాటకానికి తెరతీసిందన్నారు. మజ్లీస్ను దేశవ్యాప్త కార్యకర్తలుగా వాడుకునేందుకు ఓ వర్గం ఓట్ల కోసమే రాయల తెలంగాణ ఏర్పాటును యోచిస్తున్నారన్నారు. పది జిల్లాల తెలంగాణతో పాటు రాయలసీమలోని ఆ రెండు జిల్లాలను కలిపితే ముస్లిం ఓట్లు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ‘రాయల’ ప్రతిపాదన చేస్తున్నారన్నారు. నెహ్రూ అనుసరించిన విధానాన్నే ఇప్పటికీ కాంగ్రెస్ అవలంభిస్తోందన్నారు. నిజాంతో ఆనాటి నెహ్రూ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్(యథాతథ స్థితి) చేసుకున్నట్లే మజ్లిస్తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనల్ ఎజెండాతో పోతుందని విద్యాసాగర్రావు వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పడితే ఆర్టీసీ మూతపడుతుందనీ, ఆ సమయంలో బస్సులు తిప్పి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆలోచనతోనే జేసీ దివాకర్రెడ్డిలాంటి వారు ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నారన్నారు. -
రాయల గీయల జాన్తానై
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ప్రజాసంఘాలు, రాజకీయ జేఏసీ తీ వ్రంగా ధ్వజమెత్తాయి. జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా శాఖ పిలుపునిచ్చిన గురువారం బంద్ను విజయవంతం చేయాలని ఆయాసంఘాలు మద్దతు పలికాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, థియేటర్ల యజమానులు, పెట్రోల్బంకులు, మార్కెట్ల యజమాన్యం బంద్కు సహకరించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. జిల్లాబంద్కు రాజకీయ జేఏసీ, వివిధ సంఘాలు, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, రైతు, లెక్చరర్ల సంఘాలు బంద్లో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ సంఘాలు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జిల్లా బంద్కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. రగిలిన ఇందూరు.. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన ప్రదర్శనలు, ఆందోనళలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, మానవహారాలు కొనసాగాయి. నిజాంసాగర్ మండలం హాసన్పల్లిలో పీజీడీసీఏ విద్యార్థి మొకిరె రాములు సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని కోరుతూ సోనియాకు లేఖ రాసి ఆత్మహాత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు, తెలంగాణవాదులు ధర్నా, రాస్తారోకో, నిరసన ర్యాలీ చేపట్టి, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మృతుడు రాములు ఆత్మహత్యకు ముందు అమ్మనాన్నలకు , కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పుతూ రాసిన లేఖ తెలంగాణవాదులను తీవ్రంగా కదిలిం చింది. జిల్లాలో న్యాయవాదులు రెండోరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో కూడిన శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. ఎల్లారెడ్డిలో మూడువేల మంది విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, దిష్టిబొమ్మల ను దహనం చేశారు. బాన్సువాడ, కామారెడ్డిల్లో జరిగి న నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్రావు పాల్గొన్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మె ల్యే గంపగోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ యూనివర్శిటీలో విద్యార్థులు రాయల తెలంగాణకు వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. -
రాయల‘టీ’ రాజకీయమే!
ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినపడకుండా నిరో ధించేందుకు కూడా రాయల తెలంగాణ అస్త్రం ఉపకరిస్తుందని అధిష్ఠానం నమ్మకం. రాయల తెలంగాణ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు హోంశాఖ వర్గాలే చెప్పడం ఈ వాదనలకు బలం కలిగిస్తోంది. రాయల తెలంగాణ ప్రతిపాదన గత కొంతకాలం కిం దటే రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ నేతలు తీసుకురాగా సీమ ప్రజానీకం ఆ ప్రతిపాద నను అప్పుడే ఒక జోక్ కింద కొట్టిపారేసింది. కొందరు నిర్ద్వందంగా ఖండించారు. మరికొందరైతే ఆ నేతలపై దుమ్మెత్తిపోశారు. అంతటితో సద్దుమణగవలసిన ఆ ప్రస్తా వన ఇటీవల తరుచూ తెరపైకి రావడం రాయలసీమ చరి త్రను అధ్యయనం చేసినవారికి మింగుడు పడటం లేదు. రాయలసీమ అస్థిత్వానికే ముప్పుగా పరిణమించే ఈ ప్రతి పాదనను సీమవాసులతోపాటు ఏ రాజకీయ పార్టీ కూడా స్వాగతించలేదు. రాయల తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కాలమే తెర వెనక్కి నెట్టివేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాను రూపొందించేం దుకు ఏర్పాటైన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్) 11 అం శాలను రూపొందించి వాటిపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. తెలుగుదేశం మినహా మిగతా పార్టీలన్నీ జీఓఎం ముందు హాజరై తమ అభిప్రా యాలను వివరించాయి. మజ్లిస్ పార్టీ రాయలసీమ మొత్తం కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్ర మే తెలంగాణలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవల సిందిగా కోరటం గమనార్హం! ఇది ఆ రెండు జిల్లాలకు చెం దిన కొందరు అధికార పక్ష నేతలు చేస్తున్న ప్రతిపాదనకు నకలే. గతంలోనూ ఒకసారి మజ్లిస్ రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చింది. కానీ ఇప్పటిలా సీమ భూభాగాన్ని విభజించి రెండు జిల్లాలనే తెలంగాణలో కలపాలని చెప్ప లేదు. ఈ మార్పు మాట ఎలా ఉన్నా మజ్లిస్ మొత్తంగా చూస్తే రాష్ర్ట సమైక్యతనే కోరుకుంటోంది. హైదరాబాద్ను యూటీని చేస్తే ముస్లిం మైనారిటీలకు సమస్యలు తలెత్తు తాయనీ, అందువల్లే యూటీ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని నాయకులు చెప్పారు. రాయలసీమలోని ఈ రెండు జిల్లాలలో ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్నారని ఈ జిల్లాలను తెలంగాణలో కలిపితే మైనారిటీల పరిస్థితి మెరుగ్గా ఉంటుందని జీఓఎంకు మజ్లిస్ విశదీకరించింది. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక వారి వ్యాపార లావాదేవీల వ్యవహారాలు ఉన్నా, స్థానిక నేతలు కొందరు ఆ అంశం భుజానికి ఎత్తుకోవడానికి అదొక్కటే కారణం కాదు. కాంగ్రెస్ అధిష్టానం కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు బిల్లుకు మెజారిటీ సాధించుకునేందుకు కేంద్రం ఈ వ్యూహం అనుసరిస్తోంది. రాయల తెలంగాణ పేరుతో సీమ ప్రాంతంలోని సగం మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టడమే దాని పరమా వధి. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినపడకుండా నిరో ధించేందుకు కూడా రాయల తెలంగాణ అస్త్రం ఉపకరి స్తుందని అధిష్ఠానం నమ్మకం. రాయల తెలంగాణ ప్రతి పాదన పరిశీలనలో ఉన్నట్లు హోంశాఖ వర్గాలే చెప్పడం ఈ వాదనలకు బలం కలిగిస్తోంది. అందుకే ఆ రెండు జిల్లాల కాంగ్రెస్ నేతలు తమ ప్రతిపాదన సార్వజనీన మైనదని నమ్మబలుకుతున్నారు. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపించడం వల్ల సాగు నీటి సమస్యల సుడిగుండంలో అనంతపురం, కర్నూలు జిల్లాలు చిక్కుకోకూడదన్న ఉద్దేశంతోనే రాయల తెలం గాణ ప్రతిపాదన తెచ్చినట్లు ఆ ప్రాంత అధికార పక్షనేతలు చెబుతున్నారు. ఇది సహేతుకం కాదు. రాయలసీమకు సాగునీరు తుంగభద్ర, కృష్ణల నుంచే అందాలి. వేరే దారి లేదు. ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ రెండు జిల్లాలకు మాత్రమే సంబంధించినవి కావు. అన్నీ కూడా తెలంగా ణతో పాటు సీమ ప్రాంతం మొత్తానికి ప్రతిపాదించినవే! రాయల తెలంగాణలో భాగమైనంత మాత్రాన అనంత పురం, కర్నూలు జిల్లాలకే ఈ ప్రాజెక్టుల నీరు పరిమితం కాదు. ఒకవేళ తెలంగాణ వారి సహకారంతో ఆ ప్రాజెక్టుల సాగు నీరు ఆ రెండు జిల్లాలకే పరిమితం చేసుకోవచ్చని భావిస్తే అది అజ్ఞానమే. ప్రతిపాదిత జిల్లాలకు కాని సీమ మొత్తం ప్రాంతానికి గాని ఈ ప్రాజెక్టుల నుంచి సాగునీరు సవ్యంగా అందాలంటే అది సమైక్య రాష్ట్రంలోనే సాధ్యం. రాయలసీమ అస్తిత్వానికీ శతాబ్దాలుగా దాని సమగ్ర విశిష్ట చరిత్రకూ హాని తలపెట్టిన కేంద్రం కుయుక్తులను తిప్పికొట్టాలి. రాయల తెలంగాణను ప్రతిపాదించి, మద్దతి స్తున్న నేతలు భ్రమల నుంచి బయటకు రావాలి. మజ్లిస్ పార్టీ కూడా తన అనుమానాలను వీడాలి. సీమ ప్రాంత నాలుగు జిల్లాలు మొదట సమైక్యతను కోరాలి. అది వీలు కాని పక్షంలో శ్రీభాగ్ ఒడంబడిక అమలుకు ఒత్తిడి తేవాలి. - లెక్కల వెంకటరెడ్డి రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు -
బంద్ను విజయవంతం చేయాలి : జేఏసీ
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తూ రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేయడానికి కుట్ర చేస్తుందని జేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పది జిల్లాల తెలంగాణ కోసం గురువారం జరిగే బంద్ను విజయవంతం చేయాలని బుధవారం నల్లగొండ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన హైదరాబాద్తో కూడిన ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సీడబ్ల్యూసీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మరోసారి మోసానికి దిగవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రతిపాదనలైనా అడ్డుకుంటామని అన్నారు. బంద్లో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్చంధంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, చకిలం అనిల్కుమార్, కూతురు లక్ష్మారెడ్డి, బోనగిరి దేవేందర్, ఎం.రమేష్, టి.కృష్ణ, విజయ్కుమార్, ఆర్. శ్రీనివాస్రెడ్డి, ఫరీద్, శ్రీనివాస్, జమాల్ఖాద్రీ, రవీందర్, ఎన్.సంతోష్రెడ్డి, దూసరి కిరణ్, మాలె శరణ్యారెడ్డి, బి.నాగార్జున, సంతపురి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి కోసం రాయల తెలంగానం!?
తెలంగాణ బంద్కు వెల్లువెత్తిన సంఘీభావం సాక్షి, హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసం పాకులాడకుండా పదిజిల్లాల సంపూర్ణ తెలంగాణ మాత్రమే ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనలపై వారు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్కు అన్నివర్గాల వరకూ పెద్దఎత్తన సంఘీభావం ప్రకటించారు. టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికేనా?: సీపీఐ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎంఐఎంను సంతృప్తిపరిచి మైనారిటీ ఓట్లు రాబ ట్టడానికా లేక టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికా? అని సీపీఐ ప్రశ్నించింది. ఈ ప్రతిపాదన ఎవరి మనసులో పుట్టిందో చెప్పాలని డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుండా మల్లేష్, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎవర్నీ సంతృప్తి పరచని రాయల తెలంగాణ ప్రతిపాదనతోనే ముందుకు వెళితే కాంగ్రెస్ వేళ్లు తెగడం ఖాయమన్నారు. కాగా, టీఆర్ఎస్, టీజేఏసీ గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్కు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఎంఐఎం అడిగిందని ప్రజల ఆకాంక్షను బలిపెడతారా?: బీజేపీ ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ బంద్కు ఉపాధ్యాయ సంఘాల మద్దతు తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పిలుపు మేరకు.. గురువారం తెలంగాణ బంద్ పాటిస్తున్నట్టు పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.హర్షవర్దన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము కూడా బంద్కు మద్దతు ఇస్తున్నట్టు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, తెలంగాణ రీజనల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ‘రాయల’ వెనుక కుట్ర: పొన్నం, సారయ్య సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తామంతా వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అడగని రాయల తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి తెస్తామని, మిగతా రాజకీయ పార్టీలు సైతం ముందుకొచ్చి దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమను విడదీయకూడదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నామో రాయలసీమను విడదీయకూడదని కూడా అంతే బలంగా కోరుకుంటున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో.. తెలంగాణ ప్రాంతీయ సమస్య కాదని, సామాజిక ఉద్యమ ఫలితమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గురువారం బంద్కు విప్లవ రచయితల సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందని వరవరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, అల్లం నారాయణ, ర చయిత జూలూరి గౌరీశంకర్, వేదకుమార్, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బంద్ను విజయవంతం చేస్తాం: ఆమోస్ రాయల తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని.. అందుకే టీఆర్ఎస్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అవసరంలేదని, పది జిల్లాల తెలంగాణే తమకు కావాలని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మరో సమావేశంలో పేర్కొన్నారు. -
‘రాయల’పై లడాయి
రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు హోరెత్తాయి. రాయలను ఎవరూ కోరుకోవడం లేదని, హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్నే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యార్థులు మానవహారాలు నిర్వహించి పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఆమోదయోగ్యమని చాటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీలు తీశారు. - సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్ :కేంద్రమంత్రుల బృందం రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడాన్ని నిరసిస్తూ జిల్లా అంతటా ఆందోళనలు జరిగాయి. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, అసంఘటిత కార్మికులు, టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, ఆర్టీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రధాన చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఓసీపీ-3 ఏరియా వర్క్షాప్ తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఆధ్వర్యంలో విద్యార్థులు, టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. మెట్పల్లిలో బీజేవైఎం నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపా రు. రాయల తెలంగాణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ జగిత్యాల ఏరియా ఆస్పత్రి వైద్యులు మండిపడ్డారు. ఎల్ఎండీ పోలీస్స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అల్గునూర్ చౌరస్తాలో మానవహా రం నిర్వహించారు. సిరిసిల్లలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. బంద్కు వెల్లువెత్తుతున్న మద్దతు రాయల తెలంగాణ ప్రతిపాదనను విరమించుకోవాలనే డిమాండ్తో జేఏసీ, టీఆర్ఎస్ గురువారం పిలుపునిచ్చిన బంద్కు విసృ్తత మద్దతు లభిస్తోంది. బీజేపీ, సీపీఐలు మద్దతు ప్రకటించాయి. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వృత్తి సంఘాలు బంద్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని టీఎన్జీవోస్ నాయకులు నిర్ణయించారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ గురువారం నాడు సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది. బంద్ను విజయవంతం చేసే దిశగా టీఆర్ఎస్, జేఏసీలు సన్నాహాలు చేస్తున్నాయి. సంపూర్ణ బంద్తో ప్రజల ఆకాంక్షను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
బస్సులకు ‘టీ’బ్రేక్
కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్ఎస్ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో అటువైపు వెళ్లే బస్సులకు బ్రేక్ పడింది. ఆర్టీసీ అధికారులు ముందుజాగ్రత్తగా దాదాపు 185 సర్వీసులను నిలుపుదల చేసేందుకు నిర్ణయించారు. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ సెక్టార్లోని గద్వాల, అలంపూర్, మహబూబ్నగర్, ఐజ, శాంతినగర్, కోదాడ, రాజోలి, కొత్తకోట, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ వెల్లడించారు. అదేవిధంగా బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ సర్వీసులు, లారీలు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేయడం.. లేదా కర్నూలు నుంచి వెనక్కు పంపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ కారణంగా రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు మీదుగా రాజధానికి చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. మరీ అత్యవసరం కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ప్రతి రోజు దాదాపు 600 మందికి పైగా ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు బస్సు సర్వీసుల నిలుపుదల కారణంగా డబ్బును వెనక్కి ఇవ్వనున్నట్లు ఆర్ఎం తెలిపారు. గురువారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినా.. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. వీటి ద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణ సెక్టార్లోని ఆయా ప్రాంతాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
‘రాయల’ రగడ..
తెలంగాణ జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ జిల్లాల్లో బుధవారం పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. టీఆర్ఎస్ పిలుపు మేరకు పది జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు జరిగారుు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీల నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. వరంగల్ జిల్లా మానుకోటలో తెలంగాణవాదులు రైలు పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలో ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్, హుస్నాబాద్, గోదావరిఖని, హుస్నాబాద్, సిరిసిల్లలో కళాశాలల విద్యార్థులతో టీఆర్ఎస్ భారీర్యాలీ నిర్వహించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్నగర్లో నిరసనలు హోరెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాల్కొండ, బాన్సువాడ, డిచ్పల్లి, జుక్కల్తోపాటు 36 మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పిలుపు మేరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ర్యాలీలు నిర్వహించి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేయగా, కోర్టు ఎదుట న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హైవేపై రాస్తారోకో చేశారు. పీడీఎస్యూ (విజృంభణ) ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చేవెళ్లలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్ ఆందోళనలో పాల్గొన్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
సీమ పౌరుషాన్ని చూపిస్తాం
రాయల తెలంగాణపై సచివాలయ రాయలసీమ ఉద్యోగుల నిరసన ర్యాలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్టు ముక్కలు చేయడానికి సోనియాకు హక్కు ఎవరిచ్చారని సచివాలయ రాయలసీమ ఉద్యోగుల సంఘం మండిపడింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. సీమను విభజిస్తే రాయలసీమ వాసులు పౌరుషమేంటో సోనియాకు రుచిచూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ మిత్రులను తాము పల్లెత్తు మాట అనలేదని, కానీ బుధవారం కొంతమంది హెచ్చరించే ధోరణిలో వ్యవహరించడం బాధాకరమని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. సీమ వాసులపై వీహెచ్ వ్యాఖ్యల్ని క్రిష్ణయ్య ఆక్షేపించారు. రాయల తెలంగాణ దుర్మార్గమైన నిర్ణయం: రాయల తెలంగాణ నిర్ణయం దుర్మార్గమైన విషయమని తెలంగాణ ప్రజలు కోరుతున్నది పది జిల్లాల తెలంగాణను మాత్రమే అని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సచివాలయ నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆరోపించాయి. ఆయా సంఘాల అధ్యక్షులు నరేందర్రావు, శ్రావణ్కుమార్ల ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో వేర్వేరుగా రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. -
‘రాయల తెలంగాణ’తో కలతచెంది ఇద్దరి మృతి
విద్యార్థి ఆత్మహత్య... గీత కార్మికునికి గుండెపోటు నిజాంసాగర్, న్యూస్లైన్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలంటూ ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తిచేసిన విద్యార్థి ప్రాణత్యాగం చేశాడు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామానికి చెందిన మొకిరె దుర్గయ్య-దేవవ్వ దంపతుల పెద్ద కుమారుడు రాములు (23) రాయల తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకుందనే వార్తలతో కలత చెందాడు. బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. ఉదయం ఎంతకూ నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు. పది జిల్లాలతో కూడిన తెలంగాణతోపాటు, ఎలాంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ను రాజధానిగా ఏర్పాటుచేసేలా సోనియాగాంధీ చూడాలని రాములు సూసైట్ నోటులో పేర్కొన్నాడు. ‘రాయల తెలంగాణ’తో గుండె ఆగి... కమాన్పూర్ : రాయల తెలంగాణ ప్రకటిస్తున్నారనే వార్తలను టీవీలో చూస్తూ మనస్తాపం చెందిన కరీంనగర్జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన బుర్ర శంకరయ్యగౌడ్(46) అనే గీత కార్మికుడు మంగళవారం రాత్రి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. -
నేడు తెలంగాణ బంద్
* మద్దతు ప్రకటించిన పలు జేఏసీలు * బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్ * అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు.. * విజయవంతం చేయాలన్న కోదండరాం * ఏ కార్యాచరణకైనా సిద్ధపడాలని పిలుపు * రాయల వద్దు.. సంపూర్ణ తెలంగాణే లక్ష్యం * తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి తెలియాలి సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్ జరుగనుంది. పది తెలంగాణ జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయకుండా రాయలసీమలోని రెండు జిల్లాలను అదనంగా కలపాలన్న ప్రతిపాదనలను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన ఈ బంద్కు తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు పలు తెలంగాణ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ బంద్లో పాల్గొంటామని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు బంద్ ఏర్పాట్లను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ బుధవారం సమీక్షించారు. మండల స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సముదాయాలు, పాఠశాలలను బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాయల తెలంగాణకు నిరసనగా, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలనే డిమాండ్తో బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఆంక్షలు ఢిల్లీకి తెలిసేలా బంద్ను విజయంతం చేయాలని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం కోరారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా ప్రజలు మెలకువగా ఉండాలన్నారు. సంపూర్ణ తెలంగాణ బిల్లులో ఏ తేడా వచ్చినా తేడా వస్తే అందుకు బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలది, రాష్ట్ర, కేంద్ర మంత్రులదేనన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్లో బుధవారం టీజేఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ వద్దని, సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదం పొందాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘రెండు రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపితే ప్రజలు కోరుకున్న రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం కాదు. గవర్నర్కు అధికారాలివ్వడం, హైదరాబాద్పై తెలంగాణకుండే హక్కును నీరుగార్చే ప్రయత్నాలను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. సంపూర్ణ తెలంగాణలో ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర పరిణామాలకు జేఏసీ పిలుపునిస్తుంది. అవసరమైతే మళ్లీ చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. భావి కార్యచరణపై హైదరాబాద్ వెళ్లాక నిర్ణయం తీసుకుంటాం. ఏ కార్యచరణకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి’’ అని కోరారు. 371డి, యూటీ, గవర్నర్ పాలన వంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణిచివేసే ఎత్తుగడలను నిరసిస్తున్నట్టు టీజేఏసీ నేత దేవీప్రసాద్ చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనకు ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణపై రాబందుల్లా కన్నేసి, రాయల తెలంగాణ అంటూ ఉద్యమాన్ని నీరుగార్చజూస్తున్న వారికి చెంపపెట్టులా బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె వంటి ఆందోళనలకు వంద రెట్లు భారీగా ఉద్యమం చేపట్టి పార్టీలను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ నేత శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. భేటీలో తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, న్యాయవాదుల జేఏసీ నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలపై జేఏసీ చర్చ రాయల తెలంగాణ ప్రచారంలో ఉన్నా బిల్లు మాత్రం స్పష్టంగా తెలంగాణ ఏర్పాటుపైనే ఉంటుందని జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాయల తెలంగాణ, నిరసన కార్యక్రమాలపై ఢిల్లీలో కమిటీ చర్చించింది. తెలంగాణకు సానుకూల వాతావరణమే ఉందని, రాయల తెలంగాణ ఉండకపోవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, జేడీయూ అధ్యక్షులు శరద్యాదవ్, కేంద్రమంత్రి ఎస్.జైపాల్రెడ్డిలను ఇప్పటికే జేఏసీ నేతలు కలిశారు. లోక్సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ను గురువారం కలవనున్నారు. బీఎస్సీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ తదితరులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. భేటీలో మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, కె.రఘు, పిట్టల రవీందర్ పాల్గొన్నారు. -
టీ ముద్దు.. రాయల వద్దు: టీ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేయాలని, రాయల తెలంగాణ వద్దని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ అంటూ జాప్యం చేయడానికి ప్రయత్నించడమంటే ఇక తెలంగాణ రాదన్న అనుమానం వెలిబుచ్చారు. పది జిల్లాల తెలంగాణ మాత్ర మే కావాలంటూ ఈ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ నేతల తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ బుధవారం జీవోఎంకు లేఖ రాశారని, జీవోఎం సభ్యుల్ని కలవడానికి స్వయంగా ఢిల్లీకి వెళ్లారని టీ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్బాబు, సుదర్శన్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారం వారు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కాకుండా మరే ప్రతిపాదన తెచ్చినా తమకు ఆమోద యోగ్యం కాదన్నారు. రాయలసీమకు, తెలంగాణకు ముందు నుంచి ఎలాంటి సంబంధం లేదని, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రాత్మక నేపథ్యం అంతా వేరని, మద్రాస్ నుంచి విడివడినప్పుడు వారు ఆంధ్రాతో ఉన్నారని వివరించారు. ఉమ్మడి రాజధానికి అంగీకరించాక ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంశాన్ని తేవటం మంచిది కాదని జీవోఎంకు ఇదివరకే స్పష్టం చేశామని, ఈరోజు కేంద్రమంత్రి జైపాల్రెడ్డి హోంమంత్రి షిండేతో మాట్లాడి తమ వాదనను వినిపించారన్నారు. రాయల తెలంగాణను ప్రకటిస్తే అప్పుడు పరిస్థితుల ఆధారంగా కార్యాచరణ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. నేటి బంద్కు మా మద్దతు లేదు రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్కు తమ మద్దతు లేదని, ప్రజలు ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయాలని మంత్రులు కోరారు. బంద్కు పిలుపునిచ్చినప్పుడు మాకేమైనా చెప్పి ఇచ్చారా? అని జానారెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. జీవోఎంకు దామోదర రాసిన లేఖ.. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రభుత్వం ప్రకటించాక కృతజ్ఞతగా టీ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు జీవోఎం రాయల తెలంగాణ గురించి తీవ్రంగా ఆలోచిస్తోందని, ఆ మేరకు నివేదిక, ముసాయిదా రూపొందించినట్టు పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు తెలంగాణ ప్రజల్ని తీవ్ర ఆందోళనపరుస్తున్నాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే ఈ ప్రాంత ప్రజలు అంగీకరిస్తారని గతంలో పలుమార్లు మీకు తెలిపాం. హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగానూ ఆమోదించారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్నిగాక మరోవిధంగా ఎలాంటి నివేదిక ఇచ్చినా, బిల్లు తెచ్చినా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినట్లే. -
తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే!
* కసరత్తు ముగించి బిల్లు సిద్ధం చేసిన జీవోఎం * నివేదిక, నోట్లతో పాటు నేడు కేబినెట్కు సమర్పణ * జీవోఎం సిఫార్సు ఏమిటన్న దానిపై ఇంకా గోప్యతే * సాయంత్రం ఐదింటికి కేబినెట్ సమావేశంలో చర్చ * ‘రాయల’, తెలంగాణపై భేటీలోనే తుది నిర్ణయం * బిల్లును ఆమోదిస్తే ఆ వెంటనే రాష్ట్రపతికి సిఫార్సుపై పెదవి విప్పని షిండే, సభ్యులు * ఫక్తు రాజకీయ కోణంలో చూస్తున్న కాంగ్రెస్ * చివరి క్షణం దాకా లాభనష్టాల బేరీజే లక్ష్యం? * రాయల తెలంగాణ, తెలంగాణ ఆప్షన్లు రెండూ ఇచ్చిన మంత్రుల బృందం! సాక్షి, న్యూఢిల్లీ: విభజన పర్వంలో ఓ అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్కు బుధవారం జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. గురువారం సాయంత్రం ఐదింటికి జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే గురువారమే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. గంట పాటు జరిగిన జీవోఎం భేటీ అనంతరం బుధవారం రాత్రి షిండే మీడియా ముందుకొచ్చి క్లుప్తంగా మాట్లాడారు. ‘‘జీవోఎంను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ మాకిచ్చిన బాధ్యతను నేటితో పూర్తిచేశాం. మేం సిఫార్సులు చేశాం. వాటిపై గురువారం కేబినెట్ చర్చిస్తుంది’’ అని చెప్పడంతో సరిపెట్టారు. తెలంగాణ, రాయల తెలంగాణల్లో దేనికి సిఫార్సు చేశారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బదులూ ఇవ్వకుండానే వెనుదిరిగారు. జీవోఎం సిఫార్సు ఏమిటన్నది మరో 24 గంటల్లోపే తేటతెల్లమయ్యేదేనని తెలిసి కూడా ఇంతగా గోప్యత పాటించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రెండు ఆప్షన్లలో దేనితో తనకు రాజకీయంగా కొద్దో గొప్పో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న కోణంలో లాభనష్టాల బేరీజులో, తుది విడత మల్లగుల్లాల్లో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలుగా ఉన్నట్టు సమాచారం. అందుకే, ఈ అంశంపై అస్పష్టతను గురువారం సాయంత్రం దాకా కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలకాంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఫక్తు రాజకీయ ప్రయోజన కోణంలోనే చూస్తోందన్నది తాజా వైఖరితో మరోసారి స్పష్టమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి 12 జిల్లాలతో కూడిన ‘రాయల తెలంగాణ’ ఏర్పాటుకు జీవోఎం ఆమోదముద్ర వేసినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణఅంటూ రెండు ఆప్షన్లనూ నివేదికలో జీవోఎం పొందుపరిచిందని, అంతిమ నిర్ణయాన్ని కేబినెట్కు విడిచిపెట్టిందని మరికొన్ని వర్గాల కథనం. దాంతో విభజన ఎలా ఉండాలనే విషయమై జీవోఎం కచ్చితంగా చేసిన సిఫార్సు ఏమిటనే దానిపై సందిగ్ధత నెలకొంది. నదీ జలాల పర్యవేక్షణ మండళ్లకు సంబంధించి కృష్ణా, గోదావరితో పాటు పెన్నా నదిని కూడా చేర్చినట్టు సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సరిగ్గా ముందురోజు జీవోఎం తన కసరత్తును ముగించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతారా, లేదా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక, ‘‘317డి అధికరణాన్ని రెండు రాష్ట్రాలకూ వర్తింపజేయాలని కూడా జీవోఎం సిఫార్సు చేసింది. రాజ్యాంగ సవరణ ఆవశ్యకత తలెత్తకుండా ఉండేందుకు గాను బిల్లు పేరును కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అని కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బిల్లుగా మార్చాలని కూడా సిఫార్సు చేసింది’’ అని పీటీఐ తెలిపింది. ఆస్తులు-అప్పులు, జల వనరుల పంపకం, రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం, ప్రభుత్వాధికారుల క్యాడర్ల విభజన తదితర అంశాలకు కూడా జీవోఎం తుది మెరుగులు దిద్దినట్టు పేర్కొంది. కేబినెట్ నుంచి వెంటనే రాష్ట్రపతికి: జైరాం రాష్ట్ర విభజన ప్రతిపాదనను అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదించి ఏర్పాటుచేసిన జీవోఎం ఇప్పటివరకూ పలు సమావేశాలు నిర్వహించి, ఇదిగో అదిగో నివేదికను ఖరారు చేస్తున్నామంటూ చెబుతూ వచ్చిన విషయం విదితమే. మంగళవారం రాత్రి జరిగిన అసంపూర్ణ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి షిండే చెప్పిన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు నార్త్ బ్లాక్లోని హోం శాఖ కార్యాలయంలో జీవోఎం ‘చిట్టచివరి భేటీ’ నిర్వహించింది. షిండే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణసామి పాల్గొనగా, గులాం నబీ ఆజాద్ గైర్హాజరయ్యారు. షిండే, జైరాం, నారాయణసామి ఒకే వాహనంలో భేటీకి రావడం విశేషం. అంతకుముందు వారు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి నివేదిక అంశాలపై చివరిసారిగా చర్చించారని, ఆమె సమ్మతి తర్వాత నేరుగా నార్త్ బ్లాక్కు చేరుకున్నారని తెలుస్తోంది. జీవోఎం సమావేశం గంటలోపే ముగిసింది. ఆ తర్వాత కూడా షిండే, జైరాం దాదాపు గంటపాటు లోపలే గడిపారు. సభ్యులంతా ఆమోదించిన సిఫార్సులకు తుది మెరుగులు దిద్ది తుది నివేదికను, బిల్లును సిద్ధం చేశారు. అన్ని నిర్ణయాలూ తీసుకున్నామని, తుది సమావేశం పూర్తయిందని భేటీ అనంతరం ఆంటోనీ కార్యాలయం లోపల మీడియాకు చెప్పారు. ఒక బిల్లు, ఒక నివేదిక సిద్ధమయ్యాయని కార్యాలయం బయట మొయిలీ విలేకరులకు తెలిపారు. అయితే నివేదిక, ముసాయిదా బిల్లు స్వరూపంపై మీడియా ఎంతగా ప్రశ్నించినా సభ్యులెవరూ స్పందించలేదు. చివరగా బయటికొచ్చిన జైరాం కూడా తెలంగాణ, రాయల తెలంగాణలపై ఏమీ చెప్పలేదు. నివేదిక, బిల్లు వెంటనే కేబినెట్కు వెళ్తాయని, ఆ వెంటనే వాటిని రాష్ట్రపతికి పంపుతారని మాత్రమే చెప్పారు. అయితే బిల్లును పరిశీలించేందుకు, అసెంబ్లీకి పంపేందుకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారో చెప్పడానికి జీవోఎం సభ్యులతో పాటు హోం శాఖ వర్గాలు కూడా నిరాకరించాయి. వీలైనంత త్వరగా అసెంబ్లీకి పంపవచ్చన్నది కాంగ్రెస్, ప్రభుత్వ వర్గాల అంచనా. -
రాయల తెలంగాణ వద్దే వద్దు
తాండూరు టౌన్, న్యూస్లైన్ : రాయల తెలంగాణ వద్దే వద్దు...పది జిల్లాల తెలంగాణే ముద్దు అంటూ విద్యార్థులు నినదించారు. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, దాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానంలో రాయల తెలంగాణ ప్రస్తావనే లేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందని దుయ్యబట్టారు. వెయ్యిమందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించింది పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కోసమేనని అన్నారు. ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి తెలంగాణ ఇస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా సలహాదారు రంగారావు మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు అయూబ్ఖాన్, నాయకులు మహేందర్, వీరమణి, నబీ, వెంకటేశ్చారి, మోయిజ్, వెంకట్, రఘు పాల్గొన్నారు. రాయల తెలంగాణకు ఒప్పుకోం శంకర్పల్లి: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహారెడ్డి, నర్సింహ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణ విషయంలో రోజుకో ప్రతిపాదన ముందుకు తెస్తూ ప్రజల్లో అందోళన రేకెత్తిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై జరుగుతున్న జాప్యానికి నిరసనగా గురువారం చేపట్టిన బంద్ను తెలంగాణవాదులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి పండిత్రావు, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నర్సింహారెడ్డి, బస్వరాజ్, కొండ మాణయ్య పాల్గొన్నారు. -
రాయల తెలంగాణను అంగీకరించం
చేవెళ్ల, న్యూస్లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గురువారం నిర్వహిస్తున్న బంద్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, అది తప్ప ఏ ప్రతిపాదననూ ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు. రాయల తెలంగాణను ఎవరూ అడగలేదని, రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు. భద్రాచలం, మునగాలలను వదులుకునే ప్రసక్తేలేదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆంకాంక్షకు విరుద్ధంగా రాయల తెలంగాణను ఏర్పాటుచేస్తే మరోమారు ఉద్యమం తప్పదన్నారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ పునరావృతం అవుతాయన్నారు. నేటి బంద్కు వ్యాపార, విద్యాసంస్థల యాజమానులు సహకరించాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రౌతు కనకయ్య, ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి డి.ఆంజనేయులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, పాండు, శర్వలింగం, నర్సింహులు పాల్గొన్నారు. హోరెత్తిన నినాదాలు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్య తిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. స్థానిక హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి జేఏసీ నాయకులు రాఘవేందర్రెడ్డి, ఫయాజ్, నరేందర్ ర్యాలీకి ప్రాతినిథ్యం వహించారు. -
'కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరు'
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడీ సరికొత్త రాగమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.రాజేశ్వరరావు, అరుణా జ్యోతి, బండారు దత్తాత్రేయ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి ఉన్న రాయలసీమ సెంటిమెంటును దెబ్బతీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రేకులు, లీకులతో ప్రజలను గందరగోళపరుస్తారా? కబడ్దార్’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరన్నారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, కర్నూలుకు చెందిన డీ భీమలింగేశ్వరరావు నాయకత్వంలో పలువురు బీజేపీలో చేరారు. ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్ పోటీలో పసిడి పతకాన్ని సాధించిన హైదరాబాద్ యువకుడు అనూప్ కుమార్ యామాను నేతలు ఘనంగా సత్కరించారు. -
'తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణను అంగీకరించరు'
తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించరని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి తెలంగాణ మంత్రుల తరపున ఆయన ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింట్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాయల తెలంగాణ ప్రతిపాదన సరికాదని తప్పుపట్టారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు వివరించామని, ఈ మేరకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతు సభలు నిర్వహించామని లేఖలో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయల ప్రతిపాదన విరమించుకుని వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని రాజనరసింహ కోరారు. -
రాష్ట్ర విభజనకే వ్యతిరేకం... రాయలతెలంగాణకు ఎలా...
రాయలతెలంగాణ ప్రతిపాదనను రాయలసీమ ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి శ్రీకాంత్రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజననే తాము వ్యతిరేకిస్తున్నామని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటప్పుడు రాయలతెలంగాణ ఏలా ఒప్పుకుంటామని వారు ప్రశ్నించారు. అయితే ఈ నెల 12న హైదరాబాద్లో తమ పార్టీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగణ ప్రాంతంలోని 10 జిల్లాలను కలపి రాయలతెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆటు సీమ ప్రాంతంలో, ఇటు తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
'రాయలతెలంగాణ ఇస్తే కాంగ్రెస్కు పుట్టగతులుండవు'
రాయల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత 59 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్న సంగతి మరువరాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సుముఖుత వ్యక్తం చేసింది. అయితే రాయలసీమలోని రెండు జిల్లాలతోపాటు తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలు కలపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించే అవకాశం ఉందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాయల తెలంగాణ ఏర్పాటు వద్దని టి.జేఏసీ నేతలు ఇప్పటికే న్యూఢిల్లీలో ముమ్మరం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
-
'సీమ అస్తిత్వానికి...తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ'
హైదరాబాద్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బుధవారం గన్పార్క్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రాయల తెలంగాణ పాపం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలదేనని మండిపడ్డారు. దీనికి తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో కదలిక వచ్చేవిధంగా గురువారం తెలంగాణ బంద్ జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి... పార్లమెంట్ సాక్షిగా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తారని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే లేదని, పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణకే మద్దతు ఇస్తామన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా తమ నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. రాయల తెలంగాణతో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీమ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌవరాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. -
10 జిల్లాలతో కూడిన తెలంగాణానే కావాలి: కోదండరాం
-
రాయల తెలంగాణ వ్యతిరేకంగా టిఆర్ఎస్ ధర్నా
-
10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని టి.జేఏసీ కన్వీనర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని రెండు జిల్లాలను విడగొడితే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టి.జేఏసీ స్టీరింగ్ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, రాయల తెలంగాణ అంశంపై చర్చించింది. ఆ కమిటీ భేటీ అనంతరం కోదండరాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...తమకు 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక జిల్లా ఎక్కువా వద్దు, ఒక జిల్లా తక్కువా వద్దని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ... రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్లు టీజేఏసీ నేత కోదండరాం ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
'రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర'
వరంగల్ : రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ కావాలని ఏ రాజకీయ పార్టీ కోరలేదని ఎర్రబెల్లి అన్నారు. వేరే జిల్లాలను కలుపుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు టీడీపీ వ్యతిరేకమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. త్వరలో ఢిల్లీ వెళతామని, తమ వాదనను వినిపిస్తామని ఆయన తెలిపారు. -
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
-
రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు
-
మళ్లీ భగ్గుమన్న తెలంగాణవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాయల తెలంగాణ ప్రక్రియ ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రుల కమిటీ(జీఓఎం) భేటీ, ఆ తదుపరి పరిణామాలు మళ్లీ తెలంగాణ ‘లడాయి’కి సంకేతాలు ఇస్తున్నాయి. దాదాపుగా రాష్ట్ర విభజన పూర్తయిందని భావించిన తరుణంలో ‘రాయల తెలంగాణ’ తెరపైకి రావడం వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, మంత్రుల కమిటీ వైఖరిలో 24 గంటల వ్యవధిలో జరిగిన మార్పులు తెలంగాణవాదులను రగిలిస్తున్నాయి. హైదరాబాద్పై ఆంక్షలు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని భావించిన తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదన జోరందుకోవడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో 5న తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం నుంచి నిరసనలు, ధర్నాలకు పిలువునివ్వడంతో మళ్లీ తెలంగాణ భగ్గుమననుంది. నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్ర మంత్రుల కమిటీ భేటీ ఏమీ తేల్చకుండా సమావేశం వాయిదా పడటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించిన నేపథ్యంలో జిల్లాలో మళ్లీ ఉద్యమ కార్యాచరణలో ఆ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రాయల తెలంగాణకు నిరసనగా ఆందోళనలు మంగళవారం ఉధృతంగా సాగాయి. పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించిన న్యాయవాదులు రాయల తెలంగాణ వద్దని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించగా, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. న్యూడెమోక్రసీ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకో, ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. లక్సెట్టిపేటలో జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆసిఫాబాద్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకు మొగ్గుచూపితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిల పక్షం అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ పలువురు ఆరోపించారు. 5న బంద్కు పిలుపునివ్వడ ంతోపాటు 6న టీఆర్ఎస్ పొలిట్బ్యూరోలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నందున జిల్లాలో మళ్లీ ‘ప్రత్యేక’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడనుంది. బంద్ను విజయవంతం చేద్దాం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలు తేవడం కుట్ర. ఈ విషయంలో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అందుకే తెలంగాణలో మరోసారి ఉద్యమించేందుకు అధినేత కేసీఆర్ 5న తెలంగాణ జిల్లాల బంద్కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్ సక్సెస్కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, రాజకీయ, న్యాయవాద, డాక్టర్ జేఏసీలతోపాటు తెలంగాణవాదులు బుధవారం నుంచి నిర్వహించే నిరసనలు, ఆందోళనలకు కదిలిరావాలని కోరుతున్నాము. బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 4, 5 తేదీలలో కుంటాల, సారంగపూర్ మండలాల్లో జరిగే టీఆర్ఎస్ శిక్షణ తరగతులను వాయిదా వేశాము. -
కార్టూన్
చూడు... వాళ్లు నాలాగే వ్యతిరేకించడంలేదు! -
రాయల తెలంగాణ అంటే యుద్ధమే
* రేపు బంద్కు కేసీఆర్ పిలుపు * తల తెగిపడ్డా.. అందుకు అంగీకరించనని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్య * మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు * 6న పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం * సీడబ్ల్యూసీ, కేబినెట్లు నిర్ణయించింది 10 జిల్లాల తెలంగాణనే * తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ వారి కోసమా? లేక * అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారి కోసమా? * దీనిపై నేను పార్లమెంటుకు హాజరై నిరసన గళం వినిపిస్తా సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే యుద్ధం తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ వాదుల తరఫున కరాఖండిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తాజా ప్రతిపాదనకు నిరసనగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజైన ఈనెల 5వ తేదీ (గురువారం) తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ‘రాయల తెలంగాణ వద్దు - సంపూర్ణ తెలంగాణ ముద్దు’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ చర్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసనలు తెలపాలని సూచించారు. కేసీఆర్ మంగళవారం తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ నేతలు కె.కేశవరావు, మందా జగన్నాథం, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, ఎస్.మధుసూదనాచారి, కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినయ్... ‘‘ఏం జరుగుతుందో తెలియనపుడు మాట్లాడుడు మంచిదికాదని ఇప్పటివరకు ఆగినం. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉందని నాకు ఢిల్లీలోని వర్గాల నుంచి ఫోన్లు వచ్చినయ్. సరైన సమయంలో స్పందించడం నా విధ్యుక్త ధర్మంగా భావించి ఇప్పుడు మాట్లాడుతున్న. ఇది తెలంగాణ ప్రజల ఆశ, భాష. తెలంగాణ ప్రజల ఆశను సరైన సమయంలో తెలుపకపోతే నాది తప్పు అయితది. అందుకే ప్రధానమంత్రికి, సోనియాగాంధీకి, జీవోఎంకు తెలుపుతున్నం. ప్రాణాలు పోయినా, ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా రాయల తెలంగాణకు అంగీకరించం. అట్లాంటిదే జరిగితే మరో ఉద్యమానికి తెరతీస్తం’’ అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజల తరఫున నిరసనలు తెలిపేందుకు మేం కార్యాచరణ రూపొందించినం. బుధవారం విద్యార్థులు, యువకులు రాయల తెలంగాణ వ్యతిరేక నిరసన ర్యాలీని గ్రామం నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు చేపట్టాలె. టీఆర్ఎస్ తరఫున గురువారం తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నం. తెలంగాణకు ఇది పరీక్షా సమయం. ఈ బంద్ వేరే ఎవరి కోసమో కాదు కాబట్టి ఇందులో వ్యాపారస్తులు మొదలుకొని విద్యా సంస్థల దాకా అంతా స్వచ్ఛందంగా వంద శాతం పాల్గొనాలె. బంద్లో పాల్గొనాలని ఎవ్వరూ ఒత్తిడి చేయరు. స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్లో పాల్గొని కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలె. అందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ కావాలి. ఉద్యోగులు విధులను బిహ ష్కరించాలి, ఆర్టీసీ వారు, పరిశ్రమలు, ఐటీ వారు అందరూ ఇందుకు సహకరించాలె’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆరో తేదీన టీఆర్ఎస్ పొలిట్బ్యూరో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని.. కేంద్ర కేబినెట్లో తెలంగాణ బిల్లును బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ శిక్షణా కార్యక్రమలను మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. బలిదానాలు సంపూర్ణ తెలంగాణ కోసమే ‘‘13 ఏళ్ల తర్జనభర్జనల తర్వాత సీడబ్ల్యూసీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించింది. దాన్నే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇపుడు దాన్ని అటు ఇటు తిప్పడం, వేరే ఏవో చేర్చడం అనేది సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఖండించటమే. ఇతర ప్రాంతాల వారితో కలిసేందుకే మా పిల్లలు బలిదానం చేసుకున్నారా? ఇవాళ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి. ఆయన అమరుడు అయింది రాయల తెలంగాణ కోసమేనా? తెలంగాణ కోసం ప్రాణత్యాగ ం చేసుకున్న వారంతా హైదరాబాద్ రాజ ధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలనే. అదే కొందరు లేఖల రూపంలోనూ తెలిపారు. ఇవన్నీ జీవోఎంకు సుమారు గంటన్నర పాటు వివరించినయన్ని అరణ్యరోదనే అయితయ? తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణవారి కోసమా లేదా అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారికోసమా? అని జీవోఎం భేటీలో మేం ప్రశ్నించినం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్పై ఆంక్షలు విధిస్తారా ‘‘రాష్ట్రం విడిపోతే గతంలో తెలంగాణతో కలిసి లేని సీమాంధ్రులు తిరిగి వారి ప్రాంతానికి హ్యాపీగా వెళ్లిపోతరు. మాక్కుడా కొద్దో గొప్పో రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగంలో ఎక్కడా కామన్ కాపిటల్ అనే పదం లేకున్నా.. సీమాంధ్రులను తెల్లారే తరుముడు తెలివి తక్కువ తనం అయితదని ఒప్పుకున్నదాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాద్పై, శాంతిభద్రతలు ఇతర అంశాలపై ఆంక్షలు విధిస్తర? ఇట్లాంటి చర్యలు మమ్మల్ని అవమానించుడే అయితది. మద్రాసు నుంచి విడిపోయినపుడు తెలుగువారికి రాని సమస్యలు ఇపుడు తెలంగాణ విడిపోతే హైదరాబాద్లోని సీమాంధ్రులకు కలుగుతయి అనడం వితండవాదమె. కేంద్రం కట్టడి చేయడం అనే చర్య మొదలుపెడితే దేశంలో ఏ పెద్ద నగరాల్లోకి ఇతరులను రానివ్వరు. ఇప్పటికే ఉన్న 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు ఏర్పడ బోయే తెలంగాణకు మాత్రమే ఎందుకు విధిస్తరు?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో టీ ఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవటం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదనలు చేస్తున్నారంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘సొల్లుగాళ్ల మాటలకు నేను జవాబివ్వాలా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అంగీకరించిన తర్వాతే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిందనే అభిప్రాయాలను విలేకరులు పేర్కొనగా.. ‘‘కేసీఆర్ రాయల తెలంగాణకు ఒప్పుకుంటడ? నా జీవితంలో ఏనాడైనా ఆ మాట అడిగినన?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రాయల తెలంగాణ నష్టాలను రోజుల తరబడి చె ప్పుకోవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి 1.5 లక్షల మంది బంగారు బతుకులు నాశనం అయినయి. రాయల తెలంగాణ ప్రకటించిన తర్వాత పది రోజుల పాటు ఉద్యమించి ఊరుకుంటారని కొందరు సన్నాసులే భావిస్తరు. కేసీఆర్ అట్ల ఊరుకుంటడ? నా తల తెగిపడ్డా అందుకు అంగీకరించను. ఇన్నాళ్ల ఉద్యమంలో మధ్యలో ఎందరో బుడ్డర్ఖాన్లు వచ్చిపోయారు తప్ప కేసీఆర్ ఒక్కడే పోరాడుతున్నడు. ఎవరి గొంతెమ్మ కోరికల కోసమో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి మా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి బిడ్డలను చంపుకోవాల్నా? ఆ రెండు జిల్లాలను కలిపి అక్కడి గాలేరు-నగరి వంటి అక్రమ ప్రాజెక్టులను ఓకే చేసుకోవాల్నా? దీనికి ఏ తెలంగాణ బిడ్డనైనా ఒప్పుకుంటడ? అసలు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకొచ్చిందో అది బయటపెట్టిన వారే చెప్పాలి. కాకి లెక్కలు చెప్పి సీమ జిల్లాలు కలుపుకుంటే కరెంటు కష్టాలుండవని చెప్తే వినేందుకు మేం పిచ్చోళ్లమా? నీటి ఆధారంగా జరిగే విద్యుత్ ఉత్పత్తి ఎల్లకాలం ఉండదు. బొగ్గుతో తయారయ్యేదే ఎప్పటికీ శాశ్వతం. ఆ బొగ్గు మా తెలంగాణలో పుష్కలంగా ఉంది. దానితో కరెంటు తయారు చేసుకుంటం’’ అని పేర్కొన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తే యుద్ధం గ్యారంటీ అని కేసీఆర్ హెచ్చరించారు. ‘‘సంపూర్ణ తెలంగాణ ప్రకటించేదాకా యుద్ధం కొనసాగిస్తం. పార్లమెంటు సమావేశాలకు తప్పక హాజరవుత. రాయల తెలంగాణ ఏర్పాటు లేదా ఇతర ఆంక్షలేమైనా ఉంటే తప్పక నిరసన తెలుపుత. తెలపకుండా నేనెట్ల ఊరుకుంటా? ఈ సారి ఇంగ్లిష్లో కాదు హిందిలో మాట్లాడుత’’ అని చెప్పారు. బంద్కు టీజేఎఫ్, ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న చేపట్టిన తెలంగాణ బంద్కు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్), తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. -
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
పది జిల్లాల తెలంగాణకే మా ఓటు : వెంకయ్య సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించబోమని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. కాంగ్రెస్ తీరు తమాషాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగితే రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తారా? సరికొత్త రాయల తెలంగాణ ప్రతిపాదన వెనకున్న సహేతుక కారణాలేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెంకయ్య మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణకు సరైన కారణాలు చెప్తే అప్పుడు తమ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు చర్చిస్తాయని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ వాళ్లు సజావుగా జరగనిస్తారనేది అనుమానమేనన్నారు. రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయాల్సిందేనని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. -
..ఇంకా ఉంది
* అసంపూర్తిగా ముగిసిన జీవోఎం భేటీ * నేటి రాత్రి 8 గంటలకు మళ్లీ మంత్రుల బృందం సమావేశం * రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదంటూ లీకులు * పరిణామాలను అంచనా వేసేందుకే?.. రేపు కేంద్ర మంత్రివర్గ భేటీ * అప్పటిదాకా నాన్చి, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం * 371డీ పై చర్చ, ఇరు రాష్ట్రాలకూ వర్తింపజేసే దిశగా యోచన? * రాయల తెలంగాణ గురించి తెలియదన్న షిండే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సమావేశం మంగళవారం అసంపూర్ణంగా ముగిసింది. కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించే ముందు ఇదే చివరి భేటీ అని భావించినప్పటికీ ఆ నివేదిక తుది రూపు సంతరించుకోనందున బుధవారం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదన తాలూకు పరిణామాలను అంచనా వేసేందుకు, గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగేదాకా విషయాన్ని నాన్చడానికే జీవోఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే సమావేశానంతరం విలేకరులకు వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటలకు జీవోఎం మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. అదే ఆఖరు సమావేశం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం కసరత్తు చేస్తోంది. అయితే ఆలోగా పరిష్కరించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి’’ అని చెప్పారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం... బిల్లు ముసాయిదా సిద్ధమైందని, చట్టపరమైన అడ్డంకులు రాకుండా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు. విభజన ప్రక్రియలో కీలకమైన అంకంగా అంతా భావిస్తున్న 371డీ అధికరణను రెండు రాష్ట్రాలకూ వర్తింపజేసే మార్గాంతరాలపై భేటీలో లోతుగా చర్చ జరిగిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అందుకు వీలుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు’ను ‘ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిల్లు’గా మార్చాలని, అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం కూడా ఉండదని భావిస్తున్నట్టు కూడా తెలిపింది. ‘‘హైదరాబాద్ శాంతిభద్రతలు, రెవెన్యూ అంశాలను కేంద్రంచేతికి అప్పగించడంపై కూడా మల్లగుల్లాలు పడ్డారు. బిల్లు, జీవోఎం నివేదిక కలిపి 70 పేజీల దాకా ఉంటాయని జీవోఎం వర్గాలు తెలిపాయి’’ అని వివరించింది. మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్లో షిండే అధ్యక్షతన జరిగిన జీవోఎం భేటీలో సభ్యులు పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. జీవోఎం ఏర్పాటయ్యాక ఇలా మొత్తం సభ్యులు సమావేశం కావడం ఇదే తొలిసారి! జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా భేటీలో పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణలతో పాటు జీవోఎం సిఫార్సులను ముసాయిదా బిల్లులో ఎలా చేర్చాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై స్పందనను బట్టి పరిణామాలను అంచనా వేయడానికి వీలుగా నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకున్నట్టు సమాచారం. అంతిమంగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాల అమలును ఖరారు చేయడానికే జీవోఎం పరిమితమవుతుందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు సాగించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానించిన తెలంగాణ, తాజాగా తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణల్లో దేనిపైనా తుది నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం వరకు నాన్చి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని జీవోఎం సభ్యులు భావిస్తున్నారు. రెండు ప్రతిపాదనలనూ కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి అక్కడ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ముగించకుండా, విరామమిచ్చి జనవరి వరకు పొడిగించడానికి సమాయాత్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాగే సాగతీత ధోరణి కొనసాగిస్తే తెలంగాణ బిల్లును 2014లోనే పార్లమెంటు ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే రాయల తెలంగాణపైనా హడావుడిగా ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం దాకా సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరి సాంబశివరావు తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాటలను బట్టి చూస్తుంటే రాయల తెలంగాణపై జీవోఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ మేరకే ముసాయిదా బిల్లు తయారవుతోందని కూడా చెబుతున్నారు. జీవోఎం నివేదిక కూర్పుపై కసరత్తు సిఫార్సులను ముసాయిదా బిల్లులో పొందుపరచడంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జీవోఎం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్లో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రత, జన వనరుల పంపిణీ పర్యవేక్షణకు బోర్డులు, శాంతిభద్రతల సమస్య, మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఉమ్మడి కార్యాచరణ తదితరాలు ముసాయిదాలో ఎలా ఉండాలనే దానిపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటిపై సభ్యుల సూచనల మేరకు జైరాం సాంకేతిక కసరత్తు చేస్తున్నారు. సాయంత్ర 6.20కి జీవోఎం భేటీ ముగిశాక కూడా ముసాయిదా బిల్లు రూపకల్పన కసరత్తులో షిండే, జైరాం తనమునకలుగా గడిపారు. ఈ కసరత్తు భేటీ తర్వాత రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు బిల్లు ముసాయిదా ప్రతిలో పొందుపరిచిన భాష, వాక్య నిర్మాణం సముచితంగా లేవని చిదంబరం అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అంతకుముందు విభజన అనంతరం తెలంగాణ శాంతిభద్రతల అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులతో ఉదయం 11 గంటలకు షిండే సమీక్ష జరిపారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారి శశిధర్రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతో పాటు నక్సలిజం పెరిగే అవకాశాలు, మతపరమైన ఘర్షణలకు సంబంధించిన అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం జైరాంతో గంట పాటు షిండే భేటీ అయ్యారు. నివేదికకు తుదిరూపు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడ్డారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు, న్యాయపరమైన చిక్కులను దాటడం, జల వనరుల బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించారు. అనంతరం న్యాయ, జలవనరుల శాఖల అధికారులను జైరాం పిలిపించుకుని మాట్లాడారు. 371డి, 371ఇ అధికరణాలపై కూడా చర్చ జరిపారు. 371ను ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాయల తెలంగాణ గురించి తనకు తెలియదని జైరాంతో భేటీ అనంతరం షిండే విలేకరులతో అన్నారు. ‘విభజనపై ఇదే చివరి భేటీ. ఈ రోజు జీవోఎం నివేదికను ఆమోదిస్తాం. 5న కేబినెట్ సమావేశం ఉంటుంది. నివేదికను కేబినెట్కు అందించాక అంతా ప్రధానే చూసుకుంటారు’ అంటూ వెళ్లిపోయారు. సీమాంధ్ర మంత్రుల ‘యూటీ’ యత్నాలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్పై తాము కోరుతున్న మేరకు ఆంక్షలు విధించేలా చేసేందుకు తుది ప్రయత్నాలు చేశారు. జీవోఎం సమావేశానికి ముందు షిండేను కేంద్ర మంత్రి చిరంజీవి ఆయన కార్యాలయంలో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హైదరాబాద్ను శాశ్వత యూటీ చేయాలని మరోసారి ప్రతిపాదించారు. మరో మంత్రి జేడీ శీలం కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ను కలిసి, హైదరాబాద్ను యూటీ చేయాలన్న డిమాండ్ను పరిగణించాలని కోరినట్టు తెలిసింది. కానీ వారి విజ్ఞప్తికి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ‘యూటీతో ఏ ప్రాంతానికీ పెద్దగా లాభం ఉండకపోవచ్చు. హైదరాబాద్లోని సీమాంధ్రుల భద్రత దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అప్పగించే కసరత్తు చేస్తున్నాం’ అని షిండే, సిబల్ చెప్పారంటున్నారు. ఇక జీవోఎం భేటీ అనంతరం షిండే, జైరాంలతో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, శీలం సమావేశమై, ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరారు. అనంతరం బయటికొచ్చిన కావూరి, మీడియాతో మాట్లాడేందుకు ఆస్తకి చూపలేదు. కేంద్రం రాయల తెలంగాణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందంటూ వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని శీలం అన్నారు. -
రాయల తెలంగాణపై ఎవరేమన్నారంటే...
కాంగ్రెస్ పార్టీకి నష్టమే : వీహెచ్ నార్కట్పల్లి న్యూస్లైన్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ కాకుండా, రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టం కాకుండా, ఒకవేళ రాయల తెలంగాణ ఇస్తే తిరిగి ఉద్యమిస్తామని చెప్పారు. మేం పూర్తిగా వ్యతిరేకం : సీహెచ్. విద్యాసాగర్రావు నల్లగొండ, న్యూస్లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుందన్నారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ 12 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ ప్రతిపాదన ఓ బలవంతపు పెళ్లి : దాసోజు శ్రవణ్కుమార్ కనగల్, న్యూస్లైన్ : రాయల తెలంగాణ నిర్ణయం బలవంతపు పెళ్లి లాంటిదని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం కనగల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు 1956లో ఆంధ్రకు, తెలంగాణకు బలవంతంగా పెళ్లి చేసి వేలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు అదే తరహాలో రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణతో కలపాలని చూస్తుందని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను తాము ఒప్పుకోమన్నారు. మరో మహోద్యమం తప్పదు : సీపీఐ ఎమ్మెల్యే మల్లేష్ బెల్లంపల్లి, న్యూస్లైన్ : కేంద్రం రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మరో మహోద్యమం చేపడతామని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ రాష్ట్రం కావాలని అనంతపురం, కర్నూలు ప్రాంతాల ప్రజలు ఏనాడూ కోరలేదన్నారు. అయినా, స్వార్థపూరితంగా కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్లో రాయల తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకొని తీరుతామన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విజయయాత్ర రెండో రోజైన మంగళవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప రాయల తెలంగాణ వద్దన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చిన సీఎం కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు ఇప్పుడు సమైక్యాంధ్రనడం సిగ్గు చేటన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ 2004లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవెందర్రెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రాన్ని అడ్డుకోవాలంటే మద్దతు ఉపసంహరించాలి
హైదరాబాద్: అడ్డగోలు విభజనతో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న యూపీఏ ప్రభుత్వ తీరును అడ్డుకోవాలంటే సీమాంధ్ర ఎంపీలంతా తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈ దిశగా ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు వారి ఇళ్ల ముందు ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మంగళవారం ఇక్కడ సమావేశానంతరం పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త వి.ల క్ష్మణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు సీమ ఎమ్మెల్యేల మద్దతుతో ఆమోదం తెచ్చుకునే కుట్రలో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. 1,700 గ్రామపంచాయతీలు రాయల తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినట్టుగా బోగస్ వివరాలను అధికారులు కేంద్రం ముందుంచారని, ఆయా గ్రామ పంచాయితీల మినిట్స్ పుస్తకాలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో విభజన అంశంపై చర్చ రోజున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని, డిసెంబరు 9న విద్రోహ దినంగా పాటిస్తున్నామని తెలిపారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ అందించిన రహస్య నివేదికను బహిర్గం చేయాలని, మీడియాలో వచ్చిన అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు సీమాంధ్ర ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్యాకేజీలకు అమ్ముడుపోయి మోసం చేస్తున్న సీమాంధ్ర నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ ఎ.వి.పటేల్ అన్నారు. సీమాంధ్రులు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే ప్రెస్క్లబ్ కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు. సీమాంధ్రకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, దివాకరరెడ్డి లాంటి నేతలు పదవీ కాంక్షతో రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనకేసుకొస్తున్నారని, వీరికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అండ ఉందని సమైక్యాంధ్ర ఐటీ జేఏసీ చైర్మన్ శివశంకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని, దీన్ని నిరోధించటం ఎవరితరం కాదని న్యాయవాది రామకృష్ణ పేర్కొన్నారు. -
రాయలతెలంగాణపైనే తర్జనభర్జన
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా రాయలతెలంగాణపై తర్జన భర్జనపడుతోంది. ఈ రోజు సాయంత్రం జరిగిందే జిఓఎం తుది సమావేశం అనుకున్నారు. ఢిల్లీ నార్త్బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారధ్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యారు. జిఓఎం సభ్యులు చిదంబరం, ఎకె ఆంటోని,వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి, జైరాం రమేశ్లతోపాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరాలు, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది. ఎక్కువగా రాయల తెలంగాణపైనే చర్చ జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపుగానీ, ఎల్లుండి గానీ మళ్లీ జిఓఎం సమావేశం జరిగే అవకాశం ఉంది. జిఓఎం ప్రతిపాదించిన అంశాలు: రాయల తెలంగాణకే మొగ్గు - ఇరురాష్ట్రాలకూ సమానంగా 21 చొప్పున లోక్సభ స్థానాలు - 147 చొప్పున శాసనసభ స్థానాలు - ఉమ్మడి రాధానిగా హైదరాబాద్ - జిహెచ్ఎంసి పరిధి వరకూ ఉమ్మడి రాజధాని - గవర్నర్ చేతికి శాంతి భద్రతల వ్యవహారం - రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా - ఇరురాష్ట్రాలకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) వర్తింపు- రాజ్యాంగ సవరణలేకుండానే విభజన - తెలంగాణకే భద్రాచలం - కృష్ణా జలాపంపిణీకి నీటి నిర్వహణ బోర్డు - పీపీఏల నుంచి తెలంగాణకు విద్యుత్ - కొన్నొళ్ల పాటు ఉమ్మడి సర్వీసుల విధానం అమలు. ఒకే సంస్కృతి, సంప్రదాయాలు గల రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విడదీయాలనుకోవడం బాధాకరం. సీమ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరుచేసి రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆ ప్రాంత నాయులు ఎవరూ అంగీకరించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసంమే కాంగ్రెస్ అధిష్టానం ఈ దారుణానికి పాల్పడుతోందని స్పష్టపోయింది. పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణను ఒప్పుకోమని తెలంగాణవాదులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ జెఏసి నేతలు ఈరోజు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిశారు. తాము రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్నాథ్ సింగ్ వారికి చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాయలతెలంగాణకు ఒప్పుకునేదిలేదని తెగేసి చెప్పారు. అలా చేస్తే మరో యుద్ధమేనని హెచ్చరించారు.ఈ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్కు కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుగా పేర్కొన్న తెలంగాణ బిల్లు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ ముందుకు వస్తుందని సమాచారం. జిఓఎం నివేదిక, బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రి మండలి చర్చించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటునుంచి అసెంబ్లీకి పంపుతారు. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి పది రోజుల గడువు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలన్న బిజెపి డిమాండ్ - అఖిలపక్ష సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపధ్యంలో ఈ నెల 5 ప్రారంభమయ్యే సమావేశాలను 20వ తేదీ వరకు కొనసాగిస్తారు. ఒక వారం విరామం తరువాత ఈ నెల 27న తిరిగి ప్రారంభించేయోచనలో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అధిష్టానం సూచనల మేరకే ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం తరువాత, పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించేవిధంగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎటూ సమావేశాల కాలాన్ని పొడిగిస్తారు. 2009 డిసెంబర్ నెల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా నిలిచిందో, రాష్ట్ర విభజన ప్రక్రియలో ఈ డిసెంబర్ నెల అంతే అత్యంత కీలకం కానుంది. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
-
ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
-
'రాయల'కు నిరసనగా 5న తెలంగాణ బంద్: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటుపై వార్తలు మీడియాలో వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు తెర తీస్తోంది. పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కోసం బుధవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎలాంటి అంక్షలు లేని తెలంగాణ కోసం డిసెంబర్ 5 తేదిన బంద్ కు పిలుపునిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలతోపాటు ఇతర సంస్థలు బంద్ కు సహకరించాలని ఆయన అన్నారు. ఇది తెలంగాణలో ప్రతి ఇంటికి సంబంధించిన విషయమని కేసీఆర్ వ్యాఖ్యాలు చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై తమకు విశ్వసనీయమైన సమాచారం ఉంది అని.. అందుకే నిరసన తెలుపుతున్నామని కేసీఆర్ అన్నారు. రాయల తెలంగాణను ఎవరు అడిగారు అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తామని కేసీఆర్ హెచ్చరించారు. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తాం అని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయల తెలంగాణ నిర్ణయానికి ఒప్పుకోమని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని.. మా పిల్లల చేసిన త్యాగాలు రాయల తెలంగాణ కాదు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది అని, ఆ నిర్ణయాన్ని కేబినెట్ కూడా అంగీకరించింన విషయాన్ని ఆయన తెలిపారు. అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయమతుందన్నారు. అలాగే షరతులతో కూడిన తెలంగాణకు అంగీకరించం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల శ్రమ అని, ప్రాణ త్యాగాలకు పాల్పడింది రాయల తెలంగాణ కోసం కాదని కేసీఆర్ అన్నారు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా జీవోఎం చర్చిస్తుందని తాము మంత్రుల బృందాన్ని ప్రశ్నించామన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, పోరాటం జరిగింది అని, తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరామని కేసీఆర్ తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నామని.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రమవుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన 28 రాష్ట్రాలకు వర్తించే విధంగానే తెలంగాణకు కూడా అవే నిబంధనలు, విధానాలు ఉండాలి అని జీవోఎం సభ్యులకు తెలిపాను అని మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత రాజ్యంగంలో ఏముందో తమకు తెలుసు అని.. ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనే విషయం తమకు తెలుసు అని ఆయన అన్నారు. ఉన్నపళంగా వారిని వెళ్లమని కోరితే బాగుండదనే విషయం కారణంగా ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామన్నారు. గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వెలువడుతున్నా.. తాము అడ్డదిడ్డంగా మాట్లాడటం ఇష్టం లేక టీఆర్ఎస్ స్పందించలేదని తెలిపారు. రాయల తెలంగాణ అంటే మరో యుద్దం తప్పదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
మంత్రులు బృందం (జీవోఎం) తుది సమావేశంగా భావించిన భేటిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నార్త్ బ్లాక్ లో ముగిసింది. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలా లేదా 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ప్రకటించాలా అనే అంశంపై తర్జన భర్జన పడిన సభ్యులు ఎటూ తేల్చకుండానే మరోసారి రేపు కలిసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. గంటకు పైగా జీవోఎం భేటి అనంతరం ఆజాద్ మాట్లాడుతూ.. ఇదే చివరి భేటి కాదు. రేపు ఉదయం మళ్లీ సమావేశమవుతామని ఆజాద్ తెలిపారు. మంగళవారం సమావేశానికి కొనసాగింపుగా మరో భేటి ఉంటుంది అని ఆజాద్ అన్నారు. కేబినెట్ సమావేశానికి ముందు మరోసారి జీవోఎం నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సభ్యులు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులందరూ మంగళవారం సాయంత్రం సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలోని నార్త్బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ సమావేశానికి చిదంబరం, ఆంటోని, మొయిలీ, నారాయణ స్వామి, షిండే, జైరాం రమేశ్ లు పాల్గోన్నారు. జీవోఎం భేటికి కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. -
జీవోఎం చివరి సమావేశం ప్రారంభం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి జీవోఎం సభ్యుల చివరి సమావేశం ప్రారంభమైంది. ఈ సభకు కేంద్ర మంత్రుల బృందం పూర్తి స్తాయిలో హాజరైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు. ఢిల్లీలోని నార్త్బ్లాక్లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్ర జరుగుతున్న ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై కేంద్ర జీఓఎంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
'రాయల తెలంగాణతో విభజన సమతూకం'
-
రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ: కోదండరాం
రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చిందని టి.జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం ఆరోపించారు. నాలుగు జిల్లాలతో ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని విభజించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమను విభజించడం వల్ల సీమవాసులకు మేలు జరగదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో మహాత్ముని స్మృతివనమైన రాజ్ఘాట్లో తెలంగాణ నేతలు చేపట్టిన మౌన దీక్ష ముగిసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనేది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే విభజించాలని ఆయన పేర్కొన్నారు. జులై 30వ తేదీన తెలంగాణపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్నే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని జాతీయ పార్టీ నేతలను కలసి రాయల తెలంగాణను వ్యతిరేకించాలని కోరతామని చెప్పారు.10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కేంద్రానికి హితవు పలికారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ తీసుకురావలసిన బాధ్యత టి.కాంగ్రెస్ నేతలదే ఆయన వ్యాఖ్యానించారు. అలాకాకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రొ.కోదండరాం ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. -
'రాయల తెలంగాణతో విభజన సమతూకం'
హైదరాబాద్ : రాయల తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అంగీకరించారని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన సంతోషకరమన్నారు. రాయల తెలంగాణ అంశంలో కరుణించిన సోనియాకు.... సహకరించిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు జేసీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. రాయల తెలంగాణతో రాష్ట్ర విభజన సమతూకంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతను నివారించడానికి కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం ఉపయోగకరమని జేసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బళ్లారి కలిసినప్పుడే రాయలసీమ విడిపోయిందని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు గతంలో నిజాం పాలనలో ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కత్తులు, కటార్ల సంస్కృతి కర్నూలు...అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు తరలిందని జేసీ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని తనతో చెప్పిన తెలంగాణ ప్రాంత నేతలు బాహాటంగా అంగీకరించకపోవటం దురదృష్టకరమని ఆయన అన్నారు. కాగా ఈ సందర్భంగా అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ .... రాయల తెలంగాణ కాదని... రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరండని జేసీకి సూచించారు. -
పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్న కేసీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. రాయల తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల తెలంగాణ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేతలు కేసీఆర్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రాయల తెలంగాణను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రాయల తెలంగాణ చేస్తామని అనుకుంటే మీ ఖర్మ. మేమైతే ఆ ప్రతిపాదనకు సహకరించపోగా వ్యతిరేకంగానే ఉండాల్సి ఉంటుంది’ అని కేసీఆర్... కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను పంపారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదన అధికారికంగా వస్తే ఉద్యమించడానికి సిద్ధం కావాలని పార్టీశ్రేణులను కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని ఫాంహౌస్లో పార్టీ ముఖ్యులతో ఆయన నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణ అనేది పుకార్లు మాత్రమే కావచ్చని అన్నారు. -
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వం: బీజేపీ
కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతో తెలివిగా ప్రయోగించానని భావిస్తున్న రాయల తెలంగాణ అస్త్రం కాస్తా బూమెరాంగ్ అవుతోంది. అన్ని వర్గాల వాళ్లూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ రాజకీయ క్రీడలను చూసి మండిపడుతోంది. కేవలం ఎంఐఎం కోసమే రాయల తెలంగాణ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తీసుకొస్తోందని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఇలాగైతే తాము పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదుట వైద్య జేఏసీ ధర్నా చేసింది. రాయల తెలంగాణ అంశాన్ని వైద్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకే సీమాంధ్ర నేతలు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి జీవన్రెడ్డి మండిపడ్డారు. 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రమన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కాదని, రాయల తెలంగాణ సిఫార్సును జీవోఎం చేయడం నిబంధనలను వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణకు ముడిపెట్టడమంటే జోన్ 4ను విభజించడమేనని, అప్పుడు 371 (డి) ఆర్టికల్ను సవరించాల్సి వస్తుందని, అలా సవరించకపోతే విభజన ప్రక్రియ కోర్టులో నిలవదని జీవన్ రెడ్డి చెప్పారు. -
రాయల తెలంగాణ గురించి నాకు తెలియదు: షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే .... రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏమీ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని... జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది. -
రాయలతెలంగాణ గురించి నాకు తెలుయదు:షిండే
-
'కర్నూలు వదిలించుకునేందుకే రాయల తెలంగాణ'
న్యూఢిల్లీ : రాయల తెలంగాణకు ప్రతిపాదనకు తెలంగాణ జేఏసీ వ్యతిరేకమని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ 12 జిల్లాల తెలంగాణ తమకు ఆమోదం కాదన్నారు. కర్నూలు వదిలించుకునేందుకే కొందరు సీమాంధ్ర నేతలు ఈ ప్రతిపాదన చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్ వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకునేందుకే కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. కేంద్ర కేబినెట్ ముందుకు రాయల తెలంగాణ బిల్లును వస్తే.. ఆ బిల్లు పార్లమెంట్లోకి రాకముందే తెలంగాణలో సకలజనుల సమ్మెను మించిన ఉద్యమాన్ని ఉద్యోగులు చేపడతారని హెచ్చరించారు. -
రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ
-
రాయల ఒప్పుకోం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 125వరోజూ సోమవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. తిరుపతిలో సమైక్యవాదులు తలలపై కుర్చీలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలి పారు. మదనపల్లెలో జేఏసీ నేతలు సదస్సు నిర్వహించి విభజన వల్ల రాయలసీమకు జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో విద్యార్థులు ‘వుయ్ హేట్ టీ బిల్’ అక్షరాకృతిలో కూర్చుని కేంద్రప్రభుత్వ తీరుపై నిరసనృవ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ పాలకొల్లు, నరసాపురం, మార్టేరు పట్టణాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. కృష్ణాజిల్లా కలిదిండిలో కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. అవనిగడ్డలో దీక్షలు 100వ రోజుకు చేరిన సందర్భంగా 100మంది విద్యార్ధులు ఒకరోజు దీక్ష చేపట్టారు. -
సర్దుబాటు అంటే సమరమే..
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఓ వైపు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సర్దుబాటు చేసుకోవాలనడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్రావు అన్నారు. సర్దుబాటు చేసుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటని, తెలంగాణ ప్రజలు మి మ్మల్ని వచ్చే ఎన్నికల్లో సర్దిపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆంక్షలు లేని హైదరాబాద్, భద్రాచలం, మునగాలతో పది జిల్లాల తెలంగాణ సాధించుకుంటామన్నారు. టీఆర్ఎసీవీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జెడ్పీ మైదానంలో పాలమూర్ విద్యార్థి పోరుగర్జన బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన హరీష్రావు మాట్లాడుతూ.. ఆర్డీఎస్ తూములను బాంబులతో బద్దలుకొట్టిన సీమ నాయకులను తెలంగాణలో ఎలా కలుపుకుంటామన్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితే నీటి దోపిడీకి తావుండదనే రాయల తెలంగాణ అంటున్నారని విమర్శించారు. ఈ మోసాలను పసిగట్టకుండా టి.కాంగ్రెస్ నాయకులు సర్దుకుపోవాలంటే విద్యార్థులు వారిపై పోరాటం చేస్తారని హెచ్చరించారు. రాయల తెలంగాణ అంటే వెనకబడిన పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు. సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూకు రూ.ఏడువేల కోట్లు దోచిపెడుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ మంత్రులను హరీష్రావు ప్రశ్నించారు. సీఎంకు మద్దతు తెలిపితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ కేసీఆర్ ఆమరణదీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని టి.హరీష్రావు చెప్పారు. 1200 మంది బలిదానాలు చేసింది 13 ఏళ్ల పోరాటం చేసింది ఆంక్షల తెలంగాణ కోసం కాదన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ పది జిల్లాల్లో కేవలం రెండు కాలేజీలు ఉన్నాయన్నారు. తెలంగాణ సమాజం కలలు గన్న తెలంగాణ రాష్ట్రం రావాలంటే టీఆర్ఎస్ను బలపర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంపై టీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. ఈ ప్రాంతం దోపిడీకి గురికావడానికి వారే కారకులన్నారు. ఇక్కడి విద్యార్థులు, యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలన్నారు. రాయల అంటే మరో యుద్ధమే.. రాయల తెలంగాణ అంటే మరో యుద్ధం తప్పదని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పొలిట్బ్యూరోసభ్యులు ఏపీ జితేందర్రెడ్డి, ఇబ్రహీం హెచ్చరించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని పలికిన చంద్రబాబుకు తెలంగాణలో 1200 మంది బలిదానాలపై ఎందుకు చలించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకుంటుంటే సిగ్గు, రోషం లేకుండా ఆ పార్టీలో ఎలా ఉంటారని టీటీపీపీ నాయకులు నిలదీశారు. టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్లో కలువదన్నారు. కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా కుమ్మకైయ్యారని, ఆంక్షలతో కూడిన తెలంగాణ ప్రకటించే టి.కాంగ్రెస్ నాయకులను బట్టలూడదీసి తరిమికొడతామని టీఆర్ఎసీవీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ప్రాణాలు అర్పించింది.. వంద కేసులకు బెదరకుండా పోరాటం చేసింది ఆంక్షల తెలంగాణ కోసమేనా? అని ప్రశ్నిం చారు. టీ కాంగ్రెస్ నేతలు ఎటువైపు నిలబడతారో తేల్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు గౌతం శ్రీను, కిరణ్కుమార్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, ఆల వెంకటేశ్వరెడ్డి, హర్షవర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ రెండు జిల్లాలను కలిపినా అది తెలంగాణే
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపినా కూడా.. తెలంగాణ తెలంగాణగానే ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాయల తెలంగాణపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయాన్ని తాను ఖండించదలచుకోలేదని బదులిచ్చారు. ‘సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.. కానీ సీమలోని రెండు జిల్లాలు అనంతపురం, కర్నూలులను కూడా తెలంగాణతో కలిపితే అది రాయల తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లవుతుంది కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘ముందు జీవోఎం నివేదికలో ఏముందో బహిర్గతం కానివ్వండి. దాని సిఫారసుల కోసం వేచిచూద్దాం’’ అని ఆయన బదులిచ్చారు. జీవోఎం సిఫారసుల ఆధారంగా ముసాయిదా బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారని, ఆ తర్వాతే దీనిపై తాను స్పందిస్తానని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము జరుపుతున్న ప్రైవేటు చర్చల వివరాలను బహిరంగపరచలేమన్నారు. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే అభిప్రాయం కోరుతూ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందన్నారు.