
విశాఖ స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించగలరా?
- పీలేరు ఎమ్మెల్యే చింతల సవాల్
పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దైర్యం ఉంటే విశాక భూస్కాంపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పీలేరులో ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులో మాట్లాడుతూ.. తాను నిప్పునని నిత్యం చెప్పుకుంటున్న సీఎం, తన మంత్రివర్గ సభ్యులు ఏ తప్పు చేయనపుడు సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పెద్దలు తప్పు చేయలేదని నమ్మకం ఉంటే ఏ విచారణకైనా సిద్దం కావాలి తప్ప తాను ఆడించినట్లు ఆడే వారితో ‘సిట్’ వేయడమేంటని నిలదీశారు. సీఎం సహా టీడీపీ నేతలకు జగన్ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
దేశంలో మరెక్కడా ఇంత పెద్ద స్కాం జరగలేద్నారు. రికార్డులు తారుమారు చేసే హుద్హుద్ తుఫాన్లో రికార్డులు గల్లంతయ్యాయని చెప్పడం దుర్మార్గమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి విశాఖ ప్రజల భూములను బలవంతగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేవలం దోచుకోవడం, దాచుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అక్రమాలు, స్కాంలపై విచారణకు సిద్ధం కాకుండా ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగడం టీడీపీ నేతల దిగజారుగుతనానికి నిదర్శమన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా వర్ల రామయ్యను ప్రజలు తిరస్కరించారని, అయితే సీఎం వద్ద తన మనుగడ కాపాడుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని చింతల రామచంద్రారెడ్డి అన్నారు.