చార్జీల పెంపు ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ ప్రజలపై రూ.600 కోట్ల భారం వేయడం దురదృష్టకరమని వైఎస్సార్ ఆర్టీసీ
అక్రమ రవాణా అరికడితే ఆర్టీసీ పురోగతి
Published Sun, Nov 17 2013 1:48 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
వినుకొండ, న్యూస్లైన్ :చార్జీల పెంపు ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ ప్రజలపై రూ.600 కోట్ల భారం వేయడం దురదృష్టకరమని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి చెప్పారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అక్రమ రవాణా అరికట్టినట్లయితే ప్రజలపై పైసా భారం పడకుండా ఆర్టీసీని పురోగతిలో నడిపించ వచ్చన్నారు. యూనియన్ను ఈ ఏడాది ఏప్రిల్ 29న ఏర్పాటు చేశామని, అనతికాలంలోనే పది వేల మంది కార్మికులను సభ్యులుగా చేర్చినట్లు చెప్పారు.
ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్లు దొందూదొందే అన్నట్లు వ్యవహరిస్తూ సంస్థ పరిరక్షణ, 2013 వేతన సవరణ తదితర సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపుతున్నాయని విమర్శించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఏ ముఖ్యమంత్రీ చేయనివిధంగా ఆర్టీసీకి టాక్స్ తగ్గింపులోను, రాయితీలు నూరు శాతం చెల్లించడంతో తెగువచూపారని, సుమారు రూ.500 కోట్ల సాయం అందించారని గుర్తుచేశారు. అందుకు కృత జ్ఞతగానే వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 5 వేల ప్రయివేటు బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయని, వీటి వల్ల ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వస్తోందన్నారు.
ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి తక్షణమే వేతన సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని డిపోల్లో వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ నిర్మాణం చేసి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా ముందుకుసాగనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ. నారాయణరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సీబీఎస్ రెడ్డి, స్థానిక డిపో అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి పరసా పుల్లయ్య, ఎస్ఎన్ రెడ్డి, గోపాల్రెడ్డి, బాజి, రామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement