
ఐఏఎస్ అధికారుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి
మంచి అనుభవంగల ఉన్నతాధికారుల బృందం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తనకు మంచి అనుభవంగల ఉన్నతాధికారుల బృందం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడలోని బెరంపార్కులో ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన గెట్ టు గెదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
అనుభవజ్ఞులైన ఐఏఎస్ల మార్గదర్శకత్వం, సహకారంతో ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం తనకు కలిగిందన్నారు. కలెక్టర్ల సదస్సులో తన మదిలో ఉన్న ఆలోచనలు అందరితో పంచుకున్నానన్న సీఎం వైఎస్ జగన్.. ఐఏఎస్ అధికారుల ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. సంఘం అధ్యక్షుడు మన్మోహన్సింగ్ ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి ఈ కార్యక్రమంలో మాట్లాడారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం)